
బెంగళూరు మెట్రో ప్రయాణికులకు కాస్త ఉపశమనం..
70 శాతం పెంచిన రూటల్లో మాత్రమే టికెట్ ధరలను 30 శాతం వరకు తగ్గిస్తున్నట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ప్రకటించింది.
బెంగళూరులో మెట్రో టికెట్ (Metro fare) ధరలు భారీగా పెరగడంతో ప్రయాణికుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) జోక్యంతో BMRCL గురువారం (ఫిబ్రవరి 13) ధరలను కొంతవరకు తగ్గించింది. తగ్గించిన ధరలు ఫిబ్రవరి 14 (శుక్రవారం) నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ తెలిపింది.
గరిష్ఠ, కనిష్ఠ ధరల్లో మార్పుల్లేవు..
BMRCL మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. మహేశ్వరరావు మాట్లాడుతూ.. కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.90 టికెట్ ధరల్లో ఏ మార్పు లేవని స్పష్టం చేశారు. టికెట్ రేటు 70 శాతం పెంచిన రూట్లలో మాత్రమే 30 శాతానికి తగ్గించామని చెప్పారు. ఈ నిర్ణయంతో దాదాపు 2.5 లక్షల మంది ప్రయాణికులకు ప్రయోజనం కలిగిస్తుంది, " అని పేర్కొన్నారు.
BMRCL సమర్థన..
టికెట్ ధరల పెంపును BMRCL సమర్థించుకుంది. "ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని BMRCL పనిచేస్తుంది. మెట్రో విస్తరణ, నిర్వహణకు భారీగా డబ్బులు అవసరం. 2017 తర్వాత టికెట్ ధరలను పెంచలేదు. పెరుగుతోన్న నిర్వహణ ఖర్చుల కారణంగా టికెట్ ధర పెంపు అనివార్యమైంది," అని వివరణ ఇచ్చారు మహేశ్వరరావు.
కొత్త ధరలతో విద్యార్థులకు ఇబ్బందులు..
టికెట్ ధరలను సుమారు 50 శాతం పెంచినట్లు BMRCL ప్రకటించింది. అయితే కొన్ని మార్గాల్లో టికెట్ ధర డబల్ అయ్యిందని బయటపడింది. రద్దీ సమయాలను దృష్టిలో ఉంచుకుని ‘పీక్ టైం’ స్పెషల్ ఛార్జీలు కూడా ప్రవేశపెట్టింది BMRCL. ధరల పెంపుతో విద్యార్థులు, అల్పాదాయ వర్గాల ప్రయాణికులను తీవ్రంగా ప్రభావితం చేసింది. కొందరు బస్సులు, ప్రైవేట్ వాహనాలను ఎంచుకోవడంతో BMRCL ఆదాయంలో కూడా తగ్గుదల కనిపించింది.
రాజకీయ వివాదం..
మెట్రో టికెట్ ధరల మార్పు రాజకీయ వివాదానికి దారితీసింది. కాంగ్రెస్-బీజేపీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దీనికి కారణమని కాంగ్రెస్ ఆరోపించగా.. బీజేపీ మాత్రం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించింది. మెట్రో స్టేషన్ల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం నిరసనలు చేపట్టి కేంద్రం తీరుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.