
ఆమ్రపాలి.. మళ్ళీ తెలంగాణకే
డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ఉత్తర్వులతో నాలుగు నెలల క్రితం ఏపీకి వెళ్లారు.
ఏపీ క్యాడర్లో చేరిన ఐఏఎస్ అధికారిణి కాటా ఆమ్రపాలికి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్లో ఊరట లభించింది. ఆమెను మరోసారి తెలంగాణకే కేటాయించారు. ఈ మేరకు క్వాట్ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తెలంగాణలో పని చేసిన ఆమె.. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ఉత్తర్వులతో నాలుగు నెలల క్రితం ఏపీకి వెళ్లారు. అయితే, డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ తనను తెలంగాణకు కేటాయించాలని ఆమె క్యాట్లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను అనుమతించిన క్యాట్.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుల విషయం తీవ్ర చర్చల్లో నిలిచింది. ఏపీ కేడర్ అధికారులంతా.. ఆంధ్రలో రిపోర్ట్ చేయాలని కేంద్రం గతంలో ఆదేశాలు జారీ చేసింది. కాగా తమను తెలంగాణకే కేటాయించాలంటూ పలువురు అధికారులు క్యాట్ను ఆశ్రయించారు. అయితే వారంతా కూడా ఏపీలో రిపోర్ట్ చేయాల్సిందేనని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాట, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ప్రశాంతి ఏపీలో రిపోర్టు చేశారు. తాజాగా మళ్లీ ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయించడం ప్రస్తుతం కీలకంగా మారింది.