
HILTపై బీఆర్ఎస్ నిజానిర్ధారణ బృందాలు
రూ.5 లక్షల కోట్ల కాంగ్రెస్ పార్టీ భూ కుంభకోణంపై ‘బీఆర్ఎస్’ పోరుబాటకు సిద్ధమైందన్న మాజీ మంత్రి కేటీఆర్.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ(HILTP)పై తమ పార్టీ పోరుబాటకు సిద్ధమయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రకటించారు. ఇందులో నిజానిజాలు తేల్చడం కోసం క్షేత్రస్థాయిలోకి తమ పార్టీ వెళ్లనుందని చెప్పారు. పారిశ్రామిక వాడల్లో పర్యటించి వాస్తవాలను వెలికితీస్తామన్నారు. ఇందులో భాగంగానే 8 నిజనిర్ధారణ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నాయకులతో కూడిన 'నిజనిర్ధారణ బృందాలను' (Fact-Finding Committees) నియమించారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, క్షేత్రస్థాయి పర్యటనలపై దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ మహానగర పరిధిలోని రూ.5లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను, ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ’ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందని స్పష్టం చేశారు.
నిజాన్ని ప్రజల ముందు ఉంచాలి
గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన కోసం, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను, ఇప్పుడు ‘మల్టీ యూజ్ జోన్’ (Multi-Use Zone) పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు, కేవలం ఎస్ఆర్ఓ రేటులో 30 శాతానికే రెగ్యులరైజ్ చేసి, సుమారు రూ. 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టడానికి, కనీసం స్మశాన వాటికలకు కూడా స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం, వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు.
3, 4 తేదీల్లో క్షేత్రస్థాయి పర్యటనలు
ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించి, పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో బృందాలు పర్యటించనున్నాయి. అక్కడ స్థానిక నాయకులను, ప్రజలను కలుపుకొని వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజల ముందు ఉంచనున్నారు. వీటితో పాటు అక్కడి పారిశ్రామిక వాడల ద్వారా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఏమేమి చేయవచ్చు, అక్కడి స్థానిక ప్రజల సుదీర్ఘకాలం డిమాండ్లను ఆకాంక్షలను కూడా పార్టీ నేతలు తెలుసుకోనున్నారు. ఒకప్పుడు అక్కడ పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం ప్రజలు భూములు ఇచ్చిన తీరును ప్రభుత్వం కేటాయించిన తీరును వాటిని అత్యంత చవకగా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు కట్టబెట్టిన అంశాన్ని, వాటి ఉద్దేశాలను పార్టీ నేతల బృందాలు ప్రస్తావించనున్నాయి.
పర్యటన వివరాలు
డిసెంబర్ 03, 04 తేదీలలో హెచ్ఐఎల్టీపీ (HILTP) స్కామ్పై నిజనిర్ధారణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఎనిమిది బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నాయి.
- ఇందులో భాగంగా క్లస్టర్-1లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో గంగుల కమలాకర్, దేశపతి శ్రీనివాస్, మెదక్ ఎమ్మెల్యేల బృందం పాశమైలారం, పటాన్ చెరువు, రామచంద్రాపురం ప్రాంతాలను సందర్శిస్తారు.
- క్లస్టర్-2లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సురభి వాణీ దేవి, ఉప్పల్ నాయకులు కలిసి నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చర్లపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారు.
- క్లస్టర్-3లో శాసనమండలి ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి, మర్రి రాజశేఖర్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు మౌలాలి మరియు కుషాయిగూడ పారిశ్రామిక వాడలను విజిట్ చేస్తారు.
- ముఖ్యంగా క్లస్టర్-4లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాధరమ్ కృష్ణారావు, కేపీ వివేకానంద్తో కలిసి జీడిమెట్ల, కూకట్పల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
- క్లస్టర్-5లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేశ్, గోపాల్, నవీన్ రావు సనత్ నగర్, బాలానగర్ ఏరియాలను పరిశీలిస్తారు.
- క్లస్టర్-6లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, శాంబిపూర్ రాజు మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్కుకు వెళ్తారు.
- క్లస్టర్-7లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, స్వామి గౌడ్, కిషన్ రెడ్డి, కార్తిక్ ఇంద్రా రెడ్డి కాటేదాన్ మరియు హయత్ నగర్ లో పర్యటిస్తారు.
- చివరగా క్లస్టర్-8లో మాజీ మంత్రి మహమూద్ అలి, దాసోజు శ్రావణ్, ఎండీ సలీం చందులాల్ బారాదరి పారిశ్రామిక వాడను సందర్శించి వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తారు.

