
బనకచర్ల భగ్గుమంటుందా..?
తొలిసారి సొంత చొరవతో అఖిలపక్ష సమావేశానికి పిలుపిచ్చిన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య బనకచర్ల జ్వాలలు రోజురోజుకు మరింత ఉధృతం అవుతున్నాయి. ఈ అంశంపై చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ మరి కాసేపట్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత ప్రభుత్వం చొరవతో నిర్వహిస్తున్న తొలి అఖిలపక్ష సమావేశం ఇదే కావడం విశేషం. ఇది వరకు రెండుమూడు సార్లు అఖిలపక్షం సమావేశం అయినా.. అది అందరూ కోరుకున్న సమావేశం. కానీ ఈసారి మాత్రం అంతా కలిసి రావాలని ప్రభుత్వం సొంతగా నిర్వహిస్తున్న అఖిలపక్షం ఇది. బనకచర్ల ప్రాజెక్ట్ని అడ్డుకోవాలని, ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని తెలంగాణ నేతలు మొత్తుకుంటున్నారు. ఈ విషయంలో తెలంగాణలోని మూడు రాజకీయ పార్టీలు మూడు వైఖరులతో ఉన్నాయి. కూటమి కట్టడం వల్లే టీడీపీ తానా అంటే కేంద్రంలోని బీజేపీ తందానా అంటోందని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్.. అధికారంలో ఉండి కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ చోద్యం చూస్తోందని మండిపడుతోంది. మరోవైపు బీజేపీ.. తమకు ఎటువంటి సంబంధం లేదని, బనకచర్లపై అసలు కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అంటోంది. ఇలాంటి సమయంలో బుధవారం.. ఈ అంశం చర్చించడానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపివ్వడం కీలకంగా మారింది. ఈ సమావేశం సందిగ్దంగా మారిన బనకచర్ల అంశాన్ని ఓ కొలిక్కి తెస్తుందా? లేదా మరింత జఠిలం చేస్తుందా? అన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.
అఖిలపక్ష సమావేశానికి ఉత్తమ్ పిలుపు
‘‘ట్రిబ్యునల్, చట్టాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును చేపట్టింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరాలు తెలిపాం. సీఎం రేవంత్రెడ్డి, నేను లేఖలు రాశాం. జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను కూడా కలిశాం. ఏపీ ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నీటి హక్కులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం కేంద్ర జల సంఘం వద్ద ఉన్న గోదావరి-బనకచర్ల ప్రీఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని కోరాం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని తదుపరి కార్యాచరణ తీసుకోవడానికి గురువారం ఎంపీలతో సమావేశమై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించాం’’ అని పేర్కొన్నారు.
‘‘‘ట్రిబ్యునల్, చట్టాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును చేపట్టింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరాలు తెలిపాం. సీఎం రేవంత్రెడ్డి, నేను లేఖలు రాశాం. జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను కూడా కలిశాం. ఏపీ ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నీటి హక్కులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం కేంద్ర జల సంఘం వద్ద ఉన్న గోదావరి-బనకచర్ల ప్రీఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని కోరాం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని తదుపరి కార్యాచరణ తీసుకోవడానికి గురువారం ఎంపీలతో సమావేశమై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించాం’’ అని పేర్కొన్నారు.
ఎన్నిసార్లు లేఖలు రాయాలి: ఉత్తమ్
బనకచర్ల ప్రాజెక్ట్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం.. కేంద్రంపై గుర్రుగా ఉంది. ఈ ప్రాజెక్ట్ను ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకోవాలని ఫిక్స్ అయింది. ఇందుకోసం ఎంతదూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి రెండు సార్లు లేఖలు రాశామని, ఇంకెన్ని సార్లు రాయాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బనకచర్ల తో తెలంగాణ కు అన్యాయం జరుగుతుంది. grmb, cwc ,అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు బనకచర్ల విరుద్దం. అంతర్రాష్ట్ర జలవిధానానికి విరుద్ధంగా బనకచర్ల. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అంగీకరించదు. నిర్మల సీతారామన్ కు లేఖద్వారా వివరించాము. జనవరి 22 న జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కు లేఖ రాశాను. మాకు ఏపి నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదని.. వస్తే అన్ని నిబంధనలను పరిశీలిస్తామని.. మే నెలలో తెలంగాణకు పాటిల్ లేఖ రాశారు. చట్టప్రకారం ముందుకు వెళతామని పాటిల్ మాకు హామీ ఇచ్చారు. ఏపీ ఉల్లంఘనలను పూర్తిగా లేఖల్లో సవివరంగా వివరించాం. కేంద్రం .. చట్ట విరుద్ధంగా.. ఏపీకి సహకరిస్తుందని అనుకోవడం లేదు. తెలంగాణ కు అన్యాయం జరిగితే.. ఎంత వరకైనా పోరాడుతాం. తెలంగాణ నీటి హక్కులకోసం రాజీలేని పోరాటం చేస్తాం.. వెనక్కి తగ్గేదేలే. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి లు కేంద్రాన్ని ఒప్పించాలి’’ అని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
నిమ్మకు నీరెత్తినట్లు కాంగ్రెస్: బీఆర్ఎస్
బనకచర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పలుసార్లు విమర్శలు గుప్పించారు. ‘‘ఏపీ ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్ట్ను సుప్రీంకోర్టుకు వెళ్లయినా అడ్డుకుంటాం. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఏపీకి కేంద్రం నిధులిస్తోంది. మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి కొన్ని లేఖలు రాసి చేతులు దులిపేసుకున్నారు. శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులు జరుగుతున్నా.. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొని వెళ్లమన్నా స్పందించట్లేదు. శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులను వెంటనే ఆపేయాలి. బనకచర్లపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపట్లేదు? గోదావరి జలాలపై తెలంగాణ శాశ్వతంగా హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులు పూర్తయితే రోజుకు 90వేల క్యూసెక్కుల నీటిని ఏపీకి తీసుకెళ్తారు. అదే జరిగితే హైదరాబాద్కు తాగడానికి చుక్క నీరు కూడా ఉండదు. కేఆర్ఎంబీ కళ్లు మూసుకుని ఏపీకి దాసోహమంటోంది’’ అని విమర్శలు గుప్పించారు.
