హైదరాబాద్ లో డేంజర్ బెల్స్: ఒకేఒక్కటి రోజూ 4 ప్రాణాలు తీస్తోంది
x

హైదరాబాద్ లో డేంజర్ బెల్స్: ఒకేఒక్కటి రోజూ 4 ప్రాణాలు తీస్తోంది

హైదరాబాద్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రతిరోజూ దాదాపు నలుగురు ప్రాణాలు కోల్పోతున్నారు. లాన్సెట్ నివేదికలో వెల్లడైన భయంకర విషయాలు.


హైదరాబాద్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. పీల్చే గాలి మరింత ప్రమాదకరంగా మారిపోతోంది. ఎయిర్ పొల్యుషన్ కారణంగా ప్రతిరోజూ దాదాపు నలుగురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయం తమ పరిశోధనలో వెల్లడైనట్టు లాన్సెట్ నివేదిక తెలిపింది. హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం దాదాపు 1,597 మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవిస్తాయని వివిధ పరిశోధనా పద్ధతులను ఉపయోగించి సంవత్సరాలుగా నిర్వహించిన తమ అధ్యయనంలో బయటపడ్డట్టు పేర్కొంది. న్యూ ఢిల్లీలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉందని ఈ నివేదిక చెప్పింది.

కాగా, లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ ఇటీవల 'భారతదేశంలోని పది నగరాల్లో పరిసర వాయు కాలుష్యం, రోజువారీ మరణాలు' అనే అంశంపై ఒక కథనాన్ని ప్రచురించింది. హైదరాబాద్‌లో 2008 నుంచి 2019 మధ్య పార్టిక్యులేట్ మ్యాటర్ (PM) 2.5 కారణంగా 5.6 శాతం మరణాలు నమోదయ్యాయని జర్నల్ వెల్లడించింది.

ఈ PM 2.5 అనేది 2.5 మైక్రాన్లు లేదా చిన్న పరిమాణంలో ఉండే నలుసు కాలుష్య కారకాల వర్గాన్ని సూచిస్తుంది. అవి చాలా చిన్నవిగా ఉన్నప్పుడు, అవి ముక్కు వెంట్రుకలు, శ్లేష్మం వంటి శరీర రక్షణలను సులభంగా దాటుకుని మన శరీరంలోకి లోతుగా ప్రవేశిస్తాయి. ఈ గాలిని ఎక్కువసేపు పీల్చినప్పుడు దగ్గు, శ్వాస సమస్యలు, తీవ్రతరం అయిన ఆస్తమా, బ్రోన్కైటిస్, ఊపిరితిత్తుల పనితీరు క్షీణించడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

అశోకా యూనివర్సిటీ, సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్, కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్, హార్వర్డ్ యూనివర్శిటీ, బోస్టన్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో 2008-2019 మధ్య హైదరాబాద్‌లో వాయు కాలుష్యం కారణంగా 5,552 మంది మరణించినట్లు గుర్తించారు.

సంవత్సరానికి ఏ నగరంలో ఎన్ని మరణాలు?

ఢిల్లీ 11964

ముంబయి 5091

కోల్‌కతా 4678

చెన్నై 2870

అహ్మదాబాద్ 2495

బెంగళూరు 2102

హైదరాబాద్ 1597

పూణె 1367

వారణాసి 831

సిమ్లా 59


Read More
Next Story