అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం... వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్
x

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం... వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు.


ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు, కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విజనరీ నాయకుడని, ఏపీ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. విజనరీ లీడర్‌ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రకు నష్టం వాటిల్లిందని, అలాంటి స్థితిలో అన్ని రంగాల అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారని గుర్తుచేశారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగిందన్నారు. రాజధాని నిర్మాణానికి అపూర్వ కృషి సాగిందని, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు దెబ్బతిన్నాయని గవర్నర్‌ అన్నారు. చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడిదారులు వెనక్కి మళ్లారని... 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందని గవర్నర్ పేర్కొన్నారు.

మాయని మచ్చగా ఏపీ విభజన....

ఎన్నికల ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొన్నారని, మార్పు కావాలని ప్రజలు ఆకాంక్షించారని... ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉందని గవర్నర్ గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను అశాస్త్రీయంగా, భాగస్వాములతో చర్చలు జరపకుండా విభజించారని ఆయన వెల్లడించారు. ఉమ్మడి ఏపీ విభజన రాష్ట్ర ప్రజల హృదయాల్లో మాయని మచ్చగా మిగిలిందని, రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ వల్ల అల్లకల్లోలం ఏర్పడిందని, రాష్ట్ర ప్రజలు సుదీర్ఘకాలం అభివృద్ధి పురోగతికి నోచుకోలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు.

విభజన చట్టం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తగినంత పరిహారం ఇవ్వలేదన్న ఆయన, ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అశాస్త్రీయ విభజన వల్ల 46 శాతం వనరులు మాత్రమే వారసత్వంగా వచ్చాయని, రాజధాని హైదరాబాద్‌ ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం జరిగిందని గవర్నర్ అన్నారు. ఉన్నత విద్యాసంస్థలు కోల్పోయామన్న గవర్నర్‌, భారీ రెవెన్యూ లోటు వారసత్వంగా వచ్చిందని పేర్కొన్నారు. ప్రాంతం ఆధారంగా ఆస్తులు, వినియోగం ఆధారంగా విద్యుత్‌ పంపిణీ చేశారని, ఎలాంటి ఆధారాలు లేకుండా విద్యాసంస్థలు విభజించారని గవర్నర్ వెల్లడించారు.

సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని...

ఉమ్మడి ఏపీలో తలసరి ఆదాయం లక్షా 6 వేల 176 కోట్లు ఉండేదని, విభజిత ఏపీలో తలసరి ఆదాయం 93 వేల 121 కోట్లకు పడిపోయిందని చెప్పారు. విభజన వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని చంద్రబాబు ప్రభుత్వం అవకాశంగా మలచుకుందని, సన్‌ రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ కు చంద్రబాబు ప్రభుత్వం పునాది వేసిందని ప్రశంసించారు. సముద్ర తీరం, నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధిపై, తయారీ కార్యకలాపాలకు అవసరమైన వాతావరణంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు.

2014-19 మధ్య కాలంలో అభివృద్ధి, సంక్షేమం మధ్య స్పష్టమైన సమతుల్యం ఉందని చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో ఏడాది సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ పూర్తిచేసిందని, చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయిందని గవర్నర్ గుర్తు చేశారు. ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు చంAద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని, కరవు నివారణ చర్యలు, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ చేపట్టారని తెలిపారు. భూసేకరణ ద్వారా అమరావతి ప్రాంత అభివృద్ధి చేశారని, కొత్త సచివాలయం, శాసనసభ భవన నిర్మాణం చేశారని తెలియజేశారు. చంద్రబాబుదూరదృష్టి నాయకత్వం వల్లే 2014-19 మధ్య అభివృద్ధి సాధ్యమైందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.

వైసీపీ నేతల వాకౌట్...

అసెంబ్లీ సమావేశాలకు నల్లకండువాలతో వచ్చిన వైసీపీ సభ్యులు.. గవర్నర్ స్పీచ్ సమయంలో హత్యా రాజకీయాలు నశించాలి... సేవ్ డెమోక్రసీ... అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ గవర్నర్ ప్రసంగం కొనసాగించడంతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు.

అయ్యన్న అధ్యక్షతన బీఏసీ సమావేశం..

గవర్నర్ స్పీచ్ అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. అనంతరం స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. వైసిపి గైర్హాజరైంది. అసెంబ్లీ నిర్వహణ, చేపట్టాల్సిన అంశాలపై బీఏసీలో చర్చించారు.

Read More
Next Story