తమిళనాట పీఎంకేలో తారాస్థాయికి చేరిన విభేదాలు..
x

తమిళనాట పీఎంకేలో తారాస్థాయికి చేరిన విభేదాలు..

తన కొడుకు అన్బుమణి పార్టీకి తీరని ద్రోహం చేశాడని బహిరంగంగా విమర్శించిన పార్టీ చీఫ్ రామదాస్..


Click the Play button to hear this message in audio format

పట్టాలి మక్కల్ కట్చి (PMK) వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ (Dr. S Ramadoss), ఆయన కుమారుడు అన్బుమణి రామదాస్ (Anbumani Ramadoss) మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. తన కొడుకు పార్టీకి ద్రోహం చేశాడని, కుటుంబ విలువలను మంటగలిపాడని రామదాస్ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తిండివనం సమీపంలోని తైలపురం నివాసంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. 35 ఏళ్ల వయసులో అన్బుమణిని కేంద్ర మంత్రిని చేయడమే తాను చేసిన పెద్ద తప్పు అని పేర్కొన్నారు. అసలు అన్బుమణికి నాయకత్వ లక్షణాలే లేవని, అతని నిర్లక్ష్య ప్రవర్తన పార్టీని దెబ్బతీస్తోందని అన్నారు. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా తన మనవడు ముకుందన్‌ నియామకాన్ని ప్రశ్నించిన సొంత తల్లిపై అన్బుమణి దాడికి ప్రయత్నించాడని ఆరోపించారు.

‘పెద్దలంటే లెక్కేలేదు..’

పార్టీ పెద్దలకు అన్భుమణి గౌరవం ఇవ్వడం లేదని ఇటీవల పుదుచ్చేరిలో జరిగిన పీఎంకే సర్వసభ్య సమావేశంలో రామదాసు ఆరోపించారు. కార్యకర్తలను, పార్టీ సీనియర్ నాయకుడు తమిళకుమారన్‌ను కూడా సమావేశానికి హాజరుకాకుండా అడ్డుకున్నాడని చెప్పారు.

తండ్రీకొడుకుల మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో..2025 ఏప్రిల్‌లో పార్టీ అధ్యక్ష పదవి నుంచి అన్బుమణిని తప్పించి రామదాసే పార్టీ పగ్గాలు చేపట్టారు. అన్బుమణికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పు రాబోయే ఎన్నికలలో పార్టీని బలోపేతం చేయడానికేనని రామదాస్ చెప్పుకొచ్చారు. అయితే రామదాసు తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ కోశాధికారి ఎం. తిలగబామా సహా అన్బుమణి మద్దతుదారులు తప్పుబడుతున్నారు. అన్బుమణికే వారంతా మద్దతు ఇస్తున్నారు.

2026 అసెంబ్లీ ఎన్నికలలో రామదాస్ AIADMKతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే అన్బుమణి BJP నేతృత్వంలోని NDAతో కొనసాగాలని పట్టుబడుతున్నారు. ఇదే ఇద్దరి మధ్య దూరానికి ఆజ్యం పోసిందని సమాచారం.

‘గత్యంతరం లేక ఒప్పుకున్నా..’

గత పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని అన్బుమణి, కోడలు సౌమియా అన్బుమణి తనను బలవంతం చేశారని రామదాస్ పేర్కొన్నారు. పొత్తుకు అంగీకరించకపోతే తన ప్రాణాలను తీసుకుంటానని అన్బుమణి బెదిరించడంతో గత్యంతరం లేక పొత్తుకు అంగీకరించానని చెప్పారు.

ఇటీవల రామదాస్ నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి 230 మంది నాయకులను ఆహ్వానించగా.. కేవలం 13 మంది మాత్రమే హాజరుకావడం..పార్టీ విభజనకు బలం చేకూరుస్తుంది. పీఎంకేలోని ఒక వర్గం ఇప్పటికీ రామదాసుకు విధేయుడిగా ఉంది. మరో వర్గం అన్బుమణిని మద్దతు పలుకుతోంది.

Read More
Next Story