కేంద్రం నిర్ణయమే తీసుకోలే: బీజేపీ
తెలంగాణలో కీలకంగా మారిన బనకచర్ల ప్రాజెక్ట్ అంశంపై బీజేపీ కూడా స్పష్టమైన వైఖరితో ఉంది. అసలు ఈ ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే వెల్లడించారు. ‘‘బనకచర్ల మీద కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. గోదావరి జలాల పంపిణీ మేరకు తెలంగాణకు అన్యాయం జరగవద్దు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ కేంద్రానికి లేఖ రాయాలని కోరుతున్నా. ఎందుకు బనకచర్ల ను నిలిపివేయాలనే దానిపై పూర్తి వివరాలతో జలవనరుల శాఖను కలవాలి. బనకచర్ల వలన తెలంగాణకి య విధంగా నష్టం జరుగుతోందో డీటెయిల్డ్ గా లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూచన. గతవారం ఏపీ ప్రభుత్వం DPR ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆ రిపోర్ట్ పరిశీలించలేదు. బనకచర్ల ప్రాజెక్ట్ రిపోర్ట్ చదవలేదు. అధ్యయనం చేసిన తరువాత నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోంది’’ అని తెలిపారు.
అఖిలపక్షంతో ఏమైనా ఒరుగుతుందా..?
బనకచర్ల విషయంలో మూడు పార్టీలు కూడా పక్కా వైఖరితో ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చొరవ తీసుకుని అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ప్రతి పార్టీ నేతలకు ఫోన్లు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. స్వయంగా సమావేశానికి ఆహ్వానించారు. కేంద్రమంత్రులు కిషన్, బండిని కూడా ఆహ్వానించారు. అయితే ఈ సమావేశం వల్ల బనకచర్ల అంశంలో కదలిక వస్తుందన్న నమ్మకాలు చాలా తక్కకువేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మూడు పార్టీలు కూడా తమ వైఖరిని స్పష్టం చేస్తాయని, కాబట్టి ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్లు బనచర్ల అంశం మిగులుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ అంశంపై అఖిలపక్ష సమావేశం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
బీఆర్ఎస్ ఇప్పుడు స్వరం మారుస్తుందే: ఏపీ మంత్రి
బనకచర్ల అంశంపై జరుగుతున్న రసాభాసపై ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనుమతులన్నీ పొందిన తర్వాతనే పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ను నిర్మిస్తామని నిమ్మలరామానాయుడు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో రాజకీయ దురుద్దేశాలతోనే తెలంగాణ నేతలు కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు సీఎం చం ద్రబాబు వ్యతిరేకం కాదని.. అందుకే కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులను అక్కడి ప్రభుత్వం పూర్తి చేసుకోగలిగిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణను డైవర్ట్ చేసేందుకే బీఆర్ఎస్ నేతలు బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారని తె లిపారు. గతంలో గోదావరి జలాలను తెలంగాణ భూభాగం నుంచి నాగార్జునసాగ ర్, శ్రీశైలం జలాశయాలకు రోజు కు 4 టీఎంసీల చొప్పున వంద రోజుల పాటు 400 టీఎంసీలను తరలిస్తామని.. నాటి ఉభయ రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ ఉమ్మడిగా ప్రకటించలేదా అని నిలదీశారు. అధికారంలో ఉన్నంత కాలం ప్రాజెక్ట్లకు ఓకే చెప్పిన కేసీఆర్.. అధికారం పోగానే ఇప్పుడు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి జలాల విషయంలో కేసీఆర్, జగన్ కలిసి ప్రకటన విడుదల చేయలేదా? అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రానికి అన్యాయం చేయడం తమ ప్రభుత్వ లక్ష్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు.