గల్ఫ్ పాలసీ రూపకల్పనలో రేవంత్ ప్రభుత్వం ముందడుగు
x

గల్ఫ్ పాలసీ రూపకల్పనలో రేవంత్ ప్రభుత్వం ముందడుగు

తెలంగాణలో గల్ఫ్ సంక్షేమబోర్డు,ఎన్నారై పాలసీని తీసుకురావాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది.గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనానికి సలహా కమిటీని ఏర్పాటు చేయనుంది.


తెలంగాణలో గల్ఫ్ సంక్షేమ బోర్డు, ఎన్నారై పాలసీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ప్రతిపాదించారు.ప్రజాభవన్ లో జరిగే ప్రజావాణి‌లో గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.గల్ఫ్ కార్మిక కుటుంబాల పిల్లలకు గురుకులాల్లో సీట్లు కేటాయించాలని నిర్ణయించారు.

- గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ వినోద్ ఆధ్వర్యంలో రూపొందిన గల్ఫ్ బాధితులకు సంబంధించిన 5 అంశాలపై సమావేశంలో చర్చించారు.

గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై సలహా కమిటీ
ప్రధానంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక రాష్ట్రసలహా కమిటీని ఏర్పాటు చేయాలని అందులో గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , నాయకులు ఈ కమిటీ లో సభ్యులుగా నియమించి ఇందుకోసం జీవో విడుదల చేయాలని నిర్ణయించారు.

వారానికి రెండు రోజులు ప్రవాసీ ప్రజావాణి
హైదరాబాద్ ప్రజా భవన్ లో ప్రతి మంగళవారం , శుక్రవారం ప్రజావాణి లో గల్ఫ్ కార్మికుల కోసం ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తే బాగుంటుందని ప్రజాప్రతినిధులు సూచించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రజావాణి లో ఈనెల 20 వ తేదీ నుంచి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గురుకుల పాఠశాలలో, కళాశాలలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో చదవాలని అనుకునే వారికి 100 శాతం అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

గల్ఫ్ కార్మికుల మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2023డిసెంబర్ 7వతేదీ నుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు. గతంలో చనిపోయిన వారి కుటుంబాలకు మానవతా దృక్పథంతో లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కాంగ్రెస్ ఎన్నారైసెల్ సూచించింది.ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు పలు సలహాలు సూచనలు చేశారు.



గల్ఫ్ మృతులకు సీఎంఆర్ఎఫ్ నుంచి ఎక్స్ గ్రేషియా

ఇప్పటికే తన వేములవాడ నియోజకవర్గానికి చెందిన గల్ఫ్ లో మృతి చెందిన రెండు కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ నుంచి వారికి ఎక్స్ గ్రేషియా ఇచ్చినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రైతు భీమా మాదిరి గల్ఫ్ భీమా ఉండాలని ఆయన సూచించారు. పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సింగపూర్ , మలేషియా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

గల్ఫ్‌లో మరణిస్తే శవాన్ని వెంటనే తరలించాలి
టీపీసీసీ ఎన్ఆర్ఐ కన్వీనర్ మంద భీంరెడ్డి మాట్లాడుతూ ఇమిగ్రేషన్ 1982 యాక్ట్ లో గల్ఫ్ దేశాల్లో 18 దేశాలు ఉంటాయని అందులో సింగపూర్ లాంటి దేశాలు కూడా గల్ఫ్ కిందకి వస్తాయన్నారు.గల్ఫ్ కార్మికులు చనిపోతే శవం రావడానికి వారం రోజులకు పైగా పడుతుందని దానిని 48 గంటల్లో ఇక్కడికి వచ్చేలా చూడాలని కోరారు.దేశంలో బెస్ట్ గల్ఫ్ పాలసీ కేరళ రాష్ట్రంలో ఉందని అక్కడ ఉన్న దానిని అధ్యయనం చేయాలని ఆయన సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.


Read More
Next Story