తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 890 ఏకగ్రీవాలు
x

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 890 ఏకగ్రీవాలు

తొలి రెండు విడతల ఎన్నికలకు సంబంధించి ఏక్రీవాలను ప్రకటించిన ఎన్నికల సంఘం.


పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ సన్నద్ధం అవుతోంది. మొత్తం మూడు విడతలుగా ఈ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసి.. తొలి రెండు విడతలకు నామినేషన్‌లను కూడా స్వీకరించింది. డిసెంబర్ 11న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అధికారులను ఆరా తీశారు. ఈ సందర్భంగానే ఆమె రెండు విడతల్లో జరిగిన ఏకగ్రీవాల వివరాలను వెల్లడించారు. తొలి విడతలో 395, రెండో విడతలో 495 గ్రామాల్లో ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. అంతేకాకుండా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారని, ఓటర్లను ప్రలోభ పెట్టే అన్ని ప్రయత్నాలను చాలా వరకు నియంత్రించారని చెప్పారు.

ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.8.2కోట్ల నగదును సీజ్ చేసినట్లు రాణికుముదిని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ కోసం మొత్తం 50వేల మంది సివిల్ పోలీసులు విధుల్లో ఉంటారని చెప్పారు. అదే విధంగా 60 ప్లటూన్స్ బృందాలు బయట నుంచి ఎన్నికల భద్రతా విధుల కోసం రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు.

తొలి విడతలోనూ భారీగా నామినేషన్లు

తొలి విడత పంచాయతీ ఎన్నికల స్థానాలకు సర్పంచ్ స్థానాలకు దాదాపు 25654 వేలు, వార్డు మెంబర్ స్థానాలకు 82500వేల వరకు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు చెప్పారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యామ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అవే మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.66 కోట్ల గ్రామీణ ఓటర్లు ఉన్నారని చెప్పారు. మొదటి దశలో 4,236 సర్పంచ్ పదవులకు, అలాగే 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రెండో విడతలో 4,333 సర్పంచ్‌ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుండగా.. మూడో విడతలో 4,159 సర్పంచ్‌ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

రెండో విడతలోనూ కొనసాగిన నామినేషన్ల వరద

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 2న మంగళవారం సాయంత్రానికి ముగిసింది. తొలివిడత తరహాలోనే రెండో విడతలో కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. మరికొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం భారీగా ఆఫర్లు ఇచ్చారు. ఈ క్రమంలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమై మంగళవారం ముగిసింది. ఈ రెండో విడతలో 4322 సర్పంచ్ స్థానాలకు, 38342 వార్డు స్థానాలకు ఎన్నిక జరగనుంది. వీటిలో సర్పంచ్ స్థానాలకు 12479, వార్డు మెంబర్ స్థానాలకు 30040 నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. పలువురు ఏకగ్రీవాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలను, అభ్యర్థులను ప్రలోభపెట్టడం, బెదిరించడం వంటి అంశాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది.

Read More
Next Story