![ఆప్ ఓటమికి బీఆర్ఎస్ కారణం ఆప్ ఓటమికి బీఆర్ఎస్ కారణం](https://telangana.thefederal.com/h-upload/2024/11/02/487667-konda-surekha.webp)
ఆప్ ఓటమికి బీఆర్ఎస్ కారణం
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలవడంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆప్ ఓటమి వెనక బీఆర్ఎస్ భస్మాసుర హస్తం ఉందంటూ విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలవడంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆప్ ఓటమి వెనక బీఆర్ఎస్ భస్మాసుర హస్తం ఉందంటూ విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ కవితతో కేజ్రివాల్ లిక్కర్ వ్యాపారం ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలకు దూరం చేసిందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. ఫలితంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చతికిలపడిందని తెలిపారు. రాష్ట్రాన్ని అగాథంలోకి నెట్టిన బిఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు దేశంలోని మిగతా పార్టీలను భ్రష్టు పట్టిస్తూ బీజేపీని నిలబెడుతున్నారని ప్రజలు అనుమానిస్తున్నారని మంత్రి తెలిపారు. లిక్కర్ స్కాంతో ఆప్ ప్రభుత్వం, కేజ్రివాల్ పై వ్యతిరేకతే ఆప్ పరాజయానికి దారితీసిందన్న ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే వ్యాఖ్యల్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిస్తే అసెంబ్లీ ఎన్నికల ఫలితం మరోలా వుండేదని మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేయడం వల్ల బీజేపీ పార్టీకి మేలు జరిగిందని అన్నారు. కేజ్రివాల్ వ్యూహాత్మక తప్పిదాలే బీజేపీకి కలిసి వచ్చాయని మంత్రి సురేఖ తేల్చి చెప్పారు. ఈ ఫలితాలన్నింటికి కేజ్రివాల్ స్వయంకృపారాదమే కారణమని పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవని మంత్రి సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అహంకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమికి, పార్లమెంటు ఎన్నికల్లో సున్నా సీట్లకు పరిమితమవడానికి కారణమైందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. పోరాటానికి ప్రత్యామ్నాయ పదమే కాంగ్రెస్ పార్టీ అని మంత్రి సురేఖ అన్నారు. గెలుపోటములు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదని, అధికార పక్షమైన, ప్రతిపక్షమైన నిత్యం ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాట పంథాను వీడదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా భయపడే బిఆర్ఎస్ పార్టీ గెలుపోటములు గురించి మాట్లాడటం విడ్డూరంగా వున్నదని మంత్రి అన్నారు. ప్రజల ఆదరణతో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధిస్తుందని మంత్రి సురేఖ ధీమా వ్యక్తం చేశారు.