
ఆపరేషన్ కగార్ టార్గెట్ లో మావోయిస్టు అగ్రనేతలు వీళ్ళేనా ?
ప్రభుత్వాలు ధైర్యంచేసి నిర్మించిన రోడ్లు, బ్రిడ్జీలు, మొబైల్ టవర్లను మావోయిస్టులు పేల్చేసిన ఘటనలు చాలా ఉన్నాయి
రాష్ట్రప్రభుత్వాల సమన్వయంతో కేంద్రప్రభుత్వం 2024లో ఆపరేషన్ కగార్ మొదలుపెట్టింది. ఆపరేషన్ కగార్ ఉద్దేశ్యం ఏమిటంటే దేశంలో మావోయిస్టులను తుడిచిపెట్టేయటమే. కొన్ని రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోకపోవటానికి మావోయిస్టులే అన్నది కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల గట్టి అభిప్రాయం. ఇందులో నిజంకూడా ఉండచ్చు. ఎలాగంటే ప్రభుత్వాలు ధైర్యంచేసి నిర్మించిన రోడ్లు, బ్రిడ్జీలు, మొబైల్ టవర్లను మావోయిస్టులు పేల్చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లోని జనాల కోసం ప్రభుత్వాలు రోడ్లు వేసి రవాణా సౌకర్యం కోసం బస్సులను కూడా వేశాయి. అయితే మావోయిస్టులు రోడ్లను తవ్వేసి, బస్సులను కాల్చేసిన సంఘటనలు చాలానే జరిగాయి. మావోయిస్టులు ఇలాంటి విధ్వంసాలకు ఎందుకు పాల్పడ్డారంటే రోడ్లు ఏర్పాటుచేస్తే మారుమూల ప్రాంతాలకు పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ముసుగులో పోలీసుల రాకపోకలు పెరుగుతాయని. అలాగే టెలిఫోన్ టవర్లను ఎందుకు పేల్చేస్తున్నారంటే సమాచార సాధనాల ద్వారా తమకు పోలీసుల నుండి ఎక్కడ సమస్యలు వస్తాయో అని.
ఈనేపధ్యంలోనే ఎన్డీయే ప్రభుత్వం రెండో విడత ప్రభుత్వం చివరలో నరేంద్రమోడి(Narendra Modi) ఏమిచేశారంటే కేంద్ర హోంశాఖ అమిత్ షా(Amitshah) తో చెప్పి మావోయిస్టు(Maoists) ప్రభావిత రాష్ట్రాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేయించారు. మావోయిస్టుల సమస్య పరిష్కారానికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కాకుండా కేంద్ర, రాష్ట్రప్రభుత్వా సమన్వయంతో పనిచేయాలని. అందుకు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలన్నీ అంగీకరించాయి. ఆసమావేశంలో రెండుముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నది కేంద్రం. అదేమిటంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా వేలాది కోట్లరూపాయలు ఖర్చు చేయాలని. ఇక రెండో నిర్ణయం ఏమిటంటే దేశంలో మావోయిస్టులను ఏరేయాలని. ఇందుకోసమే ఆపరేషన్ కగార్ ఏర్పాటు చేసి మావోయిస్టుల వేట మొదలుపెట్టింది. 2026, మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు ఉండకూడదన్నది అమిత్ షా పెట్టుకున్న టార్గెట్.
ఆపరేషన్ కగార్(Operation Kagar) లో కేంద్రబలగాలతో పాటు రాష్ట్రాల పోలీసు శాఖలకు చెందిన వివిధ విభాగాల్లోని మెరికల్లాంటి సిబ్బందిని ఏర్పాటు చేశాయి. సుమారు లక్షమంది సిబ్బందితో కేంద్రం ఆపరేషన్ కగార్ ను ఏర్పాటైంది. ఇందులో భాగంగా భద్రతాదళాలకు అత్యాధునిక ఆయుధాలు, లేటెస్ట్ కమ్యూనికేషన్ పరికరాలు, వాహనాలు, నిధులను సమకూరుస్తోంది. అడవుల్లో మావోయిస్టుల కోసం జల్లెడపట్టేందుకు అవసరమైన ద్రోన్ల వ్యవస్ధను ఏర్పాటుచేసింది. దాంతో భద్రతాదళాలు ఏమిచేస్తున్నాయంటే అడవుల్లో మావోయిస్టులను వెంటాడి వేటాడి ఎన్ కౌంటర్లు చేస్తున్నాయి. మావోయిస్టు నేతలు ఆపరేషన్ కగార్ దెబ్బను తట్టుకోలేక పదేపదే కాల్పుల విరమణ పాటించాలని కేంద్రాన్ని బతిమలాడుకుంటున్నారు. తమమాట కేంద్రప్రభుత్వం వినదని తెలిసు కాబట్టే ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా రాజకీయ పార్టీల నేతలను, హక్కుల సంఘాల నేతలు, మేథావులను రంగంలోకి దింపి కేంద్రంపై ఒత్తిడికి ప్రయత్నిస్తున్నారు.
