విరసం సాహిత్య పాఠశాల కార్యక్రమాలు కర్నూలులో ప్రారంభమయ్యాయి. ప్రొఫెసర్‌ సాయిబాబా సహచరి వసంతకుమారి ప్రసంగించారు.


ఉద్యమ జీవితంలో రాజకీయాలు, సాహిత్యం వేర్వేరు కాదని, అవి ఒక దానికి ఒకటి ముడిపడి ఉంటాయని ప్రొఫెసర్‌ సాయిబాబా సహచరి వసంత కుమారి అన్నారు. కర్నూల్‌ నగరంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో రెండు రోజులు పాటు విరసం సాహిత్య పాఠశాల శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముందు అమరవీరుల స్థూపం వద్ద విరసం కార్యకర్తలు జోహార్లు అర్పించారు. విరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ రాజ్యం ప్రశ్నించే కలాలను, గళాలను నిర్బంధించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాజ్యం, మతం పెన వేసుకున్న బంధమైందని అన్నారు. ప్రగతిశీల ఉద్యమ కార్యకర్తలు, కవులు, ఆదివాసీలపై జరుగుతున్న మారణకాండపై మాట్లాడాలని అన్నారు. సంక్షోభాలను ఎదుర్కొనేందుకు చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించాలన్నారు. ఏ రంగంలో కూడా ప్రజా పోరాటాలు తీవ్రస్థాయిలో చేయడం లేదన్నారు.

ప్రొఫెసర్‌ సాయిబాబా సహచరి వసంత కుమారి మాట్లాడుతూ ఫాసిస్టు నిర్బంధంలో నుంచి ప్రొఫెసర్‌ సాయిబాబా విడుదలయ్యాక.. అతని శరీరం చిన్న సమస్యను కూడా తట్టుకోలేక పోయిందన్నారు. అయితే ధైర్యంగా, గట్టిగా పోరాడితే విజయం మనదే అనే సంకేతాలు ఇచ్చేవాడని అన్నారు. సాయిబాబా గొప్ప అధ్యాయన శీలి అని, గొప్ప కవిత్వం రాశాడని, ప్రతి పనిని ప్రణాళిక బద్ధంగా చేసేవాడని అన్నారు.

భావజాల రంగంలో చేయాల్సిన కార్యాచరణను చర్చించేవాడని అన్నారు. సామ్రాజ్యవాదం వ్యతిరేకంగా కవిత్వం రాశాడని, ఆ సమూహాల్ని ఏకం చేయడంలో సఫలీకృతుడయ్యాడని అన్నారు. ఢిల్లీ వెళ్ళాక మధ్య భారతంలో జరుగుతున్న మారణకాండపై, స్త్రీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగిందన్నారు. ప్రగతిశీల కవులకు మానవత్వం, సహానుభూతి ఉండాలని అన్నారు. సమాజ పురోగమనానికి తమ ప్రేమ, పోరాటంలో భాగమైందని అన్నారు.

శివరాత్రి సుధాకర్‌ అధ్యక్షతన జరిగిన రెండో సెషన్‌లో ‘మేదో సృజన రంగాలపై ఫాసిస్టుల దాడి కార్పొరేట్‌ ప్రయోజనాలు’ అన్న అంశంపై ప్రముఖ కవి అల్లం రాజయ్య మాట్లాడుతూ.. రాజ్యం కోసం చేసే యుద్ధం నిలబడుతుందా? లేదా? అనే విషయాలు ప్రజా సంఘాలుగా చెప్పాల్సిందే అన్నారు. అన్ని రకాల భావజాలాలు మందగొండి తనాన్ని వదులుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఫాసిస్ట్‌ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్రమంలో చరిత్రను అధ్యయనం చేసి, ప్రజా పోరాటాలకు సంఘీభావం తెలపాలన్నారు.
మూడో సెషన్‌లో ‘సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రచయితల ధృక్పదాలు వైఖరులు’ అన్న అంశంపై సభను ఉజ్వల్‌ సిఎస్‌ఆర్‌ ప్రసాదులు నిర్వహించారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని ఈ దేశంలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ఏడాదిలో శత వార్షికోత్సవ జయంతి వేడుకల్ని జరుపుకోనుందని, లౌకికత్వం మీద పరోక్షంగా దాడి చేయడం, శాస్త్రీయ విజ్ఞానం పెంచుకునే ప్రయత్నాలు చేస్తే అవన్నీ మన సాధువులు వేల ఏళ్ళ నాడే వాడే వారని చెప్పి తప్పుదోవ పట్టించడం వంటి వాటిని ప్రచారం చేస్తుందన్నారు. సంఘ్‌ పరివార్‌ 7 రకాల ఎత్తుగడల్ని అవలంభిస్తోందన్నారు. ప్రాచీన భారతదేశ చరిత్ర ఘనమైనదని చెప్పడం, హిందువులుగా గుర్తించిన వారందరినీ ఒక గొడుగుకింద తీసుకురావడం, దేశం ఎదుర్కొంటున్న అన్ని రకాల ఉపద్రవాలకు ముస్లీంలు, క్రిస్టయన్లు, కమ్యూనిస్టులు కారణమని చెప్పి ఈ ముగుర్ని అంతం చేసి, జాతిని పునర్నవీకరణ చేయడం,
ముస్లీంలను, హిందూత్వ విమర్శకులను దేశద్రోహులుగా, పాకిస్తాన్‌ అనుకూలమైన వాళ్ళుగా ముద్రవేయడం, విద్యను కాషాయికరించే పాఠ్య పుస్తకాలను తీసుకరావడం, మతాల ఆధారంగా ఆందోళన కార్యక్రమాలను చేయడం, మత ఘర్షణలను, అల్లర్లను రెచ్చగొట్టడం, సైనిక దళాలను, సంస్థలను తయారు చేయడం వంటి వాటిని ముమ్మరం చేసిందన్నారు. గతంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు వచ్చాయని, 2014 తర్వాత భావజాల రంగంలో సంక్షోభాలు తీవ్రమయ్యాయి అని అన్నారు.
ఇటువంటి సందర్భంలో మనం చేయాల్సి పనిని, రచయితల పాత్రను చెప్పినవారు అనంతమూర్తి, పెరుమాళ్‌ మురుగన్, దేవనూరు మహాదేవ, ప్రకాష్‌రాజ్, భన్వర్‌ మేఘ్వంశి వంటి వారు చెప్పారని అన్నారు. భావజాల రంగంలో మనం చేయాల్సిన క్రియాశీలకమైన పనిని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నారని అన్నారు. మతోన్మాదులను రాజకీయంగా దూరం చేయడానికి అందరం కృషి చేయాలన్నారు. ప్రముఖ కవి స్కైబాబా మాట్లాడుతూ.. భారతదేశంలో ముస్లింలపై జరుగుతున్న దారుణ మారణ కాండల మీద కవులు, కళాకారులు గళ మెత్తాలన్నారు.
ఈ కార్యక్రమంలో విరసం కళాకారులు ఆద్యంతం పాటలతో అలరించారు. ప్రజా కళామండలి, అరుణోదయ విరసం కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. సభలో వీక్షణం సంపాదకులు ఎన్‌ వేణుగోపాల్, విరసం కార్యదర్శి రివేరా, విరసం నాయకులు వరలక్ష్మి, శశికళ, అమర వీరుల కుటుంబ సభ్యులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన విరసం ప్రతినిధులు హాజరయ్యారు.
Next Story