సంస్కృతానికి కోట్లు.. తమిళానికి మొసలి కన్నీరు..
x

సంస్కృతానికి కోట్లు.. తమిళానికి మొసలి కన్నీరు..

కేంద్రంపై స్టాలిన్ మరోసారి విమర్శలు..


Click the Play button to hear this message in audio format

నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం తమపట్ల పక్షపాతపూరితంగా వ్యవహరిస్తోందని తమిళనాడు సీఎం స్టాలిక్(MK Stalin) పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ట్విట్టర్ వేదికగా మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. “సంస్కృతానికి (Sanskrit) కోట్లు వస్తాయి. తమిళం(Tamil), ఇతర దక్షిణ భారత భాషలకు మొసలి కన్నీళ్లు తప్ప మరేమీ రావు.” అని పోస్టు చేశారు. 2014–15, 2024–25 మధ్య సంస్కృతం భాషను ప్రోత్సహించడానికి రూ. 2,532.59 కోట్లు చేసిందని, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు కలిపి రూ. 147.56 కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు.

2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశంలోని 1.2 బిలియన్ జనాభాలో తమిళం, తెలుగు, మలయాళం, ఒడియా, కన్నడ మాట్లాడేవారు 21.99 శాతం మంది. అయితే సంస్కృతం మాట్లాడేవారు 24,821 మంది (0.002 శాతం కంటే తక్కువ) మాత్రమే ఉన్నారు. హిందీ (జనాభాలో 43.63 శాతం), ఉర్దూ (4.19 శాతం) వంటి ఇతర ప్రధాన భాషలు కూడా గణనీయంగా తక్కువగా పొందాయి, హిందీ, ఉర్దూ, సింధీలకు కలిపి రూ. 1,317.96 కోట్లు కేటాయించారు.

తిరువణ్ణామలైకి చెందిన ఉపాధ్యాయురాలు ఎస్ సుజాత ఈ అసమానతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. "తమిళం ఒక సజీవ భాష, ఎక్కువగా మాట్లాడే భాషకు తక్కువ నిధులు కేటాయించడం బాధాకరం. తమిళనాడులోని కేంద్రీయ విద్యాలయాలలో తమిళ ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థులు సంస్కృతం లేదా హిందీ నేర్చుకోవాల్సి వస్తోంది’’ అని విమర్శించారు.

‘‘దేశంలోని ఐదు గ్రామాల్లో మాత్రమే సంస్కృతం మాట్లాడతారు. ఎన్ని నిధులు సమకూర్చిన సంస్కృతాన్ని సజీవ భాషగా మార్చలేరు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు సంస్కృతానికి ప్రాధాన్యం ఇవ్వడం పూర్తిగా అన్యాయం’’ అని తమిళ భాషాశాస్త్ర నిపుణుడు ప్రొఫెసర్ దేవ సుందరం పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి స్టాలిన్ పోస్ట్‌పై బీజేపీ నాయకుడు కె అన్నామలై స్పందించారు. "తమిళనాడు ప్రజలు డీఎంకే ప్రభుత్వంపై తమ అసంతృప్తిని, కోపాన్ని బహిరంగంగా వ్యక్తం చేసినప్పుడల్లా.. ఆ కోపాన్ని కేంద్రం మీదకు నెట్టడం స్టాలిన్‌కు పరిపాటిగా మారింది. 2006 నుంచి 2014 వరకు ఎనిమిది సంవత్సరాల కాలంలో.. మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నపుడు సంస్కృతానికి ₹675.36 కోట్లు కేటాయించారు. తమిళానికి రూ.75.05 కోట్లు మాత్రమే ఇచ్చారు. మరి అప్పట్లో ఎందుకు స్పందించలేదు’’ అని అన్నామలై ప్రశ్నించారు. గత సంవత్సరం సంస్కృత భాష అభివృద్ధి కోసం తమిళనాడు ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ రూ. 11.68 కోట్లు ఖర్చు చేసింది. దీనిపై కూడా స్టాలిన్ నుంచి వివరణ కోరుతామని చెప్పారు.

Read More
Next Story