దళితవాడల్లో శ్రీవారి దర్శనం...
x
తిరుమల శ్రీవారి ఆలయం. దళితగోవిందం కల్యాణోత్సవం (ఫైల్)

దళితవాడల్లో శ్రీవారి దర్శనం...

టీటీడీ తిరుమల జేఈఓ పోస్టులో ఒక దళిత, గిరిజనుడికీ ఛాన్స్ దక్కలేదు..


దళిత గోవిందం స్ఫూర్తితో రాష్ట్రంలో మత మార్పిడుల నివారణకు దళితవాడల్లో వెయ్యి శ్రీవారి ఆలయాలు నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Tirupati Devasthanams TTD ) తీర్మానించింది. శ్రీవాణి ట్రస్టు నిధులతో 3.615 ఆలయాల నిర్మాణం చేపట్టగా, వాటిలో 722 మాత్రమే పూర్తయ్యాయి. బడ్జెట్ సరిపోని కారణంగా అర్ధంతరంగా మిగిలిన ఆలయాలు పూర్తి చేయడానికి ఐదు నుంచి పది లక్షలు, పది నుంచి 15, లక్షలు, 15 నుంచి 20 లక్షలుగా మూడు శ్లాబుల్లో బడ్జెట్ పెంచినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వెల్లడించారు.

టీటీడీ 93 సంవత్సరాల చరిత్రలో ఇప్పటికీ దళిత, గిరిజన ఐఏఎస్ అధికారులను ఈఓ ( Executive Officer), తిరుమల జేఈఓ (Joint Executive Officer), చైర్మన్ ( Chairman) గా ఒకరిని కూడా ప్రభుత్వాలు ఎందుకు నియమించలేదని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దళితవాడల్లో గుడులు కాకుండా, బడులు ఏర్పాటు చేయడం ద్వారా జ్ణానం పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తే అణగారిన వర్గాలకు ఊతం దొరుకుతుందని దళిత సంఘాలు చెబుతున్నాయి.
"ధర్మ ప్రచారానికి పరిమితం కావాల్సిన టీటీడీ మత సంక్షేభం సృష్టించే ప్రయత్నాల వేగం పెంచింది" అని కడప అంబేడ్కర్ మిషన్ చైర్మన్ సంపత్ కుమార్ ఆరోపించారు.
మాలవాళ్లకి ప్రత్యేక వేంకటేశ్వరుడు

