Lavu Srikrishna Devarayalu, MP Narasaraopet
ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ సభ్యులకు ఏమైంది. ఎందుకు ఒక్కొక్కరుగా ఆయా పార్టీలు వీడుతున్నారు. కొందరిని పార్టీవారే తప్పిస్తున్నారు. ఈ పరిస్థితులు ఎందుకొచ్చాయి.
ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ సభ్యులు ఒక్కొక్కరుగా వైఎస్సార్సీపీ, టీడీపీలకు దూరమవుతున్నారు. ఇప్పటికే ఆరుగురు వైఎస్సార్సీపీ ఎంపీలు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. మరో ఆరుగురికి టిక్కెట్లు దక్కలేదు. టీడీపీలో కూడా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానీ టిడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు.
వైఎస్సార్సీపీలో రఘురామ నుంచి మొదలైన ఎదురీత
వైఎస్సార్సీపీ నుంచి 22 మంది పార్లమెంట్కు ఎన్నిక కాగా టీడీపీ నుంచి ముగ్గురు పార్లమెంట్కు గెలిచారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన పార్లమెంట్ సభ్యుల్లో మొదట వైఎస్సార్సీపీ నుంచి డిఫర్ అయింది నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై పోరాటం చేపట్టారు. హైకోర్టు, సుప్రీ కోర్టులో సీఎం జగన్పై పలు కేసులు వేశారు. ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు.
బీసీగా రెడ్ల మాట వినలేదనే టిక్కెట్ ఇవ్వలేదు..
కర్నూలు ఎంపీ డాక్టర్ సతీష్కుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడం లేదని సీఎం జగన్ చెప్పారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీడియాముందు కూడా మాట్లాడారు. బీసీ సాధికారత అన్నారు. అది వైఎస్సార్సీపీలో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరామ్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆయన కూడా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డికి కూడా వైఎస్సార్సీపీ టిక్కెట్ తిరిగి దక్కే అవకాశం కనిపించడం లేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబును తిట్టడం లేదని టిక్కెట్ లేదని సీఎం జగన్ చెప్పినట్లు సమాచారం. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి కూడా టిక్కెట్ ఇవ్వలేనని జగన్ చెప్పారు. దీంతో ఆయన ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. తాను ఎంత నమ్మకంగా ఉన్నానో అంతగా జగన్మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ లెక్కన గెలవలేవన్నారు..
నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వైఎస్ఆర్సీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. తనకు నియోజకవర్గంలో బలం ఉన్నప్పటికీ మీరు గెలిచే అవకాశాలు లేవని సీఎం జగన్ అంటున్నారని, అటువంటప్పుడు నేను పార్టీలో ఉండటం అనవసరమని భావించి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్సీపీ తరపున గెలిచినందున పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కు కూడా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లేదని సీఎం చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిని కలవాలని ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా అవకాశం కూడా ఇవ్వలేదు. గతంలో మాధవ్ గెస్ట్హౌస్ల్లో ఇల్లీగల్ సెక్స్ చేస్తూ వీడియోలకు దొరికారు. అప్పట్లో మాధవ్ను తొలగిస్తారనుకున్నారు. అయితే అప్పట్లో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రానున్న ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకుండా తోచిపుచ్చారు.
విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు కూడా ఎంపీసీటు వచ్చే ఎన్నికల్లో దక్కలేదు. దీంతో ఆయన కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
చంద్రబాబును తిట్టలేదని సీటు లేదన్నారు..
ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డికి కూడా వచ్చే ఎన్నికల్లో ఒంగోలు సీటు దక్కే అవకాశాలు లేవు. ఇప్పటికే మాగుంటకు సీటు ఇచ్చేది లేదని సీఎం జగన్ చేల్చి చెప్పారు. ఆయన కూడా ప్రతిపక్ష నేతలను తిట్టలేదనే కారణంతో సీటు ఇవ్వడం లేదని విశ్వసనీయ సమాచారం. అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి కూడా ఎంపీ టిక్కెట్ ఇవ్వడం లేదు. ఎందుకనే కారణాలు అడిగినా సీఎంవో నుంచి చెప్పవడం లేదు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్కు కూడా టిక్కెట్ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు కూడా టిక్కెట్ వైఎస్సార్సీసీ ఈ దఫా ఇవ్వలేదు. అలాగే అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు కూడా ఎంపీ సీటు ఇవ్వలేదు. సీట్లు దక్కని వారు దాదాపు వైఎస్సార్సీపీ నమ్మిన బంట్లుగా ఉన్నవారే. ఇంకా కొంతమంది ఎంపీలకు సీట్లు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. త్వరలోనే వారి వివరాలు కూడా సీఎం జగన్ ప్రకటించే అవకాశం ఉంది.
టీడీపీలోనూ ఎంపీల విరక్తి
తెలుగుదేశం పార్టీలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వారిలో విజయవాడ ఎంపీగా కేశినేని శ్రీనివాస్ (నానీ) ఉన్నారు. ఆయన ఇటీవల టీడీపీకీ, ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. అంతేకాకుండా ఏకంగా తిరిగి విజయవాడ వైఎస్సార్సీపీ ఎంపీగా టిక్కెట్ వైఎస్సార్సీపీలో సాధించారు. ఇక గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే తన సన్నిహితుల వద్ద ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఒకే ఒక్కడు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు టీడీపీకి మిలిలారు.
ఎందుకీ పరిస్థితులు
వైఎస్సార్సీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు అగ్రవర్ణాల మాట వినడం లేదనే వాదన బయటకొచ్చింది. గెలిచేంత వరకు రెడ్డి సామాజిక వర్గానికి తలవంచి ఉన్నారని, ఆ తరువాత తలలెత్తి మీరెవరనే పరిస్థితికి వచ్చారని, అందువల్ల రెడ్డి సామాజిక వర్గం నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వడం లేదని సమాచారం. అంతే కాకుండా జగన్ సర్వేలు చేయించి గెలిచే అవకాశం లేదని వచ్చిన రిపోర్టులు ఆధారం చేసుకుని వారిని పక్కన బెడుతున్నారు.
Next Story