టీడీపీకి, జనసేనకు, వైసీపీకి ఏమైనా పంచాయతీ ఉంటే మీరు రాజకీయంగా చూసుకోండి. ఆఫీసర్లను ఎందుకు బలి చేస్తారని మాజీ ఐపీఎస్‌ అదికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మండిపడ్డారు.


పీవీ సునీల్‌కుమార్‌ గత ఎనిమిది నెలలుగా పోస్టింగ్‌ లేదు. ఆయన చేసిన పాపం ఏంటి అని తెలంగాణ మాజీ ఐపీఎస్‌ అధికారి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. సీనియర్‌ పోలీసులు అధికారులు పీవీ సునీల్‌కుమార్, విజయపాల్‌లపై కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హోదాను, పలుకుబడిన వాడుకొని అణగారిన వర్గాల అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడటం సరైంది కాదని, ఇలాంటివి మానుకోవాలని సీఎం చంద్రబాబుకు ఆయన సూచించారు. ఆ మేరకు ఆయన ఇటీవల ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఏమన్నారంటే..

2021లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నాటి నర్సపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసి విజయవాడకు తీసుకెళ్లి అక్కడ సీఐడీ ఆఫీసులో రాత్రి ఉంచి ఉదయం మెజిస్ట్రేట్‌ దగ్గర ప్రవేశ పెట్టారు. అయితే ఈ క్రమంలో తనను కస్టోడియల్‌ టార్చర్‌ చేశారని నాడు మెజిస్ట్రేడ్‌ ముందు రఘురామకృష్ణరాజు చెప్పారు. దీనిపై స్పందించిన మెజిస్ట్రేట్‌ నలుగురు వైద్యులను టీమ్‌ను ఏర్పాటు చేసి రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించమని ఆదేశించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ఆ డాక్టర్ల బృందం రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్‌ టార్చర్‌ ఏమీ జరగలేదని నివేదికను ఇచ్చారు. తర్వాత లోకల్‌ మెజిస్ట్రేట్‌ వద్ద బెయిల్‌ కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. స్థానిక కోర్టు రఘురామకృష్ణరాజుకు బెయిల్‌ను నిరాకరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ రఘురామకృష్ణరాజు బెయిల్‌ తెచ్చుకున్నారు. ఇవన్నీ చకచక జరిగిపోయాయి. ఇవన్నీ తెలుగు ప్రజలకు మరి ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు తెలిసిన విషయాలే.
బెయిల్‌ తెచ్చుకున్న తర్వాత హైదరాబాద్‌లోని మిలటరీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల ద్వారా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అక్కడ కూడా కస్టోడియల్‌ టార్చర్‌కు ఏమీ జరగ లేదని రిపోర్టు ఇచ్చారు. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కోరారు. అయితే సుప్రీం కోర్టు వీటని పక్కన పెట్టింది.
తర్వాత అనేక రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా నియమితులయ్యారు. జూలై 2024లో సీనియర్‌ పోలీసు అధికారులైన సీతారామాంజనేయులు, పీవీ సునీల్‌ కుమార్, విజయపాల్‌ మీద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ట్రిపుల్‌ ఆర్‌ ప్రధానంగా ఏమని అభియోగాలు చేస్తున్నారంటే.. పీవీ సునీల్‌కుమార్, సీతారామంజనేయులు, విజయపాల్‌ అనే ఐపీఎస్‌ అధికారులు తనను ఘోరంగా కొట్టారు, చిత్ర హింసలకు గురి చేశారని ట్రిపుల్‌ ఆర్‌ అభియోగాలు చేస్తున్నారు. తీవ్రంగా కొట్టడం వల్ల తనకు బలమైన గాయాలయ్యాయి. అంతేకాకుండా ఆ అధికారులు కావాలనే రికార్డులు తారు మారు చేశారనే రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. అది కూడా కేసు అయిపోయి మూడున్నర సంవత్సరాలు తర్వాత.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రిపుల్‌ ఈ ఫిర్యాదు చేశారు. గుంటూరులో ఎఫ్‌ఐఆర్‌ అయింది. మరి గుంటూరులో విచారణ చేయకుండా ఎందుకో ఒంగోలు ఎస్పీకి అప్పగిస్తూ విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని ప్రశ్నించారు.
