
‘ఇప్పుడైనా నమ్ముతారా? ’
EVM యంత్రాల పనితీరుపై KMEA సర్వే; విశ్వసనీయతను వ్యక్తం చేసిన ఓటర్లు; రాహుల్ ‘ఓట్ చోరీ’ ఆరోపణలను కొట్టిపడేస్తున్న బీజేపీ నేతలు..
ఇప్పటిదాకా చాలా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. అధికారానికి దూరమైంది. ఎలక్షన్ కమిషన్(EC)ను అడ్డుపెట్టుకుని బీజేపీ(BJP) ఓట్ల దొంగతనానికి పాల్పడుతుండడమే తమ ఓటమికి కారణమని కాంగ్రెస్(Congress) ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. కర్ణాటకలోని కలబురగి గురించి కూడా రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వానికి చెందిన అధికారిక సంస్థ Karnataka Monitoring and Evaluation Authority (KMEA) రాష్ట్రంలో ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. కర్ణాటకలోని 102 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో రాష్ట్రంలోని నాలుగు డివిజన్ల (బెంగళూరు, బెలగావి, కలబురగి, మైసూరు) పరిధిలోని గ్రామీణ, పట్టణ, రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి 5,100 మంది ఓటర్లు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) లు ఖచ్చితమైన ఫలితాలు ఇస్తాయని 69.39% మంది అంగీకరించగా.. 14.22% మంది గట్టిగా విశ్వసించారు. మరో 6.76% మంది తటస్థ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
బీజేపీ నేతల ఎదురుదాడి..
రాహుల్ వాదనల్లో వాస్తవం లేదని, సర్వేను ఉటంకిస్తూ బీజేపీ నేతలు కాంగ్రెస్పై ఎదురుదాడికి దిగుతున్నారు. ఈవీఎం ఫలితాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని బీజేపీ నాయకుడు కర్ణాటక అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఆర్. అశోక పేర్కొన్నారు.
"పదేపదే ఎన్నికల వైఫల్యాలను జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ 'ఓటు చోరీ' కథను తెరమీదకు తెస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ 'ఓటు చోరి' మరోసారి బయటపడింది! కర్ణాటక ప్రభుత్వం ప్రచురించిన సర్వే నివేదిక ప్రకారం భారతదేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరుగుతాయని మరోసారి తేటతెల్లమైంది." అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర (Vijayendra Yediyurappa) సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
Congress’ “Vote Chori” stands exposed once again!
— Vijayendra Yediyurappa (@BYVijayendra) January 2, 2026
The survey report published by the Government of Karnataka clearly shows that a decisive majority of our people believe elections in India are conducted freely and fairly. This is a direct blow to @RahulGandhi , who unable to… pic.twitter.com/guluqakrEj
రాహుల్ పీపీ ప్రజెంటేషన్..
రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ను అడ్డుపెట్టుకుని బీజేపీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని సెప్టెంబర్ 18న ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లా అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి క్రమపద్ధతిలో తొలగించారని పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు కూడా. ఇతర రాష్ట్రాల్లో నమోదైన మొబైల్ నంబర్లను ఉపయోగించి అలంద్లోని ఓటర్ల పేర్లను తొలగించారని రాహుల్ ఆరోపించారు. తన వాదనకు మద్దతుగా తన ప్రజెంటేషన్ సమయంలో అలాంటి అనేక మొబైల్ నంబర్లను ప్రదర్శించారు.