మావోయిస్టుల దిగ్బంధం
ఇపుడు విషయం ఏమిటంటే మావోయిస్టులను భద్రతాదళాలు దాదాపు దిగ్బంధం చేసేశాయి. కర్రెగుట్టలు, దుర్గంగుట్టలు, దండకారణ్యం, అబూజ్ మడ్ అడవులు, ఇంద్రావతి నదీ ప్రాంతంలోని నేషనల్ పార్క్ అడవులు మావోయిస్టుల షెల్టర్ కు కంచుకోటల్లాగ ఉండేవి. ఇపుడీ ప్రాంతాల్లోకి భద్రతాదళాలు చొచ్చుకుని వచ్చేశాయి. కర్రెగుట్టలు, దుర్గంగుట్టలు, అబూజ్ మడ్, దండకారణ్యంలో భద్రతాదళాలు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతి క్యాంపులోను అత్యాధునిక ఆయుధాలతో 500కు తగ్గకుండా ఉన్నతాధికారులు సిబ్బందిని నియమిస్తున్నారు. బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లోనే మొబైల్ టవర్లను కూడా రెడీ చేస్తున్నారు. దాంతో మావోయిస్టుల షెల్టర్ జోన్లలో చాలావరకు భద్రతాదళాల వశమైపోయాయి. దీనిఫలితంగా మావోయిస్టు అగ్రనేతలకు దినదిన గండం లాగ తయారైంది పరిస్ధితి.
టాప్ ర్యాకింగ్ నేతలే టార్గెట్టా ?
అడవులను, మావోయిస్టుల షెల్టర్ జోన్లను జల్లెడపట్టి చేసిన కూంబింగ్ లో సెంట్రల్ కమిటి ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోయాడు. రెండు రోజుల గ్యాపులోనే సుధాకర్ తర్వాత అడ్డేలు భాస్కర్ కూడా చనిపోయాడు. నంబాల చనిపోవటం మావోయిస్టులకు చాలా పెద్ద దెబ్బనే చెప్పాలి. ఇపుడు విషయం ఏమిటంటే మిగిలిన టాప్ లీడర్ల పరిస్ధితి ఏమిటన్నది అయోమయంగా తయారైంది. మావోయిస్టుల పరిస్ధితి ఎలాగ తయారైందంటే అయితే పోలీసులకు లొంగిపోవటం లేకపోతే ఎన్ కౌంటర్లలో చనిపోవటం. గడచిన 45 ఏళ్ళలో మావోయిస్టులు ఇపుడు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్ధితులను గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదు. భద్రతాదళాలు మాత్రం టాప్ లీడర్లను టార్గెట్ చేసుకుని అడవుల్లో గాలింపులు జరుపుతున్నారు. టాప్ లీడర్లలో ఎక్కువగా తెలంగాణ వాళ్ళే ఉండటం గమనార్హం.
తెలంగాణ నుండి కేంద్రకమిటిలో ఉన్న గణపతి, అభయ్, దేవ్ జీ, సంగ్రామ్, కోసా, మనోజ్, చంద్రన్న, ఉదయ్, ఊకే గణేష్, వికల్ప్, మైసక్క ముఖ్యులు. జార్ఖండ్ నుండి మిసిర్ బెహ్రా, అనల్ దా, ఛత్తీస్ ఘడ్ నుండి హిడ్మా, పశ్చిమబెంగాల కు చెందిన అజయ్ దాలను భద్రతాదళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. భద్రతాదళాలు తమ టార్గెట్లను చేరుకుంటాయా ? లేకపోతే భద్రతాదళాల టార్గెట్ నుండి పైన చెప్పిన టాప్ ర్యాకింగ్ నేతలు తప్పించుకుంటారా అన్నది చూడాలి.