
సరిహద్దు ప్రాంతాల నుంచి ఢిల్లీకి చేరుకున్న తెలుగు విద్యార్థులు
విద్యార్థులకు తాత్కాలికంగా ఆన్లైన్ తరగతులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు.
భారత్, పాక్ ఉద్రిక్తతల నడుమ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలోనే దాదాపు 476 మంది తెలుగు విద్యార్థులను కూడా ఢిల్లీకి చేర్చినట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్, పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన 100 మందితో సహా ఆంధ్రప్రదేశ్ నుండి 350 మంది విద్యార్థులు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారని అధికారిక ప్రకటించారు. "ఆంధ్రప్రదేశ్కు చెందిన 90 మంది విద్యార్థులు ఇప్పటికే తమ స్వస్థలాలకు బయలుదేరారు, 260 మంది మా సంరక్షణలో ఉన్నారు" అని ఆదివారం ఆంధ్రప్రదేశ్ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. సరిహద్దు ప్రాంతాలలో ఉన్న రాష్ట్ర ప్రజలకు సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీలో 24x7 కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు అధికారులు.
ఇప్పటివరకు తెలంగాణకు చెందిన విద్యార్థులు 126 మంది ఢిల్లీలోని తెలంగాణ భవన్కు చేరుకున్నారని, ఆదివారం అర్ధరాత్రి నుండి 91 మంది వచ్చారని అధికారులు చెప్పారు. తరలివచ్చిన వారిలో NIT శ్రీనగర్ నుండి 50 మంది విద్యార్థులు, షేర్-ఎ-కాశ్మీర్ వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం నుండి విద్యార్థులు మరియు అధ్యాపకులు, J-K లో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం నుండి విద్యార్థులు ఉన్నారు. "సహాయం పొందిన తర్వాత 57 మంది వ్యక్తులు ఇప్పటికే తమ స్వస్థలాలకు బయలుదేరారు. మిగిలిన వారిని తెలంగాణ భవన్లో ఉంచుతున్నారు" అని అధికారి తెలిపారు.రెండు రాష్ట్ర భవనాలు తరలివచ్చిన వారికి ఉచిత ఆహారం, వసతి, వైద్య సహాయం మరియు రవాణా సౌకర్యాలను అందిస్తున్నాయి.
సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చి ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఉన్న వారికి స్వస్థలాలకు చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వారికి అన్ని సహాయ చర్యలు అందిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఢిల్లీలోని తెలంగాణ భవన్ను నోడల్ ఆఫీస్గా నడుపుతున్నారు. సోమవారం మధ్యాహ్నం వరకు 162 మంది పౌరులు తెలంగాణ భవన్కి చేరుకోగా, వీరిలో జమ్మూ కాశ్మీర్లోని వివిధ విధ్యాసంస్థల నుండి 56 మంది, పంజాబ్ రాష్ట్రం నుండి 106 మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటివరకు 133 మంది తమ స్వగ్రామాలకు బయలుదేరగా, మిగిలినవారికి తెలంగాణ భవన్లో తాత్కాలిక వసతి, భోజనం, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ సోమవారం భవన్ అధికారులతో సమీక్ష జరిపి, అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ‘‘పరిస్థితి నెమ్మదిగా సాధారణమవుతుండటంతో మా విద్యాసంస్థలు తిరిగి క్లాసులకు హాజరు కావాలని సూచిస్తున్నాయి. అయితే మేము ముందుగా ఇంటికెళ్లి, పరిస్థితి పూర్తిగా సాదారణ స్దితికి చేరుకున్న తర్వాతే మళ్లీ క్యాంపస్కు వెళ్లాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.
విద్యార్థుల అభ్యర్థన మేరకు, డా. గౌరవ్ ఉప్పల్ సంబంధిత యూనివర్సిటీల అధికారులతో మాట్లాడి, విద్యార్థులకు తాత్కాలికంగా ఆన్లైన్ తరగతులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. యూనివర్సిటీలు అందుకు సానుకూలంగా స్పందించాయి. కాగా కొంతమంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు పరిస్థితి మెరుగుపడే వరకు ఢిల్లీలోనే వేచి చూసి తిరిగి క్యాంపస్లకు వెళ్ళాలనుకుంటున్నట్ట్లు తెలపగా వారు తిరిగి వెళ్లేవరకు భవన్లోనే ఉండేదుకు అన్ని వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.
ఇక, గడిచిన 24 గంటలుగా సహాయం కోసే చేసే అత్యవసర కాల్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, చాలా తక్కువ మంది విద్యార్థులు మాత్రమే తెలంగాణ భవన్ కి వచ్చే అవకాశం ఉందని మా అంచనా అని ఆయన తెలిపారు. తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరు సహాయం కోసం వస్తే వారికి అన్ని విధాలా అండగా ఉంటామని డా. గౌరవ్ ఉప్పల్ స్పష్టం చేశారు.