బెంగళూరు పోలీసు కమిషనర్‌ సహా పలువురి సస్పెన్షన్..
x

బెంగళూరు పోలీసు కమిషనర్‌ సహా పలువురి సస్పెన్షన్..

ఆర్‌సీబీ ప్రతినిధులు, డీఎన్‌ఎ ఈవెంట్ మేనేజర్లు, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ప్రతినిధులను అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశం..


Click the Play button to hear this message in audio format

ఐపీఎల్‌ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవ ర్యాలీ బెంగళూరులో పెను విషాదాన్ని నింపింది. 11 మంది ప్రాణాలను బలి తీసుకుంది. మరో 50 మందిని ఆసుపత్రి పాల్జేసింది. ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్నారు.

పలువురిపై సస్పెన్షన్ వేటు..

తొక్కిసలాట(Stampede) ఘటనను పోలీసుల వైఫల్యంగా భావించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) బెంగళూరు(Bangalore) పోలీస్ కమిషనర్ బి. దయానందతో పాటు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎకె గిరీష్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సి బాలకృష్ణ, సెంట్రల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శేఖర్ హెచ్ టెక్కన్నవర్, స్టేడియం ఇన్‌చార్జ్‌గా ఉన్న అదనపు పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వికాష్ కుమార్ వికాష్‌ను సస్పెండ్ చేశారు.

కొత్త కమిషనర్‌గా సీమంత్..

ఇక దయానంద స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సీమంత్ కుమార్ సింగ్‌ను కొత్త పోలీసు కమిషనర్‌గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం..ఆర్‌సీబీ ప్రతినిధులు, డీఎన్‌ఎ ఈవెంట్ మేనేజర్లు, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ) ప్రతినిధులను వెంటనే అరెస్టు చేయాలని డీజీపీ, ఐజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఏకసభ్య కమిటీతో విచారణ..

ఈ దుర్ఘటనను విచారించేందుకు సీఎం ఇప్పటికే కర్ణాటక(Karnataka) హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మైఖేల్ డి'కున్హా నేతృత్వంలో ఏకసభ్య కమిటీ నియమించారు. 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సిద్ధరామయ్య కమిటీని కోరారు.

కేసు కొట్టేయాలని హైకోర్టులో పిటీషన్..

కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) అధ్యక్షుడు రఘు రామ్ భట్, మరికొంతమంది ఆఫీస్ బేరర్లు తమపై నమోదయిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ శుక్రవారం (జూన్ 6) కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం (జూన్ 4) బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటకు సంబంధించి బెంగళూరు పోలీసులు ఆర్‌సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను అరెస్టు చేశారు. అలాగే విజయోత్సవ వేడుకలు నిర్వహించిన DNA ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ఘటన ఎలా జరిగింది?

ఐపీఎల్‌ చరిత్రలో 18 సంవత్సరాల తర్వాత మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించింది. ఈ ఆనందాన్ని జట్టు సభ్యులు తమ అభిమానులతో షేర్ చేసుకోవాలనుకున్నారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం 5 గంటలకు విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్-టాప్ బస్సులో విజయోత్సవ ర్యాలీ ఉంటుందని RCB సోషల్ మీడియాలో పేర్కొంది. ఆ తర్వాత హోం మంత్రి జి పరమేశ్వర ఓపెన్-టాప్ విక్టరీ పరేడ్ ఉండదని చెప్పారు. ఈ రెండు విరుద్ధ ప్రకటనల నేపథ్యంలో ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. మరోవైపు స్టేడియంలోనికి ఫ్రీగా అనుమతిస్తున్నారన్న వదంతులు వ్యాపించాయి. దాంతో స్టేడియం వద్దకు భారీగా అభిమానులు చేరుకోవడం ప్రారంభించారు. వాస్తవానికి స్టేడియ కెపాసిటీ 40 వేలు. కాని స్టేడియం వద్దకు చేరుకుంది సుమారు 3 లక్షల మంది.

Read More
Next Story