నేతన్నలకు పావులా వడ్డీకే రుణాలివ్వండి -బండి సంజయ్ వినతి
x

నేతన్నలకు పావులా వడ్డీకే రుణాలివ్వండి -బండి సంజయ్ వినతి

సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని గిరిరాజ్ సింగ్ కి బండి విజ్ఞప్తి చేశారు.


కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తో బుధవారం భేటీ అయ్యారు. సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని గిరిరాజ్ సింగ్ కి బండి విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేతన్నలు కొనుగోలు చేసేందుకు అవసరమైన ముడిసరుకు డిపో (యార్న్ డిపో)ను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ముడిసరుకు ఖర్చుల కారణంగా నేతన్నలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వారి భారాన్ని తగ్గించేందుకు సబ్సిడీని 80 శాతం మేరకు పెంచాలని విన్నవించారు. ఈ మేరకు గిరిరాజ్ కి బండి సంజయ్ వినతి పత్రాన్ని అందజేశారు.

సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేయడం వల్ల వేలాదిమంది నేత కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని బండి సంజయ్ వివరించారు. ముఖ్యంగా యంత్రాల ఆధునీకరణతో పాటు ఉత్పాదకతను, కార్మికుల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచుతుందని తెలిపారు. నాణ్యమైన వస్త్రాలను అందించడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే యార్న్ ఏర్పాటు వల్ల సిరిసిల్లల నేత కార్మికులకు ముడిసరుకులు సులభంగా, తక్కువ ధరకు లభిస్తాయని తెలియజేశారు.

ప్రస్తుతం నేత కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని పెరిగిన ఖర్చుల వల్ల ముడి సరుకులను కూడా కొనుగోలు చేయడం వారికి కష్టమైపోయిందని బండి వివరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని 80 శాతానికి పెంచడంతోపాటు పావలా వడ్డీకే రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని గిరిరాజ్ ను కోరారు. బండి సంజయ్ విజ్ఞప్తి పట్ల జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. యార్న్ డిపో ఏర్పాటుతోపాటు పవర్ లూం క్లస్టర్ మంజూరు పై చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 80% సబ్సిడీ, పావలా వడ్డీకే రుణాలు వంటి అంశాల అమలు సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులతో చర్చిస్తామని, వారి సలహా మేరకు తగిన నిర్ణయం తీసుకుంటామని బండి సంజయ్ కి జౌళిశాఖ మంత్రి హామీ ఇచ్చారు.

Read More
Next Story