
‘అవసరాలకు అనుగుణంగా కోర్సులు’
తెలంగాణ రైజింగ్-2047 కోసం ఏటీసీల అభివృద్ధిపై సీఎం ఫోకస్.
తెలంగాణ రైజింగ్-2047కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్(ఏటీసీ)ల అభివృద్ధి, పురోగతిపై ఫోకస్ పెట్టామని రేవంత్ చెప్పారు. ఈ మేరకు అధికారులతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. ATC ల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత సమయానికి అనుగుణంగా వీలైనంత త్వరగా ATC ల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ATC ల అభివృద్ధి, పురోగతిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని రేవంత్ వెల్లడించారు.. రాష్ట్రంలో మూడు దశల్లో 111 ATC లను అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఫేజ్-1 లో 25, ఫేజ్-2 లో 40, ఫేజ్-3 లో 46 ATC లను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఫేజ్-1, ఫేజ్-2 లో ఇప్పటి వరకు 49 అందుబాటులోకి వచ్చాయన్నారు. ATC లను వీలైనంత త్వరగా పూర్తిగా చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని రేవంత్ సూచించారు. జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ATC ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించే కోర్సులు అక్కడ నిర్వహించాలని సూచించారు. అవసరమైన స్థలం కేటాయింపుతో పాటు అధునాతన సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు తెలిపారు.