టీపీసీసీ ఉత్కంఠకు బ్రేక్
x

'టీపీసీసీ' ఉత్కంఠకు బ్రేక్

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఎంతగానో ఎదురుచూస్తున్న పీసీసీ అధ్యక్ష పదవి పై ఉత్కంఠకు తెరపడనుంది.


తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఎంతగానో ఎదురుచూస్తున్న పీసీసీ అధ్యక్ష పదవి పై ఉత్కంఠకు తెరపడనుంది. శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయం మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించనుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. వెస్ట్ బెంగాల్ పీసీసీ అధ్యక్షురాలుగా దీపాదాస్ మున్షీ, కేరళ పీసీసీ అధ్యక్షుడుగా కేసి వేణుగోపాల్, కేసి వేణుగోపాల్ ప్లేస్లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా అశోక్ గెహ్లాట్ లను కాంగ్రెస్ అధిష్టానం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్ మున్షీ ప్లేస్ లో చత్తీస్గడ్ మాజీ సీఎం భూపేష్ బగేల్ రానున్నారు. దీనిపై ఈరోజే రేపో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కుదిరిన సమీకరణలు

ప్రస్తుత టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి. దీంతో ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ పోస్ట్ ఇవ్వాలని హైకమాండ్ ఆలోచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడు, అందుకే ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకే పీసీసీ ఇవ్వాలని ముందు నుంచి చర్చలు నడిచాయి. చివరిగా తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గం వైపే అధిష్టానం ముగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. సామాజిక వర్గం, ప్రాంతీయ నేపథ్యం.. ఇలా అన్ని రకాలుగా మహేష్ గౌడ్ కి అవకాశం కలిసి వచ్చింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మహేష్ గౌడ్ రాజకీయ నేపథ్యం..

బొమ్మ మహేష్ గౌడ్ విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఎన్ఎస్‌యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. తొలిసారి 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా డిచ్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ, ఈ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. అనంతరం 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పీసీసీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం మైనార్టీలకు టికెట్ కేటాయించడంతో మహేష్ గౌడ్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడుగా, 2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా ఆయన పార్టీలో పదవులు పొందారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మహేష్ గౌడ్ ని అదృష్టం వరించింది అని చెప్పాలి. 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో మహేష్ గౌడ్ ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ పదవిని కూడా దక్కించుకోబోతున్నారు. విద్యార్థి దశలో కాంగ్రెస్ పంచన చేరిన ఆయన.. ఎలాంటి కష్టసమయంలోనూ పార్టీని విడిచిపెట్టలేదు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినందుకు.. అధిష్టానం ఇప్పుడు టీపీసీసీ పదవితో గుర్తింపునిస్తోంది అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Read More
Next Story