కర్నాటక: మొదటిదశ ముగిసిందో.. లేదో.. కూటమిలో చీలికలు కానీ పేలికలు
x

కర్నాటక: మొదటిదశ ముగిసిందో.. లేదో.. కూటమిలో చీలికలు కానీ పేలికలు

తమ పార్టీ అభ్యర్థులకు బీజేపీ నాయకత్వం సహకరించట్లేదని జేడీఎస్ కురువృద్ధుడు, మాజీ ప్రధాని దేవేగౌడ, కమలదళం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కూటమికి మాత్రం..


కర్నాటకలో తొలిదశ పోలింగ్ నిన్ననే ముగిసింది. అన్ని రాజకీయ పార్టీలు పోలింగ్ సరళి ఎలా జరిగింది.. ఎన్ని సీట్లు వస్తాయి.. అంటూ చర్చించుకుంటున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా బీజేపీ- జేడీ(ఎస్) కూటమిలో విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఇది రాబోయే కాలంలో కూటమిలో చీలికలను సూచిస్తోంది.

జేడీ(ఎస్) అభ్యర్థులకు బీజేపీ సహకరించడం లేదంటూ మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ ఇటీవల చేసిన విమర్శలు కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య అంతర్లీనంగా ఉన్న విభేదాలను బహిర్గతం చేశాయి. తన స్వస్థలమైన హసన్‌లో దేవే గౌడ విలేకరుల సమావేశం నిర్వహించి బీజేపీని విమర్శించారు. తమ పార్టీ అభ్యర్థులకు కమలదళం అసలు మద్ధతు ఇవ్వట్లేదని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే జేడీ(ఎస్) కార్యకర్తలు కూడా బీజేపీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశాన్ని దేవేగౌడ హైలైట్ చేసినట్లు అయింది.
"హాసన్‌లో జెడి(ఎస్) అభ్యర్థిని బిజెపి నేత ఒకరు వ్యతిరేకిస్తున్నారని మీరు వినవచ్చు. మాండ్యలో సుమలత సహకరించడం లేదు" అని దేవెగౌడ అన్నారు. దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ నుంచి, ఆయన కుమారుడు హెచ్ డీ కుమారస్వామి మాండ్య నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ స్థానిక నాయకత్వం జేడీ(ఎస్)ను వ్యతిరేకిస్తున్నారు.
కూటమి భాగస్వామిగా బీజేపీ పనితీరుపై దేవెగౌడ తన అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ, కూటమికి ప్రమాదం లేదని అభయం ఇచ్చారు. బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో లోక్ సభ అభ్యర్థిగా ఉన్న తన అల్లుడు డాక్టర్ సిఎన్ మంజునాథ్‌తో సహా తమ పార్టీ అభ్యర్థులందరూ ఎన్నికల్లో విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నెక్ టూ నెక్..
జేడీ(ఎస్) అంతర్గత విశ్లేషణ ప్రకారం మూడు కీలక నియోజకవర్గాలైన హాసన్, మాండ్య, కోలార్‌లో జేడీ(ఎస్)-కాంగ్రెస్‌ మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో జేడీ(ఎస్) గణనీయమైన ఓట్ల శాతాన్ని కోల్పోయినందున ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిందని పార్టీ విశ్లేషిస్తోంది. పాత మైసూరు ప్రాంతంలో బీజేపీ, కాంగ్రెస్‌లు తమ ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగితే భవిష్యత్తులో అది జేడీ(ఎస్)కి సవాల్‌గా మారుతుందని పార్టీ అంతర్గత నివేదిక సూచించింది.
ఈ పరిణామంపై దేవెగౌడ ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. తమను చావు దెబ్బ తీసిన కాంగ్రెస్‌ను ఓడించడమే ఏకైక ఎజెండాగా జేడీ(ఎస్) నాయకత్వం అన్ని నియోజకవర్గాల్లో కాషాయ పార్టీకే మద్దతు పలుకుతోంది. అయితే జేడీ(ఎస్) అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతాల్లో బీజేపీ పాల్గొనడం లేదని జేడీ(ఎస్) వర్గాలు ఆరోపిస్తున్నాయి.
బెంగళూరు రూరల్‌లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సోదరుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి డీకే సురేష్‌పై ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మంజునాథ్ పోటీ పడుతున్నారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్ 2019లో స్వతంత్ర అభ్యర్థి సుమలతపై పోటీ చేసి ఓడిపోయిన మాండ్యాతో సహా, JD(S)కి మరో రెండు స్థానాలను మాత్రమే ఇచ్చింది.