తిరుమలతో పాటు అనేక ఆలయాల్లోకి దళితులను రానిచ్చేవారు కాదు. కొన్ని ప్రాంతాల్లో ఆ వివక్ష ఇంకా కొనసాగుతోంది. వందేళ్ల కిందట మహాత్మాగాంధీ ఉద్యమ ఫలితంగా దళితులకు ఆలయ ప్రవేశం దక్కిందనేది చరిత్ర చెప్పే పాఠం. ఆ రోజు వరకు తిరుపతి నగరం కపిలతీర్ధం సమీపంలో శేషాచలం కొండల కింద అంటే, తిరుమల మొదటి ఘాట్ రోడ్డు కింద మాల్వాడి గుండం వద్దకు వెళ్లి ముక్కులు చెల్లించే వారు. తిరుమల కొండల పైనుంచి జాలువారే జలపాతానికి ఇప్పటికి మాల్వాడి (మాల వాడి) గుండంగా పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.
టీటీడీ బోర్డు 93 సంవత్సరాల చరిత్రలో ఈఓలుగా దాదాపు 53 మంది ఐఏఎస్ అధికారులు, 54 మంది చైర్మన్లుగా పనిచేశారు. ప్రస్తుతం టీటీడీ ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్, చైర్మన్ గా బీఆర్.నాయుడు పనిచేస్తున్నారు.
తిరుపతి జేఈఓ పోస్టులో మినహా, దళిత, గిరిజన ఐఏఎస్ అధికారికి ఈఓ, తిరుమల జేఈఓ పోస్టు దక్కలేదు. 1978లో భూతలింగం అనే దళిత ఐఏఎస్ అధికారి తిరుమల జేఈఓగా నియమితులయ్యారు. ఆయనకు ఉత్సవాల సమయంలో కంకణం కట్టలేమని అర్చకులు తేల్చేశారు. దీంతో ఈఓ వెంకటపతిరాజు విధుల్లోకి తీసుకోని కారణంగా భూతలింగం అదేరోజు సాయంత్రం హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయిన ఘటనను సీపీఎం నేత కందారపు మురళీ గుర్తు చేశారు. ఈ చేదు నిజానికి తోడు టీటీడీలో దళిత రాజకీయ ప్రతినిధికి చైర్మన్ పదవి కూడా దక్కని విషయం కూడా ఆయన ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో
రాష్ట్రంలోని దళితవాడల్లో వెయ్యి ఆలయాలు నిర్మిస్తామని తిరుమలలో నాలుగు రోజుల కిందట జరిగిన టీటీడీ పాలక మండలిలో చేసిన తీర్మానాలు చైర్మన్ బీఆర్. నాయుడు వెల్లడించారు.
"మత మార్పిడులు నివారించడానికి దళితవాడల్లో వెయ్యి ఆలయాలు నిర్మిస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఆరు ఆలయాలు శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆర్థికసాయం అందిస్తాం" అని బీఆర్. నాయుడు వెల్లడించారు.
వైఎస్ఆర్ పాలనలో ప్రారంభం..
ఈ కార్యక్రమం నిజానికి టిటిడికి దళితుల పట్ల ఆసక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన 2004 ప్రారంభమయింది. దీనివెనక రాజకీయాలున్నాయి. వైఎస్ ఆర్ ముఖ్యమంత్రి అవుతూనే ఆయన క్రిష్టియన్ అనే క్యాంపెయిన్ సోషల్ మీడియాలో బాగా తీవ్రంగా జరిగింది. అంతేకాదు, క్రిష్టియన్ ముఖ్యమంత్రి తిరుమల ఆలయానికి పట్టువస్త్రాలు సతీ సమేతంగా ఎలా ఇస్తాడు అనే చర్చలెేవనెత్తారు. అలాంటపుడు టిటిడి చెయిర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నియమించారు. ఆయన కూడా క్రిష్టియన్ అనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారం మధ్య భూమన 2008లో దళిత గోవిందం ప్రారంభించారు. ఒకప్పుడు వామపక్ష భావాలుండిన కరుణకరెడ్డికి దేవుడిని దళిత వాడల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చింది. ఇలాంటి ప్రయత్నం టిటిడి చరిత్రలో ఎవరూ చేయలేదు. విశిష్టా ద్వైతాన్ని బోధించిన రామానుజాచార్యుల పరంపరను గౌరవించే టిటిడి కుల వివక్ష ఉండ కూడదు. విశిష్టాద్వైతం కులాలకు అతీతంగా భక్తి ద్వారా మోక్షం చూపించే సంస్కరణ వాదం. అందువల్ల దళిత వాడల్లోకి తిరుమలేశుని తీసుకెళ్లాలనుకోవడం వెనక ఏ రాజకీయం ఉన్నా ఒక సంస్కరణ. క్రైస్తవుడని తన మీద ముద్రవేసినందుకు బహుశ ధిక్కారమే ఈ దళిత గోవిందం అనుకోవచ్చు. దీనికి కొనసాగింపుగానే వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన శ్రీవాణి ట్రస్టు ద్వారా దళితవాడల్లో ఆలయాల నిర్మాణం సాగుతోంది.
2014 రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం దళితాసక్తి ని కొనసాగించలేదు. తర్వాత వచ్చిన వైసిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రమయిన క్రైస్తవ ఆరోపణలనుఎదుర్కొంది. జగన్ కుటుంబ సభ్యుడు వైవి సబ్బారెడ్డి చైర్మన్ అయ్యారు. ఆయన మతం చుట్టూ చాలా పెద్ద వివాదం లేచింది. అయితే, తాను అందరికి కంటేఎక్కువ భక్తుడినని చెప్పుకునేందుకు ఆయన ఆలయాల నిర్మాణానికి పూనుకున్నారు. దానికోసం ప్రత్యేకంగా శ్రీవాణి అనే ట్రస్టును ఏర్పాటుచేశారు. తర్వాత మళ్లీ కరుణాకర్ రెడ్డి చెయిర్మన్ అయ్యారు. ఆయన మళ్లీ దళిత వాడల్లో ఆలయాలను కూడా నిర్మించే కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ వివరాలు పరిశీలిద్దాం.
దళిత గోవిందం


