
దళిత నేత చెన్నయ్యను కర్నాటక ప్రభుత్వం విస్మరించింది...
రాజ్యంగ సభలో కన్నడలో మాట్లడినే సభ్యుడు, కర్ణాటక ఏకీకరణ కోసం పోరాడిన నేత చెన్నయ్యను స్వర్ణోత్సవ వేళ పక్కన పెట్టారు.
దేశవ్యాప్తంగా కన్నడ మాట్లాడే ప్రజలకు 1947 ఆగస్టు 25 చిరస్మరణీయమైన రోజు. ఆ రోజు కోలార్కు చెందిన దళిత స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది, పార్లమెంటేరియన్ అయిన టి చెన్నయ్య కన్నడలో ప్రసంగించి ఇతర సభ్యులను ఆశ్చర్యపరిచారు.
రాజేంద్ర ప్రసాద్ అనుమతితో..
అప్పట్లో పార్లమెంటులో అధికారిక భాష ఆంగ్లం, హిందీ. కానీ కన్నడలో మాట్లాడటానికి రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అనుమతిని పొందారు చెన్నయ్య. మీరు మీ మాతృభాషలో మాట్లాడితే మీరు చెప్పాలనుకున్నది ఇతరులకు అర్థం కాదని, అపుడు ఎవరూ జోక్యం చేసుకోలేరని అధ్యక్షుడు చెప్పినా.. చెన్నయ్య వెనక్కు తగ్గలేదు. భాషాపర గుర్తింపు ముఖ్యమని ఆయన వాదించారు. తన ప్రసంగాన్ని కన్నడలోనే పూర్తి చేశారు.
మరో కన్నడిగుడు పటేల్
చెన్నయ్య కన్నడలో మాట్లాడిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరో కన్నడిగుడు జెహెచ్ పటేల్ కూడా పార్లమెంట్లో కన్నడలో మాట్లాడి చరిత్ర సృష్టించారు. ఈయన తర్వాత చాలా మంది లోక్సభ సభ్యులు కన్నడలో మాట్లాడారు. అయితే మొదటిసారిగా జాతీయ స్థాయిలో కన్నడ గురించి అవగాహన కల్పించి, కన్నడిగులకు గుర్తుంపు తెచ్చింది చెన్నయ్య. జెహెచ్ పటేల్ మాత్రమే.
1956లో కర్ణాటక ఏకీకరణ, పోర్చుగీసు నుంచి గోవా విముక్తికోసం కోసం తీవ్రంగా పోరాడిన చెన్నయ్యను స్వర్ణోత్సవ వేడుకల వేళ పక్కన పెట్టడంపై కొంతమంది కన్నడీగులు నిరుత్సాహానికి గురయ్యారు. కన్నడ మాట్లాడే ప్రాంతం మైసూర్ రాష్ట్రాన్ని నవంబర్ 1, 1973న కర్ణాటకగా మార్చారు.
గత ఐదు దశాబ్దాలుగా వివిధ కన్నడ ఉద్యమాలతో అనుబంధం ఉన్న రచయిత, కన్నడ ఉద్యమకారుడు ఆర్ఎ. నామ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 1912 అక్టోబరు 12న జన్మించిన చెన్నయ్య కష్టపడి ఎదిగిన పార్లమెంటేరియన్ అని పేర్కొన్నారు.
చెన్నయ్య గాంధీజీకి, డాక్టర్ బిఆర్అంబేడ్కర్ కి కూడా సన్నిహితులుగా ఉండేవారు. ఆయన చొరవతోనే మహాత్మగాంధీ కోలార్ సమీపంలోని కెలగని పేట సందర్శించారు. తర్వాత అదే గాంధీనగర్ అయింది.ఆయన ఎంత నిజాయితీగా జీవించారంటే, జనవరి 19,1985 న చనిపోయే నాటికి ఆయన ఒక చిన్న పెంకుటింటిలో ఉండే వారు.
చెన్నయ్య సొంతవూర్లో నాలుగో తరగతి దాకా చదువుకున్నారు. పేదరికం వల్ల చదువు ఆపేయాల్సి వచ్చింది. అయితే, ఉన్నత చదవులు చదవాలన్న కోరిక చావలేదు. చాన్నాళ్ల తర్వాత మైసూరు మహారాజ కాలేజీ నుంచి మెట్రిక్యులేషన్ పాసయ్యారు. తర్వాత బిఎస్ సి పూర్తి చేశారు.కర్నాటకలో బిఎస్ సి పట్టా పొందిన తొలి దళిత నాయకుడు చెన్నయ్యనే. మంత్రిగా ఉన్నపుడు అట్టడుగు వర్గాల విద్యార్థులకు పెద్ద ఎత్తున హాస్టల్లు నిర్మించారు. కోలారు లోని నాచికేత నిలయ, మైసూరులోని సిద్ధార్థ నిలయ ఆయన నిర్మించినవే.
దురదృష్టకరం..
