
కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం ఫోకస్
కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించాలని, ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందాలని ఆదేశాలు జారీ చేశారు రేవంత్.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే పరజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. అర్హుల జాబితాలను జిల్లాలకు కూడా పంపడం జరిగింది. కాగా తాజాగా కొత్త రేషన్ కార్డుల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. అర్హులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించాలని, ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందాలని ఆదేశాలు జారీ చేశారు రేవంత్. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
‘‘అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందే. ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ సందర్భంగానే కొత్త రేషన్ కార్డుల డిజైన్లను ఆయన పరిశీలించారు.
అత్యధికంగా పొందే జిల్లాలు ఇవే..
ఇప్పటి వరకు అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ 83,285 కొత్త రేషన్ కార్డులు పొందనుంది. ఆ తర్వాత స్థానాల్లో నిజామాబాద్ 39,131, ఖమ్మం 37,152, భద్రాద్రి-కొత్తగూడెం 29,141, రంగారెడ్డి 29,405 కుటుంబాలు కొత్త రేషన్ కార్డులను అర్హమైనవిగా గుర్తించారు. అదే విధంగా అత్యల్పం జాబితాలో వనపర్తి 6,647, ములుగు 7,198, జయశంకర్ భూపాలపల్లి 8,191, రాజన్న-సిరిసిల్ల 9,731, జనగామ 9,997 కుటుంబాలు కొత్త రేషన్ కార్డులు అందుకోనున్నాయి.
పద్దతి మారింది..
ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు అందించాలంటూ ముందుకు ప్రజల నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్ పద్దతుల్లో దరఖాస్తులు స్వీకరించే వారు. వాటిని పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేసేవారు. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వం కొత్త పద్దతిని అనుసరిస్తోంది. గతేడాది నవంబర్లో చేపట్టిన కుటుంబ సర్వే ఆధారంగా అర్హులను గుర్తిస్తోంది. ఆ సర్వే ఆధారంగానే తెలంగాణలో రేషన్ కార్డులు లేని కుటుంబాలను గుర్తించారు. కొత్త కార్డులు కావాలని కోరినవారివి, ఇప్పటికే ఉన్నకార్డుల్లో పేర్లను నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నవారి సమాచారాన్ని అధికారులు వడబోశారు. ఈ ప్రక్రియ పూర్తియ్యేసరికి రాష్ట్రంలో 6,68,309 కుటుంబాలు కొత్త కార్డులను అర్హమైనవిగా గుర్తించారు. ఈ కుటుంబాల్లో 11,65,052 మంది పేర్లు ఉన్నాయి. గ్రామ, బస్తీ సభల తర్వాత కొత్త కార్డుల పంపిణీ జరుగుతుంది. లబ్ధిదారుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉంటాయని అధికారులు చెప్తున్నారు.