
అధికారులపై ఆదివాసీల దాడి
ఏటూరు నాగారం మండలంలో ఉద్రిక్తత
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రొయ్యూరు సమీప అడవులలో అధికారులపై ఆదివాసీ గిరిజనులు తిరగబడ్డారు. అటవీశాఖ స్థలంలో ఆదివాసీలు గుడిసెలు వేసుకోవడంతో వాటిని తొలగించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు.సోమవారం ఉదయం సుమారు 60 నుంచి 80 మంది అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు, 20 మంది పోలీసుల సహాయంతో అక్కడికి వెళ్లి గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు.దాంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటవీశాఖ అధికారులు, పోలీసులపై పై కత్తులు, కర్రలతో ఆదివాసీలు తిరగబడ్డారు. గుడిసెలను తొలగించేందుకు తెచ్చిన జెసిబి, ట్రాక్టర్లను వెనక్కి పంపించారు. రొయ్యూరు గ్రామానికి చెందిన కొంతమంది ఆదివాసులు సమీపంలోని పోడు భూమిలో గత ఏడాది గుడిసెలు వేసుకున్నారు. ఎన్నోసార్లు అటవీ అధికారులు హెచ్చరించినా వారు గుడిసెలు ఖాళీ చేయకపోవడంతో ,సోమవారం బలవంతంగా ఖాళీచేయించడానికి అధికారులు అక్కడికి వెళ్లారు. ఒక్కసారిగా ఆగ్రహంతో ఎదురుతిరిగిన ఆదివాసీలు ,అధికారులను ప్రతిఘటించారు. పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఒకరు ఆత్మహత్యకూ ప్రయత్నించడం ,పెనుగులాటలో పెట్రోలు కొందరుఅటవీ సిబ్బందిపై పడటంతో గందరగోళం నెలకొంది.
ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చి అడవిని పోడు చేసుకుంటూ నివాసాలు ఏర్పాటు చేసుకుంటే పట్టించుకోని అటవీశాఖ అధికారులు తాము ఉండేందుకు గుడిసెలు వేసుకుంటే ఇబ్బంది పెడుతున్నారంటూ ఆదివాసులు ఆరోపిస్తున్నారు.కత్తులు కర్రలతో ఎదురు దాడికి దిగిన ఆదివాసీలు పోలీసులు చెప్పినా వినిపించుకోలేదు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో అటవీ అధికారులు ,పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.తమ ఆవాసాలకు తగిన రక్షణ కల్పించాలని ,ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని ఆదివాసీలు కోరుతున్నారు.