“చెన్నయ్య అప్పటి మైసూర్లోని కెంగల్ హనుమంతయ్య ప్రభుత్వంలో మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. కర్ణాటకగా నామకరణం చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుపుకుంటున్న స్వర్ణోత్సవాల్లో చెన్నయ్య సేవలను పూర్తిగా మరచిపోవడం దురదృష్టకరం. ఏడు దశాబ్దాల క్రితం పార్లమెంట్లో కన్నడలో మాట్లాడి కన్నడిగులంతా గర్వపడేలా చేసిన వ్యక్తి చెన్నయ్య’’ అని చంద్రశేఖర్ పేర్కొన్నారు. కోలార్లోని పేద దళిత కుటుంబంలో జన్మించారు చెన్నయ్య. కన్నడ భాష కోసం ఆయన చేసిన కృషి తన స్వగ్రామం వెలుపల పెద్దగా తెలియకపోవడం దురదృష్టకరం.
భారత దేశం ఫెడరల్ వ్యవస్థను ఆమోదించింది. అందువల్ల రాష్ట్రాలకు ప్రాంతీయ భాష ద్వారా గుర్తింపు ఉండాలి. ప్రాంతీయ భాషల ఉనికిని గుర్తించినపుడే అది ఫెడరల్ వ్యవస్థ అవుతుందని చెన్నయ్య వాదించే వారు.
చెన్నయ్య తర్వాత పటేల్..
దాదాపు 20 ఏళ్ల తర్వాత 1967లో శివమొగ్గ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సోషలిస్టు, కర్ణాటక తొమ్మిదవ ముఖ్యమంత్రి JH పటేల్గా ప్రసిద్ధి చెందిన జయదేవప్ప హాలప్ప పటేల్ పార్లమెంటు సమావేశంలో కన్నడలో ప్రసంగించారు. తన మాతృభాష కన్నడలో మాట్లాడి లోక్సభలో చరిత్ర సృష్టించారు. అప్పటి స్పీకర్ నీలం సంజీవ రెడ్డి కూడా తన ప్రసంగాన్ని కొనసాగించాలని ప్రోత్సహించారు. మిగతా పార్లమెంటు సభ్యులు కూడా పటేల్ ప్రసంగం శ్రద్ధగా విన్నారు. భారత రాజ్యాంగంలో అన్ని భాషలకు స్థానం కల్పించారు. లోక్సభలో ఏ సభ్యుడైనా తన మాతృభాషలో మాట్లాడే హక్కు ఉందని చెప్పకనే చెప్పారు పటేల్.
సీనియర్ జర్నలిస్టు అరకెరె జయరామ్ తన పుస్తకంలో జేహెచ్ పటేల్ గురించి రాసుకొస్తూ.. “పటేల్ కన్నడ ప్రసంగం మన ఎంపీలకు చాలా నేర్పుతుంది. మన మాజీ ముఖ్యమంత్రి కన్నడలో మాట్లాడినప్పుడే (మార్చి 30, 1967న) కన్నడకు పరిపక్వత వచ్చిందని చెప్పవచ్చు.” అని పేర్కొన్నారు..
నిబంధన ఉల్లంఘన..
మార్చి 30, 1967 వరకు ఉన్న నిబంధన ఏమిటంటే.. ఏ సభ్యుడైనా హిందీ లేదా ఇంగ్లీషులో కాకుండా ఇతర భాషలలో ప్రసంగిస్తే.. ఆంగ్లం లేదా హిందీ భాషలో అనువాదం చేసిన ప్రసంగ కాపీని ముందుగా లోక్సభ సెక్రటేరియట్కు అందించాలి. ఒక సభ్యుడు హిందీ లేదా ఇంగ్లీషులో మాట్లాడి స్థితిలో ఉంటే ఇతర భాషలో మాట్లాడేందుకు అనుమతిని నిరాకరించవచ్చు. ముందస్తు అనువాదం లేకపోతే సదరు సభ్యడి ప్రసంగాలు రికార్డుల్లోకెక్కవు. అయితే ఈ నిబంధనను పటేల్ ఉల్లంఘించారు. పటేల్ కన్నడ ప్రసంగం తర్వాత నాలుగు రోజులకు అప్పటి స్పీకర్ నీలం సంజీవ రెడ్డి మిగతా ఎంపీలతో సమావేశమయ్యారు. సభ్యులు తమ ప్రసంగాలకు హిందీ లేదా ఇంగ్లీషులో అనువాద కాపీని ముందుగా అందించకుండానే రాజ్యాంగంలో పొందుపర్చిన భాషల్లో మాట్లాడవచ్చని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనువాదాన్ని అందించకుండానే పటేల్ను కన్నడలో మాట్లాడేందుకు అనుమతించిన ఘనత నీలం సంజీవ రెడ్డికి, ఆయన డిప్యూటీ ఆర్కె ఖదీల్కర్కి కూడా దక్కుతుంది.
జ్ఞానపీఠ గ్రహీత రచయిత చంద్రశేఖర కంబార మాట్లాడుతూ.. “పార్లమెంటులో పటేల్ కన్నడలో ప్రసంగించి ప్రజల దృష్టిని ఆకర్షించారు. దాదాపు ఒక నెల పాటు పటేల్ ప్రసంగం దేశమంతా ప్రతిధ్వనించింది.’’ అని చెప్పారు.
JH పటేల్ తర్వాత చాలా మంది ఎంపీలు పార్లమెంట్లో కన్నడలో మాట్లాడినా.. కన్నడ భాషను పార్లమెంట్లోకి తీసుకెళ్లిన ఘనత మాత్రం చెన్నయ్య, పటేల్ మాత్రమే దక్కుతుంది.