ఓటుకు నోటు కేసులో సీజేఐ కీలక వ్యాఖ్యలు
x

ఓటుకు నోటు కేసులో సీజేఐ కీలక వ్యాఖ్యలు

ఈకేసులో సీఎం వున్నా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు రావడం అభినందనీయమన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్


ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో జెరూసలెం మత్తయ్యపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌‌ను హైకోర్టు కొట్టివేయడంపై సుప్రీం ధర్మాసనంలో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసిన పిటీషన్ పై సోమవారం విచారణ జరిగింది. ఈకేసుకు సంబంధించి సుప్రీంలో వాదనలు జరుగగా తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఛార్జిషీట్‌లో, ఎఫ్‌ఐఆర్‌లో ఏ4గా ఉన్న నిందితుడిపై ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మేనకా గురుస్వామి కోర్టుకు తెలిపారు.హైకోర్టే ట్రయల్‌ నిర్వహించి తీర్పు ఇచ్చేసిందని ప్రభుత్వం పేర్కొంది. కేసు ప్రాథమిక దశలోనే, నిందితుడిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ని కొట్టివేసిందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. మొత్తం కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయడం దర్యాప్తుపై ప్రభావం చూపుతోంది కాబట్టి దర్యాప్తు కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టును సర్కార్ కోరింది.

విచారణ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సీఎం ఉన్నా,నిందితుడిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడికి రావడాన్ని అభినందించాలని సీజేఐ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మేనకా గురుస్వామి అది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత అని పేర్కొన్నారు.అయితే ఈ కేసులో హైకోర్టు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఆదేశాలు ఇచ్చిందని మత్తయ్య తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.ఇరువురి వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.
Read More
Next Story