ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు..!
x

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు..!

స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్‌ఓటీ)ని తానే ఏర్పాటు చేశానని ఒప్పుకున్న ప్రభాకర్ రావు.


ఏడాదికి పైగా తెలంగాణలో అంతుచిక్కకుండా ఉన్న అంశం ఏదైనా ఉందంటే అది ఫోన్ ట్యాపింగ్ విషయమే. ఇందులో ఎవరు మాస్టర్ మైండ్, ఎవరెవరు బాధితులు, ఎవరు చేశారు వంటి అనేక ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ1గా ఉన్న ప్రభాకర్ రావును సిట్ అధికారులు రెండు రోజులుగా విచారిస్తున్నారు. రెండో రోజు విచారణలో కీలక పురోగతి లభించినట్లు సమాచారం. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఫోన్ ట్యాపింగ్ తన ఆదేశాల మేరకు జరిగిందని ప్రభాకర్ రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్‌ఓటీ)ని తానే ఏర్పాటు చేశానని, అందులోకి కొందరు అధికారులను తీసుకున్నానని ప్రభాకర్ రావు అంగీకరించారని సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆయన ఇచ్చిన ఈ సమాధానం ఈ కేసును కీలక మలుపు తిప్పే అవకాశాలు ఉన్నాయి. ఆయన సమాధానం మేరకు సిట్ కూడా తన దర్యాప్తు, విచారణ స్టైల్‌ను మార్చడానికి రెడీ అయింది. ఇప్పటికే విచారించిన, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న నిందితులను మరోసారి విచారించాలని ఫిక్స్ అయింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రణీత్ రావు‌ను సిట్ విచారించింది. తాజాగా ఈరోజు మరోసారి విచారణ జరుపుతోంది. వారి నుంచి ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉందని భావించడంతో మరోసారి విచారించాలని సిట్ అధికారులు ప్రశ్నించాలని ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలోనే అసలు ప్రభాకర్రావు చెప్తున్న ఎస్‌ఓటీ సెటప్ ఏంటన్న చర్చ మొదలైంది.

ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రభాకర్ రావు.. ఎస్ఐబీ కార్యాలయంలోనే ఏర్పాటు చేసిన సబ్ ఆఫీస్ ఎస్‌ఓటీదే. కార్యాలయంలో రెండు గదులను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఆ గదులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. వాటిలో అత్యాధునిక కంప్యూటర్లు 17 పెట్టి కార్యకలాపాలు కొనసాగించారు. మావోయిస్ట్‌లు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల పేరుతో వారు అనేక మంది ఫోన్లను ఈ ఎస్ఓటీ కార్యాలయం నుంచే ట్యాప్ చేశారు. ఇందులో ప్రణీత్ రావు అన్ని పనులను దగ్గరుండి చేశారు. ఎంతో డాటాను పర్సనల్ డ్రైవ్స్‌లో సేవ్ చేసుకున్నారు. 4 డిసెంబర్ 2023న ఎస్ఐబీ ఆఫీసులోకి వచ్చిన ప్రణీత్ రావు.. సీసీ కెమెరాలను ఆపేసి దాదాపు 42 హార్డ్ డిస్క్‌లను తీసుకెళ్లాడు. దాంతో పాటుగా దాదాపు 2టీబీల డేటాను డిలీట్ చేశారని, 1600 పేజీల కాల్ డాటా షీట్స్‌ను కూడా తగలబెట్టాడరన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా కూడా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితులను మరోసారి విచారించడం ద్వారా ఈ విషయంలో పలు కొత్త కోణాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది. ఆ దిశగా వారిని విచారించే విధానంలో మార్పులు తెసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.

Read More
Next Story