అయితే ఈ సందర్భంలో ప్రధానంగా ఏమి చెప్పాలనుకుంటున్నానంటే.. ఈ కేసుకు సంబంధించిన, అవసరమైన మెటీరియల్‌ ఎవిడెన్సు అతని వద్ద లేదు. ఇది వరకు చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని తేలి పోయింది. అయినా మూడున్నర సంవత్సరాల తర్వాత డిప్యూటీ స్పీకర్‌ హోదాలో ఉన్న ట్రిపుల్‌ మళ్లీ గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ చేశారు. ఇదంతా కోడి గుడ్డు మీద ఈకలు పీకడం లాంటిదే. ఒక డీజీపీ స్థాయిలో ఉన్న అధికారులు ఒకరిని కొట్టడం అనేది తనకు తెలిసి ఎక్కడా జరగదు. అదీ కూడా ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తిని ఒక డీజీపీ ర్యాంకు అధికారి కొట్టడం అనేది అసలు ఊహించడమే చాలా కష్టమైన పని.
దళిత అధికారులైన పీవీ సునీల్‌కుమార్, విజయపాల్‌లను టార్గెట్‌ చేశారు. దీనిపైన ఎవరు మాట్లాడటం లేదు. ఇది చాలా అశ్చర్యంగా ఉంది. పీవీ సునీల్‌కుమార్‌ గత ఎనిమిది నెలలుగా పోస్టింగ్‌ లేదు. ఆయన చేసిన పాపం ఏంటి? అతనితో పని చేశాను కాబట్టి ఈ మాటలు చెబుతున్నా. అదిలాబాద్‌ జిల్లాలో అదనపు ఎస్పీగా ఉన్నప్పుడు సునీల్‌ కుమార్‌ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. బెల్లంపల్లిలో ఉండటానికి ఇల్లు ఉండేవి కాదు. అధికారులది కూడా అదే పరిస్థితి. సునీల్‌ కుమార్‌ అందరికీ వసతులు కల్పించారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న మంచి ఆఫీసర్‌ సునీల్‌ కుమార్‌. ఆయనకు ఏ పోస్టింగ్‌ ఇచ్చినా చాలా వినూత్నంగా చేస్తారు.
అందుకే రాష్ట్రపతి కూడా రెండు ప్రాముఖ్యమైన అవార్డులను సునీల్‌కుమార్‌కి ఇచ్చారు. నిజంగా ఆయన అవినీతి అధికారో, దుందుడుకుగా వ్యవహరించే అధికారో అయితే రాష్ట్రపతి అవార్డులు రావు కదా. నాడు సీఎంగా ఉన్న చంద్రబాబే సునీల్‌కుమార్‌ రాష్ట్రపతి అవార్డులకు అర్హులు అని రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. రెండు అవార్డులు తీసుకున్న పీవీ సున్నీల్‌కుమార్‌ ఆయన ఏ విభాగంలో పని చేసినా.. దానిని అత్యున్నతంగా తీర్చి దిద్ది పేరు తెచ్చేవారు.
అలాంటి పేరున్న అధికారి సడెన్‌గా చంద్రబాబు ప్రభుత్వం రాగానే సునీల్‌కుమార్‌ క్రిమినల్‌గా ఎందుకు అయిపోతారు? ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి తెవలకుండానే జరుగుతన్నాయా? ఒక సారి సుప్రీం కోర్టులో సెటిల్‌ అయిన మ్యాటర్‌ను మళ్లీ మళ్లీ తీసుకొచ్చి విజయపాల్‌ను అర్జెంట్‌గా 60 రోజులు జైల్లో ఉంచి.. స్థానికంగా బెయిల్‌ రాకుండా చూసి.. మళ్లీ హైకోర్టులో బెయిల్‌ రాకుండా చూసి.. అంటే ఎందుకింత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు?
