వల్లభనేని వంశీకి సంబంధించి విజయవాడ పోలీసులు రూపొందించిన రిమాండ్ రిపోర్టులో గళ్లు బైర్లు కమ్మే అంశాలను పొందు పరిచారు. రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన అంశాలు చూస్తే ఎవరికైనా దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ కావలసిందే. ఒక తీవ్రమైన నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిగా చిత్రీకరించారు. వల్లభనేని మామూలు వ్యక్తి కాదు. కొట్టడం, కొట్టించడం, లాక్కోవడం, బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్పడటం, భయపెట్టడం, హత్యయత్నాలకు పాల్పడటం, గొడవలకు తన అనుచరులను పురికొల్పడం ఇలా అనేక రకాల నేరాలకు పాల్పడిన వ్యక్తిగా వంశీని చిత్రీకరించారు.
తనకున్న పలుకుబడితో ఏదైనా చేసేందుకు బరితెగించే వ్యక్తిగా వంశీని ఎస్టాబ్లిష్ చేశారు. అందుకు సంబంధించిన కేసుల వివరాలను పూసగుచ్చినట్లు వెల్లడించారు. వల్లభననేని వంశీ మామూలు వ్యక్తి కాదు. ఒక నొటోరియస్ క్రిమినల్. ఆయనకు చాలా నేర చరిత్ర ఉంది. చట్టం.. న్యాయం.. అంటే వంశీకి లెక్కే లేదు. ఆయనపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటూ వల్లభనేని నేర చరిత్ర చిట్టాను పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంలో సత్యవర్థన్ కంప్యూటర్ ఆపరేటర్. సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీతో పాటు అతని అనుచరుల మీద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును తేల్చేందుకు వంశీ రంగంలోకి దిగాడు. కేసును వెనక్కి తీసుకోవలని సత్యవర్థన్ మీద ఒత్తిడి తెచ్చారు. ఇవి భరించ లేక సోదరుడు కిరణ్ వద్ద సత్యవర్థన్ చెప్పుకున్నాడు. కేసును వెనక్కి తీసుకుంటే డబ్బులు ఇస్తామన్నారు. లేకుంటే చంపేస్తామని బెదిరించినట్లు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెద్దవాళ్లతో ఎందుకు పెట్టుకుంటారని వజ్రకుమార్ అనే అనుచరుడితో వంశీ బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా కొమ్మా కోటి, రామకృష్ణ, వీర్రాజు అనే అనుచరుల చేత తన తల్లిదండ్రులను బెదిరించినట్లు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ నెల 10 వ తేదీ తన సోదరుడు సత్యవర్థన్ను బలవంతంగా కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఫిర్యాదులో కిరణ్ పేర్కొన్నాడు. ఇందులో వల్లభనేని వంశీని ఏ1గా చేర్చారు.
విశాఖపట్నంలో వంశీ అనుచరులు దేవీ దుర్గ శివరామకృష్ణ, నిమ్మల లక్ష్మీపతి అనే వంశీ అనుచరుల వద్ద బందీగా ఉన్న సత్యవర్థన్ను రక్షించి విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు విచారించారు. వల్లభనేని వంశీ, అతని అనుచతరులు గన్నవరం టీటీపీ కేసు వాపస్ తీసుకోవాలని ఎలా చిత్ర హింసలకు గురి చేశారో సత్యవర్థన్ పోలీసులకు వివరించారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని వల్లభనేని వంశీ ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులకు సత్యవర్థన్ తెలిపారు. అందులో భాగంగా తనను హనుమాన్ జంక్షన్కు తీసుకెళ్లి వాపస్ తీసుకుంటున్నట్లు రాసివ్వమన్నారు. బెదిరించి సంతకం చేయించుకున్నారు. తర్వాత ఏపీ 40బీజీ5005 క్రెటా కారులో తనను బలవంతంగా కోర్టుకు తీసుకెల్లి వాంగ్మూలం ఇప్పించారని సత్యవర్థన్ పోలీసులుకు తెలిపారు.
అక్కడితో ఆగని వంశీ అనుచరులు తనను హైదరాబాద్కు తీసుకెళ్లారు. ఈ నెల 10వ తేదీ అర్థరాత్రి హైదరాబాద్లోని మైహోం భూజాలో ఉన్న వంశీ వద్దకు తీసుకెళ్లారు. ఇచ్చిన వాంగ్మూలానికి కట్టుబడి ఉండాలని మళ్లీ వంశీ తనను బెదిరించాడు. తీవ్రంగా హింసించాడు. తేడా వస్తే కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించాడని తెలిపాడు. అక్కడ నుంచి విశాఖపట్నం తీసుకెళ్లారు. హోటల్ చందనలో ఉంచి, తర్వాత మరో గెస్ట్హౌస్కు మార్చినట్లు సత్యవర్థన్ పోలీసులకు తెలిపాడు.
ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపులు చేపట్టారు. గురువారం ఏ1 నిందితుడుగా ఉన్న వంశీని హైదరాబాద్లో అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వంశీకి, అతని అనుచరులకు 15 రోజుల పాటు రిమాండ్కు పంపాలని నాలుగవ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి రామ్మోహన్ను కోరారు. పోలీసుల రిమాండ్ రిపోర్టు మేరకు వల్లభనేని వంశీతో పాటు అతని అనుచరులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.