భట్టి విక్రమార్క అసంతృప్తి
x

భట్టి విక్రమార్క అసంతృప్తి

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు.


తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్ధిక ఇబ్బందులను అధిగమించి సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నా ప్రజల్లో రావాల్సిన గుర్తింపు రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ప్రజాభవన్ లో ఏర్పాటైన కాంగ్రెస్ కీలక నాయకులు సమావేశంలో భట్టి తన ఆవేదన వెళ్లగక్కారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించారు.

రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని భట్టి చెప్పారు. "రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టాం. అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తాం. రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామని హామీ ఇచ్చారు. మిగులు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని 25000 చొప్పున నాలుగు దపాలుగా పూర్తి చేశారు. ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన మనం రెండు లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఐదు హామీలు అమలు చేస్తున్నాము" అని భట్టి తెలిపారు.

"పార్లమెంటు ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే అంతా ఆశ్చర్యపోయారు. సీఎం సవాల్ ఓట్ల కోసమే.. ఎన్నికల సవాల్ అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రూపాయి రూపాయి పోగుచేసి రుణమాఫీని అమలు చేయబోతున్నాము. ఆర్ధిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. అయితే అనుకున్నంతగా ఈ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదు" అని భట్టి అసంతృప్తిని వ్యక్తపరిచారు. "కాంగ్రెస్ నాయకులారా, రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూతు, ప్రతి ఓటర్ దగ్గరకు కార్యక్రమాన్ని తీసుకెళ్లాలి. తల ఎత్తుకొని... ఎక్కడ తగ్గకుండా ప్రచారం చేయండి. కాంగ్రెస్ నేతలందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమం రుణమాఫీ. చెప్పిన మాట ప్రకారం చేస్తున్నామని ప్రతి గ్రామానికి కాంగ్రెస్ నాయకులు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది.. అని వివరించి రైతులు ప్రజల హృదయాలు గెలవాలి" అని కాంగ్రెస్ శ్రేణులకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

Read More
Next Story