ఒక మాల అధికారి, మరొక మాదిగ అధికారి మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుంటే.. వేదనకు, క్షోభకు, అణచివేతకు గురవుతుంటే ఎందుకు ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడటం లేదు?
రాజకీయ నాయకులకు ఏమైనా సమస్యలు ఉంటే రాజకీయంగా చూసుకోండి. టీడీపీకి, జనసేనకు, వైసీపీకి ఏమైనా పంచాయతీ ఉంటే మీరు రాజకీయంగా చూసుకోండి. అంతేకాని ఆఫీసర్లను ఎందుకు బలి చేస్తారు? అది కూడా అణచివేత నుంచి వచ్చిన అధికారులు సునీల్‌కుమార్, విజయపాల్‌ ఏం పాం చేశారు. చంద్రబాబుకి, నారా లోకేష్‌కు తెలవకుండానే ఇదంతా జరుగుతుందా? నిజంగా రఘురామకృష్ణరాజుకు ఏమైనా ఉంటే.. దానిని పేపర్‌ మీద పెట్టమనండి. దాని మీద విచారణ జరిపించండి. అసలు అదంతా అయిపోయిన విషయం కాదా. మళ్లీ దాన్నే తెచ్చి అధికారులను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు?
అణగారిన వర్గాలకు చెందిన ప్రజలంతా దీనిని గమనించాలి. అదే ఆదిపత్య వర్గాలకు చెందిన వారైతే.. ఏదోవిధంగా బయట పడుతారు. వారికి న్యాయ వ్యవస్థలో తెలిసినోళ్లుంటారు. పత్రికా రంగంలో తెలిసినోళ్లుంటారు. తెలిసిన అధికారులు, రాజకీయ నాయకులు ఉంటారు. కానీ అణచివేయబడిన వర్గాలకు చెందిన అధికారులకు వాయిస్‌ ఉండదు. వారి గురించి ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ కూడా మాట్లాడరు. ఏ పత్రిక కూడా వారికి జరిగిన అన్యాయం గురించి రాయదు. ఏ మీడియా చెప్పదు. విజయపాల్‌ ఏ పాపం చేశారని 60 రోజులు జైల్లో పెట్టారు. వేరే వర్గానికి చెందిన వారినైతే ఆ విధంగా పెడుతారా? ఒక సారి ఆలోచించాలి అంటూ అణగారిన వర్గాల నుంచి వచ్చిన ఒక మాజీ ఐపీఎస్‌ అధికారిగా కోరుతున్నట్లు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ కోరుకున్నట్లు ఇక్కడ సమానత్వం లేదు. ఒకరిని ఒక విధంగా.. మరొకరిని మరో విధంగా చూస్తున్నారు.
చంద్రబాబు చాలా సీనియర్‌ పొలిటీషన్‌. మీ హయాంలో పేద వర్గాలకు ఇలాంటి దుర్మార్గం జరగడం కరెక్ట్‌ కాదు. మీకు మాయని మచ్చగా ఇది మిగిలి పోతుంది. తెలిసి తెలిసి ఎవరూ ఎస్సీ కులంలో పుట్టాలనుకోరని మీరు ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నారో కానీ నిజంగా ఆ మాట నిజమవుతున్నది. ఎస్సీ వర్గానికి చెందిన ఆఫీసర్లే ఘోరంగా అణచివేతకు గురవుతున్నారు. జీవితంలో ఈ కులంలో పుట్టొద్దురా బాబు అనే భావన వచ్చే విధంగా మీ ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది. హోదాను, పలుకుబడిని వాడుకుని ఎస్సీ అధికారులను సతాయించడం, కోడి గుడ్డు మీద ఈకలను పీకడం మానుకోమని రఘురామకృష్ణరాజుకు చెప్పాలని చంద్రబాబుకు సూచించారు.
Next Story