అయితే మరో రెండు మూడు స్థానాలు కూడా ఆ పార్టీకి కంచుకోటలుగానే ఉన్నా, బీజేపీ మాత్రం వాటిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో తమ పార్టీ ఆ స్థానాలను గెలుచుకుందని, వాటిని ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. ఇప్పటికే తాము గతంలో గెలిచిన రెండు స్థానాలు మీకు వదులుకున్నామని వాదించి, దేవేగౌడను ఒప్పించింది. సుమలత బీజేపీలో చేరడంతో పొత్తు లో భాగంగా మాండ్యా ను జేడీ(ఎస్)కి సీటు వదులుకోవాల్సి వచ్చింది.
అయితే, JD(S)లోని నాయకులందరూ బీజేపీతో పొత్తు విషయంలో సంతోషంగా లేరు. కాషాయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న పార్టీ నిర్ణయంపై పలువురు వొక్కలిగ నేతలు అసంతృప్తితో ఉన్నారని, అలాగే గౌడ కుటుంబ సభ్యులకు మినహా వొక్కలిగ నేతలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు ‘ది ఫెడరల్’తో అన్నారు.
అసంతృప్తి కొత్తది కాదు
నెల రోజుల క్రితం, హెచ్‌డి కుమారస్వామి సీట్ల పంపకం, నిర్ణయం తీసుకునే ప్రక్రియపై బిజెపి నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పలువురు JD(S) నాయకులు కూడా BJP నాయకులు తమ పార్టీ అగ్రనాయకత్వాన్ని విస్మరించి నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు.
ఈ ధోరణితో పాత మైసూర్ ప్రాంతంలో వొక్కలిగల మద్ధతు జేడీ(ఎస్) పూర్తిగా కొల్పోతుందని ఆందోళన చెందుతున్నారు. సీనియర్ జేడీ(ఎస్) నేతలతో ముందస్తు సంప్రదింపులు జరపకుండానే బీజేపీ ఏకపక్షంగా 20 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం ఆందోళన కలిగించింది.
అంతేకాదు, దేవెగౌడ, కుమారస్వామిలకు ఆహ్వానం పంపకుండానే ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కర్ణాటక ర్యాలీలు నిర్వహించడం కూటమిని మరింత ఇరుకున పెట్టింది. ఈ అసంతృప్త జ్వాలలు విన్న బీజేపీ రాష్ట్ర చీఫ్ బీవై విజయేంద్ర స్వయంగా కుమారస్వామిని కలిసి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే అంశంపై జేడీ(ఎస్) నాయకత్వంతో మాట్లాడినట్లు తెలిసింది.
JD(S) శ్రేణుల్లో అసంతృప్తి
మూడు నియోజక వర్గాల్లో తమ అభ్యర్థులకు బీజేపీ నుంచి మద్దతు లభించకపోవడంతో దేవెగౌడ ఒకవైపు గగ్గోలు పెడుతున్నప్పటికీ, మరో వైపు సొంత పార్టీలోనే అసమ్మతి ఎదుర్కొంటున్నారు. కోలార్‌ రిజర్వ్‌ నియోజకవర్గంలో మాత్రమే జేడీ(ఎస్‌) ఎస్సీ నేతకు టికెట్‌ ఇచ్చారు.
దేవెగౌడ కుటుంబ సభ్యులకు తప్ప మరెవ్వరికీ లోక్‌సభ అభ్యర్థులుగా ప్రాధాన్యత ఇవ్వకపోవడమే సమస్య అని, ఇది పార్టీలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని మండ్య జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఒకరు ఫెడరల్‌తో అన్నారు. దీంతో పలువురు జేడీ(ఎస్‌) నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు జేడీ(ఎస్‌) అభ్యర్థులకు మద్దతివ్వడానికి ఆసక్తి చూపడం లేదని తెలిపారు.
"పార్టీ తన 'సెక్యులర్' ట్యాగ్‌ను కోల్పోయింది. కాషాయ పార్టీకి మద్దతు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్‌ను ఓడించాలనే దాని ఎజెండా పార్టీపై బూమరాంగ్ కావచ్చు. జేడీ(ఎస్)కు చెందిన ముస్లిం ఓటర్లు కూడా ఇప్పుడు ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. గ్రామ, హోబ్లీ స్థాయిలో పార్టీ స్థావరంలో విభజన స్పష్టంగా కనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు.
మరోవైపు జేడీ(ఎస్) వంశాన్ని ఓడించేందుకు పాత మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ సేఫ్ గేమ్ ఆడుతోందని మరో జేడీ(ఎస్) ఎమ్మెల్యే అన్నారు. వొక్కలిగ నాయకత్వాన్ని తమదే అని చెప్పుకోవడానికి కాంగ్రెస్‌ ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఒక్కలిగ నాయకుడిగా ఎదగడానికి పావులు కదుపుతున్నారు. అందుకే దేవేగౌడ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అది కూడా 91 ఏళ్ల వయస్సులో.
వొక్కలిగ అనుభవజ్ఞుడైన దేవెగౌడ, పార్టీ వొక్కలిగ పునాది చెక్కుచెదరకుండా ఉండేలా ఎన్నికల ర్యాలీలు, కఠినమైన ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారని జెడి(ఎస్) వర్గాలు తెలిపాయి.
అయితే, జేడీ(ఎస్) లోక్‌సభ అభ్యర్థుల పట్ల బీజేపీ మిత్రపక్షాలు ఉదాసీనంగా కనిపిస్తున్న మాండ్యా, హాసన్‌లలో జరుగుతున్న పరిణామాలపై జేడీ(ఎస్) అధినాయకుడు ఆందోళన చెందుతున్నారు.
Read More
Next Story