పెనుకొండలో ఉషా వర్సెస్ సవితమ్మ
x
సవితమ్మ పాదయాత్ర (ఫైల్ పోటో)

పెనుకొండలో ఉషా వర్సెస్ సవితమ్మ

అనంతపురం జిల్లా పెనుకొండ రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు అతివలు హోరాహోరికి తలపడబోతున్నారు...


ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. అనూహ్య మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉన్నట్టుండి అందరి చూపు పెనుకొండ వైపు మళ్లింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరికి మించి మరొకరు ఎత్తులు వేస్తున్నారు. ప్రత్యర్థిని బట్టి అభ్యర్థులు మారిపోతున్నారు. ఇన్నాళ్లూ పెనుకొండలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పార్థసారథికే టికెట్‌ వస్తుందనుకుంటే అనూహ్యంగా అభ్యర్థి మారిపోయారు. అధికార పార్టీ వైసీపీ నుంచి ప్రస్తుత మంత్రి ఉషశ్రీ పెనుకొండ నుంచి పోటీకి దిగడంతో.. టీడీపీ కూడా అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. ఇక్కడ ఉషశ్రీకి పోటీగా కురుబ సామాజిక వర్గానికే చెందిన.. సవితమ్మను బరిలో దింపాలని నిర్ణయించింది తెలుగుదేశం.

ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి బరిలో దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో అందరి చూపు పెనుకొండ నియోజకవర్గం వైపు మళ్లింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథితో పాటు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ టికెట్‌ ఆశించారు. అయితే.. చంద్రబాబు మాత్రం పార్థసారథికే అవకాశం కల్పిస్తారన్న చర్చ జోరందుకుంది.

టీడీపీ నుంచే ఉషశ్రీ ప్రస్థానం...


1976 జూలై 16న అనంతపురం జిల్లా , కళ్యాణదుర్గంలో రత్నమ్మ, కె.విరూపాక్షప్ప దంపతులకు జన్మించిన విద్యావంతురాలు. ఉషశ్రీ చరణ్‌ తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్న సమయంలో 2014లో టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె 2014లో కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టి, పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు చేపట్టారు. 2019లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వరనాయుడుపై 19,896 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. 2022 ఏప్రిల్ 11న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ తరుణంలో కల్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉషశ్రీ సెగ్మెంట్‌ను మార్చిన సీఎం జగన్‌.. ఆమెను పెనుకొండ నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. దీంతో ఉషశ్రీకి పోటీగా సవితమ్మను రంగంలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది టీడీపీ. అయితే.. వీరిద్దరిదీ కురబ సామాజికవర్గమే కావడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.


సవితమ్మ స్థానికురాలు. విద్యావంతురాలు. ఆర్ధికంగా, హార్ధికంగా మంచి పేరుంది. సేవా కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలపై పోరాటం చేసే తత్వం ఉంది. ఉషశ్రీ విషయంలో స్థానికత ప్రధాన భూమిక పోషించనుండగా.. ఇప్పటికే పెనుకొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ వర్గీయులు ఆమె రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉషశ్రీ పెనుకొండ నుంచి పోటీ చేయొద్దని సొంత పార్టీ నేతలే రోడ్డెక్కడం కాస్త ఇబ్బందిగా పరిణమించింది. ఇవన్నీ టీడీపీ అభ్యర్థి సవితమ్మకు లాభించే అంశాలుగా మారాయి.

పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు మంత్రి ఉషశ్రీ. స్థానికత అంశం తెరపైకి రాకుండా ఉండేందుకు.. ఇప్పటికే పెనుకొండలో సొంత ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారామె. ఇక వైసీపీలో ఉన్న గ్రూపులన్నంటినీ ఒక తాటిపైకి తీసుకువస్తూనే.. టీడీపీలో ఉన్న వర్గ విభేదాలను తనకు అనుకూలంగా మలచుకునే వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు పార్థసారథికి టికెట్‌ రాకపోవడంతో కినుక వహించే అవకాశాలున్న నేపథ్యంలో ఆయన్ను అనంతపురం ఎంపీగా బరిలో దింపే యోచన చేస్తోంది టీడీపీ. తద్వారా ఇద్దరు ముఖ్య నేతలకు సముచిత స్థానం కల్పించామన్న చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది.

Read More
Next Story