వారిపై కాంగ్రెస్ ఫోకస్... బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారు? ఏ పార్టీ ఎవరికీ గేలం వేస్తోంది అనే అంశాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారు? ఏ పార్టీ ఎవరికీ గేలం వేస్తోంది అనే అంశాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఎలాగైనా ఎన్నికల్లో సత్తా చాటాలన్న పట్టుదలతో బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నాయి. గెలుపు గుర్రాలు అనుకున్న నేతల్ని తమవైపుకు తిప్పుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కి తెర లేపాయి. దీంతో ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతాడో అనే ఆసక్తి నెలకొంది.
బీజేపీలోనే కొనసాగుతా :జితేందర్ రెడ్డి
బీఆర్ఎస్ అసంతృప్తులపై బీజేపీ కన్నేస్తే.. బీజేపీ అసంతృప్తులపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే కాషాయ ముఖ్య నేత, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవడం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా తెలంగాణాలో పీఎం మోదీ పర్యటనకి ఒక్కరోజు ముందే కావడం విశేషం. జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ టికెట్ ఆశించారు. కానీ ఆ టికెట్ డీకే అరుణకి కేటాయించడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి గురువారం హైదరాబాద్ లోని జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోకి జితేందర్ రెడ్డిని ఆహ్వానించారు. దీంతో ఒక్కసారిగా జితేందర్ రెడ్డి బీజేపీని వదిలి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. అయితే పార్టీ మార్పుపై జితేందర్ రెడ్డి స్పందించారు. "నాకు బీజేపీ టికెట్ రాకపోవడంతో సానుభూతి తెలిపేందుకు సీఎం వచ్చారు. నేను పార్టీ మారట్లేదు" అని జితేందర్ రెడ్డి చెప్పారు. కానీ ఆయన పార్టీ మారతారని, ఇటీవల మల్లు రవి రాజీనామా చేసిన ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవి ఆయనకి ఇవ్వనున్నారనే ప్రచారం కొనసాగుతూనే ఉంది.
పార్టీ మారను : మల్లారెడ్డి
మల్లారెడ్డి తన కొడుకు భద్రారెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తారని ప్రకటించారు. కానీ ఆయనపై, కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు, అక్రమ కట్టడాల కూల్చివేతల నేపథ్యంలో.. తమ కుటుంబ సభ్యులెవరూ లోక్ సభ పోటీలో ఉండట్లేదని మల్లారెడ్డి వెల్లడించారు. అయితే ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలవడంతో కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. దీనిపై మాజీ మంత్రి స్పందిస్తూ... "ఓ ప్రైవేట్ కార్యక్రమంలో డీకే శివకుమార్ ని కలిశాము. రాజకీయాల గురించి చర్చించలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. బీఆర్ఎస్ లోనే కొనసాగుతాను" అన్నారు.
కారుకి గుడ్ బై..
మరోవైపు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తో చేయి కలిపారు. ఇదే బాటలో చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. చేవెళ్ల నుండి బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు రెడీ అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిర్ణయం మార్చుకున్నారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేయడంతో ఆ స్థానానికి అధినేత కేసీఆర్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ని ప్రకటించారు. ఆరూరి రమేష్ వ్యవహారం కూడా రాష్ట్రంలో హై డ్రామాని తలపించింది. ఆయన బీజేపీలో చేరతానని ప్రకటించడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయగా గులాబీ నేతలు అడ్డుపడ్డారు. కేసీఆర్, హరీష్ రావులు స్వయంగా బుజ్జగించినప్పటికీ ఆయన మాత్రం బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ ఆయనకి వరంగల్ టికెట్ ని ఆఫర్ చేసింది.
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్...
సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎంపీల విషయంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అయిందనే చెప్పాలి. గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన జహీరాబాద్ ఎంపీ బి.బి.పాటిల్ ఈసారి బీజేపీ అభ్యర్థి అయ్యారు. అలాగే బీఆర్ఎస్ నుంచి గెలిచిన నాగర్ కర్నూల్ ఎంపీ పి. రాములు పోటీకి దూరంగా ఉండగా.. ఆయన కుమారుడు భరత్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాంనాయక్ బీఆర్ఎస్ ని వీడి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ గోడం నగేశ్ కూడా కారు దిగి బీజేపీలో చేరి అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
బీజేపీ అసంతృప్తులపై కాంగ్రెస్ ఫోకస్
ఆదిలాబాద్ బీజేపీ టికెట్ మాజీ ఎంపీ గోడం నగేశ్ కి ఇవ్వడంతో.. ఆ టికెట్ పై ఆశలు పెట్టుకున్న సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, బోధ్ మాజీ ఎమ్మెల్యే బాపురావు రాథోడ్ లు హర్ట్ అయినట్టు తెలుస్తోంది. వీరితో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.