పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఎటువంటి దుర్గతి పట్టిందంటే ఎప్పటికి పూర్తవుతుంతో తెలియని పరిస్థితి. నిధుల సమస్య కంటే నిబద్ధత లోపం ఎక్కువగా ఉందంటున్నారు విమర్శకులు.


పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రక్టర్లే సమ్య అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. వారిలోనే నిబద్ధత లేదనేద స్పష్టమైన తరువాత కాంట్రాక్టర్లపై ఎందుకు పడుతున్నారనేది ప్రస్తుతం చర్చగా మారింది. మొదట ట్రాన్స్‌ట్రాయ్‌ కనస్ట్రక్షన్‌ కంపెనీకి నిర్మాణ పనులు అప్పటి ప్రభుత్వం అప్పగించింది. 2014లో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ కంపెనీకి అవకాశం ఇచ్చింది. కారణాలు ఏమిటో తెలియదు కాని ఆ కంపెనీని నిర్మాణ పనుల నుంచి అప్పటి ప్రభుత్వం తప్పించింది. దీంతో నవయుగ కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండర్లు పిలిచి ఆ కంపెనీని తప్పించి మెగా ఇంజనీరింగ్‌ కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ప్రభుత్వం మారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ కంపెనీని మార్చాలనే ఆలోచనకు వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతోంది. కంపెనీల తప్పా? పాలకుల్లో లోపం ఉందా? అనేది ప్రస్తుతం ఇరిగేషన్‌ రంగ నిపుణుల్లో చర్చ నియాంశమైంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వద్దే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రాజెక్టు స్థితి గతులను ఎప్పటికప్పుడు కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతున్నారు. పోలవరంపై మొదటి సారిగా స్వేతపత్రం విడుదల చేశారు. ఈ స్వేత పత్రంలో గత ప్రభుత్వ లోపాలు పూర్తి స్థాయిలో వివరించారు. ఆ తరువాత ఒకటికి రెండు సార్లు ఇరిగేషన్‌ అధికారులతో సీఎం సమీక్షలు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వేగంగా పనిచేసే కాంట్రాక్టర్‌ ఉంటే మంచిదని, అటువంటి వారిని వీలైతే తీసుకోవాలని, లేదంటే మళ్లీ టెండర్లు పిలవాలని అధికారులకు సూచించారు. ఒక వేళ గతంలో పనిచేసిన కాంట్రాక్టర్‌ తిరిగి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వస్తే ఆకంపెనీకి పనులు అప్పగించాలని చెప్పారు. ప్రస్తుతం కనస్ట్రక్షన్‌ చేస్తున్న మెగా కంపెనీని బాధ్యతల నుంచి తప్పించేందుకు నిర్ణయించుకున్నారనేది సీఎం మాటల్లో స్పష్టమవుతోంది.
ఇప్పటి వరకు ముగ్గురు కాంట్రాక్టర్లను మార్చారు. ఆ కాంట్రాక్టర్లు పలువురికి సబ్‌ కాంట్రాక్ట్‌లు ఇచ్చి పనులు చేయించారు. అయినా వారిలోపం ఎక్కడా కనిపించలేదు. అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించి కాంట్రాక్టర్ల లోపం ఉందని ఎక్కడా వ్యాఖ్యానించలేదు. నిర్మాణంలో ఆలస్యం జరగటం, వరదలు వచ్చి డయా ఫ్రం వాల్‌ దెబ్బతిన్నదని చెప్పారే కాని కాంట్రాక్టర్లను ఎవ్వరూ తప్పు పట్టలేదు. అంటే ఇక్కడ పాలకుల తీరును తప్పు పట్టాల్సి వస్తోందని పలువురు ఇంజనీరింగ్‌ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వాల్లో నిబద్ధత లోపం వల్ల ఇటువంటి పరిణామాలు ఎదురయ్యాయనే వాదన తెరపైకి వచ్చింది. దీనిని ఎక్కువ మంది సమర్థిస్తున్నారు. ఒక కంపెనీకి పని అప్పగిస్తే ఆ కంపెనీ వద్దని రివర్స్‌ టెండర్లు పిలిచిన జగన్‌ ప్రభుత్వానిది కూడా పెద్ద తప్పేననే విమర్శ ఉంది. ఇప్పుడు అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం కూడా తిరిగి కాంట్రాక్టర్‌ను మార్చాలనే ఆలోచన చేస్తుందంటే ఒక్క సారి విజ్ఞులైన వారు ఎవరైనా ఆలోచిస్తారని పలువురు రాజకీయ పార్టీల నేతలు అంటున్నారు.
ఇప్పటి వరకు జరిగిన చరిత్రేమిటో తెలుసా...
ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిర్మాణానికి పూనుకుంది. రాష్ట్ర విభజన సమయంలో విభజన హామీల అమలులో భాగంగా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అంతవరకు బాగానే ఉంది. వేగంగా పూర్తి కావాల్సిన ప్రాజెక్టు బాలారీష్టాలను ఎదుర్కొంటోంది. కేంద్రం టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టి ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చి ఉండేది కాదేమోననే అనుమానాలు పలువురు ఇరిగేషన్‌ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. తమ పర్యవేక్షణలో నిర్మాణం జరుగుతుందని 2014లో విభజిత ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబునాయుడు బాధ్యత తీసుకున్నారు. ఆయన సీఎంగా ఉన్నంత వరకు పనులు బాగానే జరిగాయి. ఆ తరువాత కరోనా రావడంతో పనులు మందగించాయి. అనంతరం వరదలు రావడంతో కాపర్‌ డ్యామ్‌తో పాటు డయాఫ్రం వాల్‌ కూడా వరద తాకిడికి దెబ్బతిన్నది. అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. దీంతో ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన నిధులు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. వేల కోట్లు మట్టి, నీటి పాలయ్యాయని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టు నిర్మాణం కోసం రావాల్సిన నిధులు రాష్ట్రానికి రాలేదు. దీంతో దిక్కుతోచని స్థితికి ప్రాజెక్టు నిర్మాణం చేరింది. కొత్తగా తిరిగి అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం అంతా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చేసిందంటూ అంతర్జాతీయ నిపుణుల సూచన మేరకు తిరిగి డయాఫ్రం వాల్‌ నిర్మించాలని నిర్ణయించింది.
Next Story