Bhatti Vikramarka | ‘విద్యుత్ విషయంలో వెనకడుగు వేయం’
x

Bhatti Vikramarka | ‘విద్యుత్ విషయంలో వెనకడుగు వేయం’

వేసవిలో విద్యుత్ అంతరాయం రాకూడదని ఆదేశాలిచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.


వేసవిలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. ఎండలు మండే కొద్ది విద్యుత్ వినియోగం అంత పెరుగుతుంటుంది. ప్రతి ఏడాది వేసవిలో అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడం ప్రభుత్వం ముందు ఉండే అతిపెద్ద సవాల్‌గా మారుతుంటుంది. ఎండల దెబ్బకు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం వంటి సంఘటనలు అనేకం జరుగుతుంటాయి. ప్రస్తుతం వేసవి దగ్గర పడుతున్న క్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. విద్యుత్ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ వేసవిలో ప్రజలకు అవసరమైన విద్యుత్‌ను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ వేసవిలో రెప్పపాటు కూడా అంతరాయం ఏర్పడకూడదని, 1912 నెంబర్ వినియోగదారులందరికీ చేరాలని ఆదేశించారు.

గత వేసవిలో వచ్చిన విద్యుత్ డిమాండ్, రానున్న వేసవిలో ఏ మేరకు విద్యుత్తు డిమాండ్ ఉంటుంది.. అందుకు తగిన విధంగా అధికారులు చేసుకున్న ప్రణాళికల వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అవసరాల మేరకు అధికారులు కోరిన అన్ని వసతులు కల్పించిన నేపథ్యంలో రానున్న వేసవిలో క్షణం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా అనేది సున్నితమైన అంశం, నిత్యావసరం కూడా.. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతరం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

వేసవి ప్రణాళికపై అన్ని స్థాయిల్లో అధికారులు వెనువెంటనే సమావేశం నిర్వహించుకుని క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు ఏ రీతిలో సన్నద్ధంగా ఉన్నారు, వినియోగదారులకు సైతం అవగాహన కల్పించాలి అని చెప్పారు. విద్యుత్ శాఖలో లైన్మెన్ మొదలు విద్యుత్ శాఖ మంత్రి వరకు ఒక కుటుంబంలా పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ఏ సమస్య వచ్చినా వెంటనే పై అధికారికి ఫోన్ చేయాలని, వారు స్పందించని పక్షంలో ఆపై అధికారికి, అలా తనకు కూడా ఫోన్ చేయవచ్చని సిబ్బందికి భరోసా ఇచ్చారు. మీకు క్షేత్రస్థాయిలో కావలసిన వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

హైదరాబాద్ నగరంలో ఎమర్జెన్సీ వాహనాల ద్వారా కొనసాగుతున్న విద్యుత్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కోరిన అన్ని అనుమతులు ఇచ్చాం, మార్చి మొదటి తేదీ నాటికి సబ్ స్టేషన్ల నిర్మాణం ఇతర పనులు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. గత మూడు సంవత్సరాలుగా సబ్ స్టేషన్‌లపై పెరుగుతున్న లోడ్ భారం వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు. బాగా పని చేసే వారికి ప్రోత్సాహకంగా అవార్డులు సైతం ఇచ్చే కార్యక్రమాన్ని విద్యుత్ శాఖలో ప్రారంభించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.

మొన్నటి భారీ వరదల సమయంలో అర్ధరాత్రి కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారని అటువంటివారిని గుర్తించాలని డిప్యూటీ సీఎం అన్నారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించాలని కోరారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పత్తి ఈ రంగంలో ప్రపంచంలో వస్తున్న మార్పులపై సిబ్బందికి అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన డయల్ 1912 కు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ఇలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రతి వినియోగదారునికి తెలిసేలా చేయాలన్నారు.

కరెంటు బిల్లుపైన సైతం 1912 సేవల గురించి ప్రచురించాలని ఆదేశించారు. ఈ విభాగాన్ని పటిష్టం చేసేందుకు సిబ్బంది సంఖ్య పెంచడం, సాంకేతికంగా అదనపు హంగులు కల్పించేందుకు అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. స్టోర్స్ లో అందుబాటులో ఉన్న సామాగ్రి, రాబోయే రోజుల్లో డిమాండ్కు తగిన విధంగా చేసుకుంటున్న ఏర్పాట్లపైనా ఆయన చర్చించారు.

Read More
Next Story