
గవర్నర్ దగ్గరకు ఫార్మాలా కేసు నివేదిక..
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో వేగం పెంచిన దర్యాప్తు సంస్థ.
బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసులో భారీ అవినీతి జరిగిందన్న అంశంపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో కీలక నిందితుల ప్రాసిక్యూషన్కు అనుమతి కోరుతూ తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదిక విషయంలో కీలక పురోగతి వచ్చింది. ఏసీబీ నివేదిక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అందింది. అంతేకాకుండా ప్రభుత్వానికి ఏసీబీ ఇచ్చిన నివేదిక గవర్నర్కు కూడా చేరింది. దీంతో ఫార్ములా కేసులో నిందితుల ప్రాసిక్యూషన్ను దాదాపు అనుమతి లభించినట్లేన్న చర్చ మొదలైంది. ఈ కేసులో తొమ్మిది నెలల పాటు విచారణ జరిపిన ఏసీబీ.. తమ విచారణలో తెలిసిన అనేక విషయాలతో ఓ నివేదికను సిద్ధం చేసింది. మరి కీలక అంశాలు తెలుసుకోవడం కోసం నిందితులైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ విశ్రాంత అధికారి బీఎల్ఎన్ రెడ్డిని ప్రాసిక్యూషన్ చేయాలని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. మరో రెండు మూడు రోజుల్లో ఈ నివేదికపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అవినీతే జరగలేదు..: కేటీఆర్
అయితే ఈ కేసు విషయంలో కేటీఆర్ మాత్రం మొదటి నుంచి ఒకే మాట చెప్తున్నారు. అసలు ఫార్ములా కార్ రేసులో స్కాం లేదు అవినీతి జరగలేదంటున్నారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ను బద్నాం చేయడానికి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలని ఆరోపించారు. అసలు అక్కడ కేసే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందంతా కూడా ఒక లొట్టపిట్ట కేసన్నారు. ఈ-కార్ రేసులో స్కాం జరగలేదు కాబట్టే వాళ్లకి నిరూపించడానికి ఇంత సమయం తీసుకొంటున్నారని, సాక్ష్యాలను సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ సమయంలో ఏసీబీ నివేదికపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది? అనేది కీలకంగా మారింది.