
చేతబడి చేశాడన్న అనుమానంతో యువకుడి హత్య
భద్రాది కొత్తగూడెం జిల్లాలో
చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం భూసరాయి గ్రామంలో వెలుగు చూసింది. పూర్తిగా గుత్తికోయల కుటుంబాలు ఆవాసం ఉండే ఈ ప్రాంతంలో చేతబడి అనే అనుమానంతో మడకం రాజు(35)పై గురువారం గ్రామస్థులు దాడి చేసి చంపారు. ఈ దాడిలో రాజు అక్కడికక్కడే చనిపోయాడు. గ్రామంలో గతవారం ఒక మహిళ మృతి చెందింది. రాజు చేతబడి చేయడం వల్లే ఆమె చనిపోయినట్లు గ్రామస్థులు అనుమానించారు. దీంతో కొందరు గ్రామస్థులు అనుమానుతుడిపై దాడి చేసి చంపారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కొన్ని నెలల క్రితం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత సంవత్సరం అక్టోబర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చారు. చేతబడులు చేస్తున్నాడన్న అనుమానంతో సొంత బాబాయిని మరో వ్యక్తితో కలిసి అత్యంత దారుణంగా హత్య చేశాడు ప్రవీణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రాచబండ్ల కోయిగూడెం గ్రామంలో ఘటన చోటుచేసుకుంది.
జూలూరుపాడు మండలం రాచబండ్ల కోయగూడెం గ్రామానికి చెందిన కుంజా బిక్షం (40) అనే వ్యక్తిని సొంత అన్న కొడుకు కుంజా ప్రవీణ్ హత్య చేశాడు. వరుసకు మామ అయిన మల్కం గంగయ్యతో కలిసి ప్రవీణ్ భిక్షాన్నిహత్య చేశాడు. మద్యం సేవించేందుకు గ్రామ సమీపంలోని చెక్ డ్యాం వద్దకు హతుడిని తీసుకువెళ్లారు. మద్యం సేవించిన అనంతరం బిక్షం ముఖంపై ప్రవీణ్ , గంగయ్య బండ రాయితో కొట్టి హత్య చేశారు. తర్వాత వాగులో పడేసారు.మృతి చెందిన బిక్షం మంత్రగాడు, చేతబడులు చేస్తాడనే అనుమానాలు ఉన్నాయి. తమ కుటుంబ సభ్యులు కూడా గత కొంతకాలంగా అనారోగ్యానికి గురవుతున్నారని ప్రవీణ్ కుటుంబం ఆరోపణలు చేసింది. బిక్షం చేతబడి చేయడం వల్లే తమ కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కక్ష పెంచుకున్న ప్రవీణ్ ఈ హత్యకు పాల్పడ్డాడు.బిక్షం కుటుంబ సభ్యుల వాదన ఇందుకు భిన్నంగా ఉంది. బిక్షం మంత్రగాడు కాదని అతనికి ఎలాంటి చేతబడులు రావని కుటుంబ సభ్యులు వాపోయారు.