ప్రతీకారంతో మావోయిస్టులు రగిలిపోతున్నారా ?
x
Maoists killed three villagers

ప్రతీకారంతో మావోయిస్టులు రగిలిపోతున్నారా ?

హత్యలుచేయటానికి, కిడ్నాప్ కు కారణం ఏమిటన్న విషయాన్ని మావోయిస్టు(Maoists)లు అధికారికంగా ప్రకటించలేదు


మావోయిస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నట్లు అర్ధమైపోతోంది. అందుకనే ఏదో నెపంతో దొరికినవాళ్ళ మీద పగతీర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కొర్మ గ్రామానికి చెందిన ముగ్గురు గ్రామస్తులను చంపేశారు. చనిపోయిన వారిలో ఒక విద్యార్దిని కూడా ఉన్నది. ముగ్గురిని హత్యచేయటంతో పాటు మరో 12 మందిని కిడ్నాప్ చేశారు. హత్యలుచేయటానికి, కిడ్నాప్ కు కారణం ఏమిటన్న విషయాన్ని మావోయిస్టు(Maoists)లు అధికారికంగా ప్రకటించలేదు. అయితే అందుబాటులో ఉన్న సమాచారంప్రకారం మృతులంతా గతంలో మావోయిస్టులుగా పనిచేసిన కుటుంబసభ్యులు. గతంలో లొంగిపోయిన గంగలూరు ఏరియా కమిటి డీవీసీఎం కమిటి సభ్యుడు పొడియం దినేష్ కుటుంబసభ్యులుగా పోలీసులు గుర్తించారు.

కుటుంబసభ్యులు మార్చి 4వ తేదీన పోలిసుల ముందు లొంగిపోగా తర్వాత గంగలూరు అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మరణించారు. అంటే పోలీసుల ఎన్ కౌంటర్లో 26 మంది మవోయిస్టులు చనిపోవటానికి లొంగిపోయిన దినేష్ కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారమే కారణమని మావోయిస్టులు రగిలిపోతున్నారు. దానికి ప్రతీకారచర్యగానే తాజాగా మావోయిస్టులు హత్యలు, కిడ్నాపులకు పాల్పడినట్లు అనుమానంగా ఉంది. హత్యలను, కిడ్నాపులను పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు.

చనిపోయిన ముగ్గురు జింగు మోడియం, సోమ మోడియం, అనిల్ మండావి ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిని చంపేముందు మావోయిస్టులు గ్రామంలో ప్రజాకోర్టు నిర్వహించారు. వీళ్ళు ముగ్గురు పోలీసులకు ఇన్ఫార్మర్లుగా మారిపోయినట్లు మావోయిస్టులు ప్రజాకోర్టు తర్వాత తీర్మానంచేశారు. తాము ఇన్ఫార్మర్లము కాదని ముగ్గురూ మొత్తుకున్నా మావోయిస్టులు పట్టించుకోలేదు. పోలీసులకు తాము ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదని చెప్పిన మరో ఏడుగురిని మావోయిస్టులు చచ్చేట్లు కొట్టారు. దాంతో మావోయిస్టుల తీర్పుకు వ్యతిరేకంగా గ్రామస్తుల్లో ఎవరూ నోరిప్పలేదు. నోరిప్పితే ఏమవుతుందో గ్రామస్తులకు బాగా తెలుసు కాబట్టే మౌనంగా ఉండిపోయారు. దీన్ని అవకాశంగా తీసుకున్న మావోయిస్టులు ముగ్గురిని చంపి అక్కడినుండి వెళ్ళిపోయారు. వెంటనే చావుదెబ్బలు తిన్న గ్రామస్తులు ఏడుగురిని మిగిలిన వారు బీజాపూర్ లోని ఆసుపత్రికి తరలించారు.

ప్లాన్ చేసి పోలీసులను చంపిన మావోలు

ఈమధ్యనే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంట బ్లాక్ లోని డోండ్రి అడవుల్లో మావోయిస్టులు మందుపాతర పేల్చి పోలీసు అధికారిని చంపేశారు. మందుపాతర పేలుడులో ఏఎస్పీ అక్కడికక్కడే మరణించగా మరో డీఎస్పీ, సీఐ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. పోలీసులను చంపటానికి మావోయిస్టులు గట్టి ప్లానే వేశారు. ఇంతకీ ఆ ప్లాన్ ఏమిటంటే గ్రామంలోని క్రషర్ మిల్లు దగ్గర పనిచేస్తున్న జేసీబీని తగలబెట్టారు. జేసీబీని తగలబెట్టిన సమాచారం గ్రామస్తులు పోలీసులకు అందిస్తారని మావోయిస్టులకు బాగాతెలుసు. అందుకనే గ్రామస్తులు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాలన్న ఉద్దేశ్యంతోనే మావోయిస్టులు జేసీబీని తగలబెట్టారు. అయితే దీన్ని తగలబెట్టేముందు జేసీబీ చుట్టూ మందుపాతరలను అమర్చారు.

