లైంగిక వేధింపుల కేసులో జూన్ 2 న తుది తీర్పు..
x

లైంగిక వేధింపుల కేసులో జూన్ 2 న తుది తీర్పు..

తమిళనాడులో తీవ్ర నిరసనలకు కారణమైన అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి జైలు శిక్ష ఖరారు చేయనున్న అల్లికుళం మహిళా కోర్టు..


Click the Play button to hear this message in audio format

అన్నా యూనివర్సిటీ(Anna University)లైంగిక వేధింపుల కేసు కొలిక్కి వచ్చింది. సిట్ వేగంగా దర్యాప్తు పూర్తిచేయడం, తగినన్ని సాక్ష్యాధారాలను న్యాయస్థానం ముందు ఉంచడంతో..చెన్నై(Chennai)లోని అల్లికుళంలోని మహిళా కోర్టు న్యాయమూర్తి రాజలక్ష్మి జూన్ 2న తుది తీర్పు చెప్పనున్నారు.

క్యాంపస్‌లో లైంగిక వేధింపులు..

అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో సెకండియర్ ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు (Sexual assault) పాల్పడ్డాడు. ఆమెతో పాటు ఆమె స్నేహితుడిపై దాడి చేసి ఘటనను సెల్‌ఫోన్లో రికార్డు చేశాడు. ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతానని బాధితురాలిని బెదిరించాడు. చివరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొట్టూర్‌పురానికి చెందిన రోడ్డు పక్కన బిర్యానీ విక్రేత 37 ఏళ్ల జ్ఞానశేఖరన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతనిపై అప్పటికే 20కి పైగా దొంగతనం, కిడ్నాప్ దోపిడీ కేసులున్నట్లు బయటపడింది. చివరకు నిందితుడిని డిసెంబర్ 25న అరెస్టు చేశారు.

మద్రాస్ హైకోర్టు జోక్యం

విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా విస్తృత నిరసనలకు దారితీసింది. క్యాంపస్‌లో భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. ప్రజల నిరసనల నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ అధికారులు భూక్య స్నేహ ప్రియ, అమాన్ జమాల్, ఎస్ బృందా నేతృత్వంలో సిట్‌తో దర్యాప్తు జరిపించాలని ఆదేశిస్తూనే.. బాధితురాలికి మధ్యంతర పరిహారంగా రూ.25 లక్షలు చెల్లించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో కీలక ఆధారాలయిన సీసీటీవీ ఫుటేజ్, నిందితుడి మొబైల్ ఫోన్ డేటాను సేకరించి ఫిబ్రవరి 2025 SIT ఛార్జ్ షీట్‌ దాఖలు చేసింది. కేసు తీవ్రత, సున్నితత్వం దృష్ట్యా కేసును మహిళా కోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసులో జూన్ 2న కోర్టు తుదితీర్పు ఇవ్వనుంది.

‘డిప్యూటీ మేయర్‌ను విచారించాలి..’

తమ నిరసనల వల్లే బాధితురాలికి సత్వర న్యాయం జరుగుతోందని AIADMK ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి పేర్కొ్న్నారు. ఇదే సమయంలో నిందితుడితో సన్నిహిత సంబంధాలున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర మంత్రి, చెన్నై డిప్యూటీ మేయర్‌ను ఎందుకు విచారించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సభ్యుడు డీఎస్పీ రాఘవేంద్ర రవి రాజీనామా చేయడంపై సీనియర్ అధికారుల ఒత్తిడి ఉందా? అని ప్రశ్నించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కూడా న్యాయవ్యవస్థ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు తమపై జరిగే అఘాయిత్యాలను నిర్భయంగా చెప్పేందుకు ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Read More
Next Story