
కమలంలో కాళేశ్వరం చిచ్చు
ఈటెలకు అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకుంటుందెవరు?
ఇద్దరు ఎంపీలు. పార్టీ ఒక్కటే. ఒకరు కేంద్రమంత్రి బండి సంజయ్. మరొకరు ఈటల రాజేందర్. తెలంగాణలో ఇద్దరూ కీలక నేతలే. కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో రెండు సౌండ్లు వినిపిస్తున్నారు. కాళేశ్వరం, ఈటల రాజేందర్, బండి సంజయ్ల మధ్య వివాదంగా మారి తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర బీజేపీ పగ్గాలను ఈటలకు అప్పగిస్తారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈటెల ఇరకాటంలో పడ్డారు. ఈటల వాంగ్మూలం అచ్చంగా బీఆర్ఎస్ చెప్పేట్టుగానే ఉండటంతో, కాళేశ్వరం వల్ల పైసా ప్రయోజనం లేదు, అంతా అవినీతే అని చెబుతున్న బీజేపీకి ఇది ఇబ్బందికరంగా మారింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపేందుకు పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావులతోపాటు అప్పట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటలను సైతం కమిషన్ విచారించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేసి పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో ఈటల బీజేపీలో చేరారు.
విచారణ తరువాత మీడియాతో ఈటల చెప్పిన అంశాలు బీజేపీని ఇరకాటంలో పడేశాయి. బీఆర్ఎస్ నేతలను రక్షించారని ఈటలపై విమర్శలొచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకుందని, క్యాబినెట్ నిర్ణయం మేరకు ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. మంత్రివర్గ సబ్ కమిటీ సూచన మేరకు మేడిగడ్డ స్థల నిర్ణయం జరిగిందని ఈటెల చెప్పారు. కాళేశ్వరం వల్ల తెలంగాణకు మేలు జరిగిందని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ఆ మాటలు వైరల్ అయ్యాయి. ''కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలనే దానికి, ఆర్థిక శాఖకు సంబంధం లేదు. ఖర్చు అంతా సాగునీటి శాఖ చూసింది. కేటాయింపు మాత్రమే ఆర్థిక శాఖ చేసింది'' డిజైన్స్, కన్స్ట్రక్షన్తో సంబంధం ఉందా? అని అడిగారు. దానితో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సంబంధం లేదని చెప్పాను. కార్పొరేషన్ అప్పులు, ఇరిగేషన్ చెల్లింపుల మీద ఫైనాన్స్ అజమాయిషీ లేదని చెప్పాను'' అని రాజేందర్ తెలిపారు. ఈటెల రాజేందర్ ఓ ఛానెల్ లో మాట్లాడుతూ రాజకీయాలు అంటే పార్టీ ఏదైనా అలిబాబా 40 దొంగలు లాంటి దోపిడీ ల దందే. ప్రపంచంలో ఎంత పిచ్చోడు కూడా 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజా సేవ చేయాలి అని అనుకోడు.
ఈటల ఇలా మాట్లాడడం రాష్ట్ర బీజేపీకి డ్యామేజీ జరిగిందని బండి సంజయ్ చెబుతున్నారు. ఈటల తీరుపై బీజేపీ నాయకులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. కమిషన్ ఎదుట ఈటల బీజేపీ నేతగా హాజరుకాలేదని, మాజీ మంత్రిగా మాత్రమే వెళ్లారంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కాళేశ్వరంలో కేసీఆర్ను కాపాడాలని చూస్తే అది తప్పేనని ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు.
''కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం'' అని ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, నడ్డా గతంలో ఆరోపించారు. అప్పటి నుంచి ఆ పార్టీ స్టాండ్ అదే. కాళేశ్వరం వల్ల పైసా ప్రయోజనం లేదు, అంతా అవినీతే అని చెబుతున్న బీజేపీకి ఈటెల వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి.
అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్పొచ్చా? అంటూ బండి సంజయ్ రెచ్చిపోతున్నారు. ''కాళేశ్వరంపై మోదీ చెప్పిందే బీజేపీ విధానం. కాళేశ్వరంపై బీజేపీ స్టాండ్ మారిందని, బీఆర్ఎస్తో కుమ్మక్కైందని కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ స్టాండ్ వెరీ క్లియర్. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులే వందల కోట్లు సంపాదించారంటే, ఇక కేసీఆర్ కుటుంబం ఏ స్థాయిలో అవినీతికి పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు'' అని బండి సంజయ్ అన్నారు. అంతటితో ఆయన ఆగలేదు. ''మేం మాట మార్చడానికి ఊసరవెల్లులం కాదు'' అన్నారు. "నేను గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, ఇప్పుడు కేంద్ర మంత్రిని. కాబట్టి అప్పుడో మాట, ఇప్పుడో మాట చెప్పొచ్చా?'' అని వ్యాఖ్యానించారు సంజయ్. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు, కాగజ్ నగర్ ఎమ్మెల్యే హరీశ్... వీరంతా కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద స్కామ్ అని, సీబీఐ విచారణ జరగాలని, బండి సంజయ్ చెప్పిందే పార్టీ విధానమని ప్రకటనలు చేశారు.
ఎన్నో ఆశలతో బీజేపీలోకి వచ్చిన ఈటెలకు కోరుకున్న స్థానం లభించలేదని ఆయన అనుచరులు తొలి నుంచి అసంతృప్తితో ఉన్నారు. సొంత పార్టీ నేతలే ఈటెలకు అధ్యక్ష పీఠం దక్కకుండా చేస్తున్నారనేది వారి అభిప్రాయం. ఈటెలను బండి సంజయ్ టార్గెట్ చేసి, అధ్యక్ష పదవి రాకుండా బండి ప్రయత్నిస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.