
గోదావరి పుష్కరాలకు సన్నాహాలు షురూ..
ప్రముఖ ఆలయాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ సూచన.
గోదావరి పుష్కరాల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి.. ఈ అంశంపై ఉన్నతాధికారులతో చర్చిచంచారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక సూచనలు చేశారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్ల అభివృద్ధిని శాశ్వత ప్రాతిపదికన చేయాలని సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ ఆలయాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ శాశ్వత ఘాట్స్ నిర్మించాలని ఆదేశించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలో ఉన్న ఆలయాలను క్షేత్రస్థాయిలో సందర్శించి ఘాట్స్ నిర్మాణానికి అనువైన ఆలయాలను ఎంపిక చేయాలని ఆదేశించారు.
జాతీయ రహదారులు, రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారుల సమీపంలో ఉన్న గోదావరి పరివాహక ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఆలయ కమిటీలు, అధికారులతో చర్చించి అక్కడ అవసరమైన ఏర్పాట్ల ప్రణాళిక రూపొందించాలన్నారు. మహా కుంభమేళాతో పాటు గతంలో వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల రూపకల్పనలో అనుభవమున్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు..
గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. 2027లో జులై 23వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇప్పటి నుంచి దాదాపు 22 నెలల వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీర ప్రాంతముంది. దాదాపు 74 చోట్ల పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముంటుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
రెండో ప్రాధాన్యంగా పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, తాగు నీరు, స్నానాల ఘాట్లతో పాటు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలన్నీ ఉండేలా ప్లాన్ చేసుకోవాలన్నారు.
అవసరమైన అనుమతులు తీసుకోండి
పుష్కరాల ఏర్పాట్లకు కేంద్రం ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. స్వచ్ఛ భారత్. జల్ జీవన్ మిషన్తో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలన్నింటితో సమన్వయం ఉండే పనులు గుర్తించి, వాటికి అవసరమైన అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. దక్షిణ భారత కుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యాకేజీ కోరేందుకు వీలుగా ఈ పనుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు.