మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద హత్య కేసులో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. ముగ్గురు మాజీ అధికారులపై కేసు నమోదు చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారం చేపట్టాక తొలి సారి మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు తెరపైకొచ్చింది. ఇప్పటి వరకు గతంలో టీడీపీ కార్యాలయాలపై దాడుల కేసులు, సోషల్‌ మీడియా కేసులు, ప్రభుత్వ భూముల ఆక్రమణ కేసులపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం తాజాగా వివేకానందరెడ్డి కేసును తెరపైకి తెచ్చింది. వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి గతేడాది చేసిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. దస్తగిరి 2023లో నలుగురిపై పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కడప జైలులో ఉండగా 2023 నవంబరులో కడప జైలుకు వచ్చి సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ఇదే కేసులో నిందితుడుగా ఉన్న శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్య రెడ్డి బెదిరించినట్లు దస్తగిరి తన ఫిర్యాదు చేశాడు.

సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే తనకు రూ. 20 కోట్లు ఇస్తామని చైతన్య రెడ్డి చెప్పారని, జైలు సూరింటెండెంట్‌ ప్రకాశ్‌ తనను ఇబ్బంది పెట్టారని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు మద్దతుగా మాట్లాడాలని డీఎస్పీ నాగరాజు, సీఐ ఈ శ్వరయ్య బెదిరించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ మేరకు వివేకా హత్య కేసులో నిందితుడుగా ఉన్న శివశంకర్‌రెడ్డి కుమారు డాక్టర్‌ చైతన్యరెడ్డి, ఇది వరకు జమ్మలమడుగు డీఎస్పీగా పని చేసిన నాగరాజు, ఎర్రగుంట్ల సీఐగా పని చేసిన ఈశ్వరయ్య, కడప జైలు సూపరింటెండెంట్‌గా పని చేసిన ప్రకాశ్‌ల మీద 2023లో దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా దీనిని తెరపైకి తీసుకొచ్చారు. దస్తగిరి ఫిర్యాదు మేరకు ఈ నలుగురిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.

పోయిన టర్మ్‌లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలోనే మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. 2019 మార్చి 15న వివేకా హత్యకు గురయ్యారు. ఇటీవల 2024లో జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన కుమార్తె వైఎస్‌ సునీత, వైఎస్‌ఆర్‌ కుమార్తె, ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈ అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. వైఎస్‌ వివేకానంద్‌రెడ్డి హత్య కేసులో నాయ్యయం కోసం పోరాడుతున్నామని, తమకు న్యాయం చేయాలని ఎన్నికల ప్రచారంలో జోలి పెట్టి ప్రజలకు అడిగారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ అవినాష్‌రెడ్డి పాత్ర ఉందని, అతన్ని కావాలనే వైఎస్‌ జగన్‌ వత్తాసు పలుకుతూ వెనకేసుకొస్తున్నారని తీవ్రంగా ప్రచారం చేపట్టారు. వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్యలో పాత్ర ఉన్న అవినాష్‌రెడ్డిని, అతనికి సపోర్టు చేస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించాలని కడప, పులివెందుల ప్రజలను కోరారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, జగన్‌లు ఓడిపోతే వివేకా హత్య కేసులో న్యాయం జరుగుతుందని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, చంద్రబాబు సీఎం అయితే తనకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని సునీత వెల్లడించారు. ఆ మేరకు సునీత, హోం మంత్రి అనితను కలిసి వివేకా హత్య కేసులో న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో దరస్తగిరి ఫిర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేయడం కీలక అడుగు ముందుకు పడినట్టైంది.
Next Story