ఈవిషయం తెలీనిగ్రామస్తులు జేసీబీ తగలబడుతున్న విషయాన్ని పోలీసులకు చెప్పారు. వెంటనే డీఎస్పీ, సీఐ కానిస్టేబుళ్ళను తీసుకుని ఏఎస్పీ ఆకాశరావు గిరిపుంజి ఘటనా స్ధలంకు చేరుకున్నారు. పోలీసులు జేసీబీ దగ్గరకు రాగానే కాస్త దూరంగా ఉన్న మావోయిస్టులు వెంటనే మందుపాతరలను పేల్చారు. దాంతో ఏఎస్పీ అక్కడికక్కడే మరణించగా డీఎస్పీ భానుప్రకాశ్, సీఐ సోనాల్ గ్వాలా తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు. ఇదికాకుండా చర్ల మండలకేంద్రంలో కూడా నలుగురిని ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు నిద్రపోతున్న వారిని నిద్రలోనే చంపేశారు. మావోయిస్టు కేంద్ర కమిటి ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, కేంద్ర కమిటి సభ్యులు తెంటు లక్ష్మీనర్సింహాచలం, మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్ ఎన్ కౌంటర్లకు ప్రతీకారంగానే మావోయిస్టులు పై ఘటనలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మావోయిస్టుల అసలు టార్గెట్ ఏమిటి ?

మావోయిస్టుల అసలు టార్గెట్ ఆపరేషన్ కగార్(Operation Kagar) ను అడ్డుకోవటమే అని అర్ధమవుతోంది. భద్రతాదళాల ఎన్ కౌంటర్లలో పదులసంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. గతంలో మావోయిస్టులు ఎప్పుడూ ఎదుర్కోనంత నిర్బంధాన్ని ఇపుడు ఎదుర్కొంటున్నారు. ఒకపుడు మావోయిస్టుల షెల్టర్ జోన్లుగా ఉన్న దండకారణ్యంలో చాలా ప్రాంతాలను భద్రతాదళాలు పాగావేశాయి. ప్రతిరోజు అడవులను కూంబింగ్ చేస్తు మావోయిస్టుల కోసం భద్రతాదళాలు జల్లెడపడుతున్నాయి. గట్టిగా చెప్పాలంటే అత్యంత అధునాతన ఆయుధాలతో పాటు ద్రోన్ల వంటి సాంకేతిక సాయంతో మావోయిస్టులను భద్రతాదళాలు వెంటాడి వేటాడి చంపేస్తున్నాయి. దాన్ని తట్టుకోలేక ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపేయాలని మావోయిస్టు నేతలు కేంద్రప్రభుత్వాన్ని బతిమలాడుకుంటున్నారు. అయినా కేంద్రం పట్టించుకోకుండా మావోయిస్టుల ఏరివేతకే మొగ్గుచూపుతున్నది.

తాము చెబితే ఆపరేషన్ కగార్ ను కేంద్రం ఆపటంలేదని రాజకీయపార్టీలు, హక్కుల సంఘాల నేతలను రంగంలోకి దింపి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు మావోయిస్టు నేతలు ప్రయత్నిస్తున్నారు. అయినా ఆపరేషన్ కగార్ ను ఆపేసే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amitshah) తెగేసిచెప్పారు. దాంతో ఉక్రోషాన్ని తట్టుకోలేక, భద్రతాదళాలను నిలువరించలేక, ఎన్ కౌంటర్లను తట్టుకోలేక ఆ కోపాన్ని సామాన్య ఆదివాసీలపై మావోయిస్టులు చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే మందుపాతరలు పేల్చి పోలీసులను చంపటం, అర్ధరాత్రి గ్రామాల్లోకి వెళ్ళి ఇన్ఫార్మర్ల ముద్రవేసి గ్రామస్తులను చంపుతున్నారు. ఇప్పటికి మావోయిస్టులు ఈ పద్దతిలో చాలామందినే చంపారు.

ఆపరేషన్ కగార్ ఎందుకు ఆగటంలేదు ?

మావోయిస్టులు ఎంత మొత్తుకున్నా కేంద్రప్రభుత్వం మాత్రం ఆపరేషన్ కగార్ ను ఆపటానికి ఇష్టపడటంలేదు. దీనికి కారణం ఏమిటంటే దేశంలో 2026, మర్చికల్లా మావోయిస్టులు అన్నవాళ్ళని లేకుండా చేయాలన్నది కేంద్రం పెట్టుకున్న టార్గెట్. దీనికి అనుగుణంగానే భద్రతాదళాలు ఆపరేషన్ కగార్ తో ముందుకు దూసుకువెళుతోంది. ఇన్ఫర్మార్ల నెపంతో గ్రామస్తులను చంపేయటం, ట్రాప్ చేసి అందుబాటులోకి వచ్చిన పోలీసులను ఒకవైపు మావోయిస్టులు చంపేస్తున్నపుడు ఆపరేషన్ కగార్ రూపంలో మావోయిస్టుల ఏరివేతను ఎందుకు ఆపాలన్నది భద్రతాదళాల ప్రశ్న. కాబట్టి ఆపరేషన్ కగార్ ఎంతకాలం సాగుతుంది ? మావోయిస్టులు ఎంతకాలం తప్పించుకుని తిరుగుతారో చూడాల్సిందే.

Read More
Next Story