కాంగ్రెస్ భరతం పడతాం.. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటతామన్న కేటీఆర్
x

కాంగ్రెస్ భరతం పడతాం.. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటతామన్న కేటీఆర్

ఎన్నికలు ఏవైనా ఎదుర్కోవడానికి రెడీ ఉన్నాం.


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజలు చీద్రించుకునే పరిస్థితి ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘బాకీ కార్డు’తో కాంగ్రెస్ భరతం పడతామన్నారు. ఎన్నికలు ఏవైనా తాము సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామని ఆయన చెప్పారు. వరదల అంశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తీరు ఒకవైపు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లు ఉందని చురకలంటించారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ప్రదీప్ చౌదరితోపాటు పలువురు వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్సీ ఎల్.రమణ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కేటీఆర్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఈ సందర్భంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు గులాబీ హవా నడుస్తోందన్నారు.

కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు ప్రారంభించిన ‘బాకీ కార్డు’ ఉద్యమమే రేవంత్ సర్కార్‌ ను భరతం పట్టే బ్రహ్మాస్త్రమన్నారు కేటీఆర్. గల్లీ ఎన్నికలైనా, ఢిల్లీ ఎన్నికలైనా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని, తెలంగాణలోని సబ్బండ వర్ణాలు తిరిగి కేసీఆర్‌నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నాయన్నారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ప్రదీప్ చౌదరి, కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, తాము ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోయారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారని కానీ ప్రజలకు అన్నీ గుర్తున్నాయన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ అభయహస్తం ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. ఈ బాకీ కార్డే కాంగ్రెస్ పతనాన్ని శాసిస్తుందన్నారు.

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టుగా, హైదరాబాద్ నగరం సమస్యలతో ఆగమాగం అవుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త నగరం కడతానంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ ప్రభుత్వ అసమర్థతతో హైదరాబాద్‌లో చెత్త తీసేవారు కరువయ్యారని, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని, వీధి దీపాలు వెలగడం లేదని మండిపడ్డారు. ఉన్న నగరాన్ని ఉద్ధరించలేని వారు కొత్త నగరం కడతామని ఫోజులు కొట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా పేర్చలేదని, కనీసం ఉన్న రోడ్లను కూడా సరిగా నిర్వహించడం లేదని విమర్శించారు.

రాష్ట్రంలో రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం రైతులు యుద్ధాలు చేసే దుస్థితి ఉండేదని, నేడు మళ్లీ అవే రోజులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కోసం క్యూలైన్లలో చెప్పులు పెట్టే, ప్రాణాలు కోల్పోయే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని, తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాగంటి గోపినాథ్ నాయకత్వంలో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదని గుర్తుచేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆయన సతీమణి మాగంటి సునీతను ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపించడం ఖాయమని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రదీప్ చౌదరి వంటి ప్రజాబలం ఉన్న నాయకుల చేరికతో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

తెలుగువారి ఖ్యాతిని యావత్ భారతదేశానికి చాటిచెప్పింది ఎన్టీఆర్ అయితే, తెలంగాణ అస్తిత్వ పతాకాన్ని, సత్తాను హిమాలయాల స్థాయిలో ఎగరేసింది కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. 14 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రాన్ని, పదేళ్ల పాలనలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.

Read More
Next Story