రాజకీయాలకు అడ్డాగా యూనివర్శిటీలు: మాజీ ఎమ్మెల్సీ మాధవ్
x

రాజకీయాలకు అడ్డాగా యూనివర్శిటీలు: మాజీ ఎమ్మెల్సీ మాధవ్

ఏపీలో విద్యాప్రమాణాలు పడిపోయాయని, ప్రణాళిక లేకుండా ప్రాథమిక విద్యలో మార్పులు చేయడం వలన లక్షల మంది విద్యార్థులు,పాఠశాలకు దూరమయ్యారని మేధావులు ఆవేదన వ్యక్తం చేశారు.


ఏపీలో విద్యా ప్రమాణాలు పూర్గిగా పడిపోయాయని, విశ్వవిద్యాలయాలు రాజకీయ కేంద్రాలుగా మారాయని మాజీ ఎమ్మెల్సీ పీ.ఎ. ఎన్ మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 25వ తేదీ ఉదయం జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షతన విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో ‘గాడి తప్పిన విద్యా వ్యవస్థ’ పై జరిగిన చర్చ గోష్టికి ఆయన హజరై ప్రసంగించారు.

మాతృభాషలో నే విద్యా బోధన ఉండాలని ప్రభుత్వాలు మాతృభాషలో అత్యున్నత విద్యాసంస్థల ను ఏర్పాటుచేసి ఆదరించాలన్నారు. వివిధ రాజకీయ భావ జాలలుగా ఉన్నప్పటికీ కేరళ , ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలు విద్యారంగంలో అగ్ర బాగాన ఉన్నాయని తెలియజేశారు.

ప్రధాన వక్తగా విచ్చేసిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఇంచార్జ్ చైర్మన్ ప్రొఫెసర్ కె. ఎస్. చలం ప్రసంగిస్తూ.. ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రాథమిక విద్యను ఉచితంగా అందిస్తున్నాయని, భారత్ మాత్రం వీటిపై దృష్టి పెట్టలేదని చెప్పారు. విద్యారంగంలో ఉన్న అసమానతలే వర్గసమాజాన్ని ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. స్థూల జాతీయ ఉత్పత్తిలో కనీసం ఆరు శాతం విద్యకు కేటాయించాలని ఆరు దశాబ్దాల క్రితమే కొఠారి కమిషన్ పేర్కొన్న నేటికీ అమలు చేయలేదని విమర్శించారు.

జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో గత ఐదుసంవత్సరాలుగా ఒక్క టీచర్ ను గానీ కనీసం ఒక అధ్యాపకుని గాని నియమించలేదని చెప్పారు. ఈ నిర్లక్ష్యం వలన ఏపీలో విద్యా ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ప్రణాళిక లేకుండా ప్రాథమిక విద్యలో పలు మార్పులు చేయడం వలన ఏడు లక్షల మంది విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని తెలిపారు.



మూడు, నాలుగు, ఐదు తరగతుల పిల్లలను ఉన్నత పాఠశాలలకు పంపడం వలన లక్షలాదిమంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారని పేర్కొన్నారు. టోఫెల్, ఐబీ, సీబీఎస్సీ, బైజుస్ లాంటి ప్రయోగాలు చేస్తూ విద్యార్థులలో అయోమయాన్ని రేకెత్తిస్తున్నారని విమర్శించారు. భారత దేశ అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ 30వ స్థానంలో ఉందని, ఎయిడెడ్ విద్యాసంస్థలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పేర్కొన్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయాలయ పూర్వ రిజిస్టర్ ఆచార్య వి. ఉమామహేశ్వరరావు ప్రసంగిస్తూ.. ప్రైవేటు విద్యాసంస్థలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అవకాశం రద్దు చేయడం వలన వారంతా ఉన్నత విద్యకు దూరమయ్యారని వివరించారు. రాష్ట్రంలో విద్య వ్యాపారంగా మారిందని 80 శాతం బీఈడీ కళాశాలలు, లా కాలేజ్ లు బోగస్ విద్యాసంస్థలుగా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

బోర్డ్ ఆఫ్ స్టడీస్, పాలకమండలి, సెనేట్ నిర్ణయాలు లేకుండానే విశ్వవిద్యాలయాల ఉపకులపతులు బోధన, సిలబస్ లు, కోర్సులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం వలన విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ఆంధ్ర విశ్వవిద్యాలయ దూర విద్య కేంద్రం పూర్వ సంచాలకులు ప్రొఫెసర్ పి. హరి ప్రకాష్ తెలిపారు.

కృష్ణ యూనివర్సిటీ పూర్వ ఉప కులపతి సుంకర రామకృష్ణ ప్రసంగిస్తూ రాజకీయ నేతల కబంధహస్తాలలో విద్యాసంస్థలు కొనసాగుతున్నాయని అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయాలు మానవ వనరుల మేనేజ్మెంట్ విభాగ పూర్వ ఆచార్యులు కే. జాన్ ప్రసంగిస్తూ దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వమే స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి నైపుణ్యాలను అందించి ఉద్యోగ కల్పనకు కృషి చేయాలన్నారు.

సామర్ధ్యాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా రాజకీయ కోణంలోనే విశ్వవిద్యాలయాలలో నియమకాలు జరుగుతున్నాయని వివరించారు. సామాజిక కార్యకర్త నర్రా సీతామహాలక్ష్మి ప్రసంగిస్తూ గురువులకు పదవి విరమణ లేదని గురువులను గౌరవించే సమాజమే అత్యున్నత స్థాయికి చేరిందని తెలిపారు.

Read More
Next Story