తిరుమల నుంచి దళితగోవిందం కల్యాణోెత్సవానికి కంకణాలు (పసుపుదారాలు) తీసుకుని వెళుతున్న భూమన కరుణాకరరెడ్డి (ఫైల్)

2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుపతికి చెందిన భూమన కరుణాకరరెడ్డి వినూత్న కార్యక్రమాలకు తెరతీశారు. వాటిలో ప్రధానమైనవి దళితగోవిందం, మత్స్య గోవిందం, పేద యువతీ, యువకులకు టీటీడీ ద్వారా వివాహాలు జరిపించే కల్యాణమస్తు కార్యక్రమాల తోపాటు ఏజెన్సీలోనే కాకుండా, దళితవాడల నుంచి కూడా ఔత్సాహికులను పిలిపించి, వారికి అర్చకత్వంలో శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు కూడా జారీ చేశారు. దివంగత సీఎం వైఎస్ఆర్ క్రిస్టియన్ అనేది బహిరంగ రహస్యం. సీఎం హోదాలో మినహా ఆయన కుటుంబంతో కలిసి తిరుమలకు వచ్చిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో హిందూ వ్యతిరేకి అనే అపప్రద నుంచి బయటపడేందుకు "మత మార్పడుల నివారణ, శ్రీవారిని దళిత గిరిజనుల చెంతకే తీసుకుని వచ్చేవిధంతా దళిత గోవిందం" కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
"ఇది అంటరానితనానికి ఆధునిక రూపం" అని అప్పట్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న బీవి. రాఘవులు అభివర్ణించారు.
రాజంపేట సమీపంలోని పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు స్వగ్రామం తాళ్లపాకలో మొదట దళిత గోవిందం నిర్వహించిన సమయంలో అభ్యంతరం వ్యక్తమైంది. ఈ సమయంలో సీపీఎం కడప నేత నారాయణ, అంబేడ్కర్ మిషన్ ప్రతినిధి సంపత్ కుమార్ విజిలెన్స్ సిబ్బంది దాడికి కూడా గురయ్యారు.
ఆలయాల నిర్మాణం, దళిత గోవిందం కార్యక్రమంపై అంబేడ్కర్ మిషన్ చైర్మన్, కడపలో సీనియర్ న్యాయవాది సంపత్ కుమార్ ఏమంటారంటే..
"టీటీడీ ఇలా మత ప్రచారం చేయడం నేరం. ధర్మ ప్రచారానికి మాత్రమే పరిమితం కావాలి" అని హితవు పలికారు.
"పెద్ద ఆలయాలకు రావద్దు, మీ వాడలో మాత్రమే మీరు ఉండండి" అని చెప్పే విధంగా వ్యవహరిస్తున్నారు" అని సంపత్ కుమార్ టీటీడీ ప్రకటనపై మండిపడ్డారు.
"ధర్మ ప్రచారంలో ఆలయాలు కట్టడం తప్పు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిబంధనలకు విరుద్ధం. లౌకికరాజ్యంలో ఏ సంస్థ అయినా ఇలా ప్రకటించడం అనేది నేరం" అని కూడా సంపత్ గుర్తు చేశారు. దళితవాడల్లో ఆలయాల నిర్మాణం అనేది తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని ఆయన విశ్లేషించారు.
2006లో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత దళితగోవిందం తెరపైకి తెచ్చారు.
"దళితవాడల్లో శ్రీవారి వైభవాన్ని విస్తరించడం ద్వారా మత మార్పిడులకు అడ్డుకట్ట వేయవచ్చని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి విగ్రహాలను అర్చకులు, వేదపండితులు తిరుమల నుంచి ఎంపిక చేసిన దళితవాడకు తీసుకుని వెళతారు. అక్కడ దళిత దంపతులకు కంకణం కట్టడం వారి ద్వారా స్వామివారి విగ్రహాలకు కల్యాణోత్సం జరపడం. ఆ దంపతులకు వేదాశీర్చనం అందించడం. దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేసి, వారి ఇళ్లలో కలిసి నిద్రించడం" అనే కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
అది నకిలీ గోవిందంగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ( Republic Party of India RPI) దక్షిణ భారతదేశ విభాగం అధ్యక్షుడు పీ. అంజయ్య అభివర్ణించారు.
"కల్యాణోత్సవం వేళ వంటకాలు దళితవాడలో తయారు చేయలేదు. కల్యాణవేదిక వద్ద మంచాలపై అలా పడుకుని వెళ్లిపోయారు. విగ్రహాలు రాత్రి అక్కడ నిద్ర చేయకూడదనే శాస్త్రాన్ని ఉటంకిస్తూ, కల్యాణోత్సవం పూర్తికాగానే ప్రత్యేక వాహనంలో వేదపండితులు తిరుమలకు వెళ్లిపోయేవారు" అని గుర్తు చేశారు.
"2008లో ప్రారంభించిన దళితగోవిందంలో ప్రాణప్రతిష్ట చేయని విగ్రహాలను తీసుకుని వచ్చారు. అవి శ్రీవారి ఆలయంలో కాకుండా ఇప్పటికీ వైఖానస భవన్ వంటశాలలో పడేశారు. అప్పట్లో దళిత సంఘాలతో కలిసి పరిశీలించడానికి వెళితే ప్రత్యేకాధికారిగా ఉన్న ఏవీ. ధర్మారెడ్డి స్వయం గా చూపించారు. కల్యాణోత్సవం సమయంలో కూడా గిల్టు నగలే వాడిన విషయం బయటపడింది" అని ఆర్ఫీఐ అంజయ్య వివరించారు.
శ్రీవాణి ట్రస్టు.. దళితవాడల్లో ఆలయాలు


టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు

రాష్ట్రంలోని నియోజకవర్గానికి ఆరు ఆలయాల వంతున వెయ్యి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆర్థిక సహాయం అందిస్తాం అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ఇది దళితగోవిందానికి కొనసాగింపుగానే ఉంది.
వైసీపీ ప్రభుత్వంలో శ్రీవెంకటేశ్వర ఆలయాల నిర్మాణ ట్రస్టు (Srivani Trust for the Construction of Sri Venkateswara Temples Srivani) దళిత, గిరిజన, మత్స్యకారుల కాలనీల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిధుల సేకరణకు టీటీడీ ద్వారా శ్రీకారం చుట్టారు. దీనికోసం 2018 ఆగస్టులో శ్రీవాణి ట్రస్టు ఏర్పాటుకు టీటీడీ బోర్డులో 338 తీర్మానం ద్వారా ఆమోదించారు. ఇది 2019 అక్టోబర్ నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఈ ట్రస్టు ద్వారా రోజుకు రెండు వెల టికెట్లు టీటీడీ అందుబాటులో ఉంచింది. 400 టికెట్లు రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేస్తున్నారు.
శ్రీవాణి టికెట్ ద్వారా శ్రీవారి దర్శనం కావాలనుకునే యాత్రికుడు రూ. 11,500 చెల్లించాలి. అందులో రూ. 500 వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ జారీ చేస్తారు. మిగతా రూ. పది వేలు ట్రస్టుకు జమ అవుతుంది. ఈ నిధులతో దళిత, గిరిజన, మత్స్యకారుల కాలనీల్లో నిర్ణీత స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ. 10 లక్షలు, 15, 20 లక్షల వరకూ టీటీడీ బోర్డు నిధులు మంజూరు చేస్తోంది.
2025 జూలై నెలలో జరిగిన టీటీడీ బోర్డు మీటింగ్ లో ఇసుక, సిమెంట్, ఇనుము ధరలు పెరిగిన కారణంగా ప్రతి స్లాబ్ బడ్జెట్లో రూ. ఐదు లక్షలు అదనంగా మంజూరుకు బోర్డు చైర్మన్ బీఆర్. నాయుడు సారధ్యంలోని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పూర్తయిన 320 ఆలయాలకు టీటీడీ నుంచి మైక్ సెట్ అందించాలని నిర్ణయించినట్లు కూడా ఆయన వెల్లడించారు.
"దళితవాడల్లో కావాల్సింది. గుడులు కాదు. బడులు అవసరం. దళిత, గిరిజనులకు అక్షరజ్ణానం పెంచుకునే అవకాశం కల్పించండి మహాప్రభో" అని ఆర్పీఐ అంజయ్య డిమాండ్ చేశారు.
"దళిత ఆదివాసీలను అర్చకులను చేయడానికి గుండు గీయించి, గోచీ కూడా పెట్టించారు. మరి జంజెం ( యజ్ణోపవీతం) ఎందుకు ఇవ్వలేదు. ఇవన్నీ కాదు సార్... అణగారిన వర్గాలను జ్ణానవంతులను చేయడానికి పాఠశాలలు ప్రారంభించండి. మెరుగైన చదువు అందించండి" అని ఆర్పీఐ అంజయ్య డిమాండ్ చేశారు.
