
‘జ్ఞానశేఖరన్తో నాకెలాంటి సంబంధం లేదు’
బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన తమిళనాడు మంత్రి సుబ్రమణియన్..
అన్నా యూనివర్సిటీ (Anna University) లైంగిక వేధింపుల కేసులో దోషి జ్ఞానశేఖరన్(Gnanasekaran)తో తనకు ఎలాంటి సంబంధం లేదని తమిళనాడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సుబ్రమణియన్ (Subramanian) పేర్కొన్నారు. తాను అతనితో ఎప్పుడూ ఫోన్లో కూడా మాట్లాడలేదని స్పష్టం చేశారు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నామలై(Annamalai) చేసిన ఆరోపణలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు.
‘సుబ్రమణియన్తో జ్ఞానశేఖరన్కు సంబంధాలున్నాయి’
జ్ఞానశేఖరన్ను పోలీసులు అదుపులోకి తీసుకోడానికి కొన్ని నిముషాల ముందు.. అతను స్థానిక డీఎంకే కార్యకర్త కొట్టూరు షణ్ముగం(Shanmugam)తో ఆరుసార్లు ఫోన్లో మాట్లాడారని అన్నామలై ఆధారాలు చూపారు. అదే రోజు రాత్రి 8.34 గంటల ప్రాంతంలో మరోసారి జ్ఞానశేఖరన్ షణ్ముగంకు ఫోన్ చేశాడని, ఆ తర్వాత షణ్ముగం మంత్రి సుబ్రమణియన్కు ఫోన్ చేశాడని కాల్ డేటా చూపించారు. ఈ ముగ్గురి మధ్య జరిగిన సంభాషణను పోలీసులు బయటపెట్టాలని అన్నామలై డిమాండ్ చేస్తున్నారు.
డీఎంకే ముఖ్య నేతలతో జ్ఞానశేఖరన్కు సంబంధాలున్నాయని ఆరోపిస్తూ..ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్తో నిందితుడు కలిసి దిగిన ఫోటోను కూడా ప్రదర్శించారు అన్నామలై. దీనిపై కూడా మంత్రి క్లారిటీ ఇచ్చారు.
"చెన్నైలో భారీ వర్షాలు, వరదల సమయంలో స్థానిక డీఎంకే వార్డ్ కార్యదర్శి కొట్టూర్ షణ్ముగం నాతో కలిసి బాధితులకు టిఫెన్ అందించారు. ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఉన్న జ్ఞానశేఖరన్ నేను భోజనం చేస్తుండగా నాతో కలిసి ఫోటో దిగాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన. అంతేగాని నాకు, జ్ఞానశేఖరన్కు మధ్య ఎలాంటి సంబంధం లేదు," అని సుబ్రమణియన్ వివరించారు.
నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష..
అన్నా యూనివర్సిటీ (Anna University) క్యాంపస్లో సెకండియర్ ఇంజనీరింగ్ విద్యార్థినిపై జ్ఞానశేఖరన్ లైంగిక వేధింపులకు (Sexual assault)పాల్పడ్డాడు. ఈ ఘటనను సెల్ఫోన్లో రికార్డు చేశాడు. ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతానని బాధితురాలిని బెదిరించాడు. ఈ ఘటన డిసెంబర్ 23 వతేదీ రాత్రి 8 గంటలో ప్రాంతంలో జరిగింది. చివరకు 19 ఏళ్ల బాధితురాలు ధైర్యం కూడగట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొట్టూర్పురానికి చెందిన రోడ్డు పక్కన బిర్యానీ అమ్ముకునే 37 ఏళ్ల జ్ఞానశేఖరన్(Gnanasekaran)ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతనిపై అప్పటికే 20కి పైగా దొంగతనం, కిడ్నాప్, దోపిడీ కేసులున్నట్లు బయటపడింది. చివరకు నిందితుడిని డిసెంబర్ 25న అరెస్టు చేశారు. ఈ కేసులో 29 మంది సాక్షులను విచారించిన తర్వాత 30 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.90వేలు జరిమానా విధిస్తూ చెన్నై మహిళా కోర్టు జస్టిస్ ఎం. రాజలక్ష్మి సోమవారం (జూన్ 2) తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.