వెయ్యి కోట్ల నిధులు
శ్రీవాణి ట్రస్టు అందుబాటులోకి వచ్చిన 2019లోనే 26.25 కోట్ల రూపాయలు విరాళంగా జమ అయింది. 2020 లో 70.21 కోట్లు, 2021లో 176 కోట్లు నిధులు సమకూరాయి. ఈ ట్రస్టుపై విమర్శలు చెలరేగడంతో 2023 జూన్ 23వ తేదీ మాజీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి శ్వేతపత్రం ప్రకటించారు.
"జూన్ 31 నాటికి 860 కోట్ల రూపాయలు జమ అయింది. 176 పురాతన ఆలయాల పునరుద్ధరణకు 93 కోట్ల రూపాయలు, వెనుకబడిన ప్రాంతాల్లో ఒకో ఆలయానికి రూ. పది లక్షల వంతున 2,273 ఆలయాల నిర్మాణం, దేవాదాయ శాఖలోని 1953 ఆలయాలు, ఏపీ, తెలంగాణా, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లోని 127 ఆలయాలకు 139 కోట్లు కేటాయించాం" అని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
శ్రీవాణి ట్రస్టుకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే జమ అయినట్లు టీటీడీ అధికారవర్గాల సమాచారం.
"ఈ సొమ్ముతో మత మార్పిడులను నివారించే ప్రధాన లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలోని దళితవాడల్లో ఐదు నుంచి ఆలయాల నిర్మిస్తాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ప్రకటించారు.
దీనిపై సీపీఎం నేత కందారపు మురళీ ఏమంటారంటే..
"ఇదొక అంటరానితనం మినహా మరొకటి కాదు. టీడీపీ కూటమిలో భాగమైన టీటీడీ పాలక మండలి కూడా బీజేపీ అజెండాను అమలు చేస్తోంది. అని మురళీ వ్యాఖ్యానించారు.
"దళితులు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన ఆలయాలకు రావద్దు. వారి వాడలోనే ఆలయానికే పరిమితం కావాలి" అనే స్పష్టంగా చెబుతున్నట్లే ఉందని మురళీ ఆరోపించారు.
టీటీడీ చైర్మన్, తిరుపతి ఈఓ, తిరుమల జేఈఓగా దళిత, ఆదివాసీలను నియమించకుండా, మతం పేరుతో ఈ తరహా దాడి సరైంది కాదని మురళీ అభిప్రాయపడ్డారు.
టీటీడీ పాలక మండలిలో దళితులకు నామమాత్ర ప్రాధాన్యత దక్కుతోంది. పార్టీలకు ఓటు బ్యాంకుగా మారిన దళితులకు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో మాల సామాజికవర్గానికి చెందిన యాదయ్యకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్. రాజు (మాదిగ), కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి (మాల) మాత్రమే అవకాశం దక్కింది. అన్ని పదవువులకు రిజర్వేషన్లు పాటిస్తున్న ప్రభుత్వం టీటీడీలో ఆరుగురు ఎస్సీలు, నలుగురు ఎస్సీలకు అవకాశం ఇవ్వడం లేదని ఆర్పీఐ అంజయ్య ప్రశ్నించారు.
Read More
Next Story