
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానాల బాధ్యత మంత్రులదే !
ఒక్కో మంత్రికి ఒక్కో రాష్ట్రాన్ని కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా సన్నాహాలు చేస్తోంది. సమ్మిట్లో పెట్టుబడుల అవకాశాలు, విధాన సంస్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై ప్రత్యేక చర్చలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణను పరిశ్రమలు, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో జాతీయ కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ఈ సదస్సును కీలక వేదికగా చూస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఈ సమ్మిట్ జరగనుంది. సమ్మిట్ విజయవంతం కావడానికి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, పరిశ్రమల పెద్దల పాల్గొనటం అత్యంత ముఖ్యమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ సమ్మిట్ను విజయవంతం చేయడానికి ప్రతి రోజూ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్.. సమీక్షలు నిర్వహిస్తున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సమ్మిట్కు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని ప్రభుతవ్ం భావించింది. ఇప్పటికే ఈ సమ్మిట్కు ప్రధానమంత్రి ప్రధాని మోదీ, కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ బాధ్యతలను సీఎం తీసుకోగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించే బాధ్యతలను మాత్రం మంత్రులకు అప్పగించారు.
ఆహ్వాన బాధ్యతలు ఇలా:
ఉత్తమ్ కుమార్ రెడ్డి - జమ్మూ & కశ్మీర్, గుజరాత్
దామోదర రాజనర్సింహ - పంజాబ్, హర్యానా
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి - ఆంధ్రప్రదేశ్
శ్రీధర్ బాబు - కర్ణాటక, తమిళనాడు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - ఉత్తర్ ప్రదేశ్
పొన్నం ప్రభాకర్ - రాజస్థాన్
కొండా సురేఖ - ఛత్తీస్గఢ్
సీతక్క - పశ్చిమ బెంగాల్
తుమ్మల నాగేశ్వర్ రావు - మధ్యప్రదేశ్
జూపల్లి కృష్ణారావు - అసోం
వివేక్ వెంకటస్వామి - బీహార్
అడ్లూరి లక్ష్మణ - హిమాచల్ ప్రదేశ్
వాకిటి శ్రీహరి - ఒడిశా
అజారుద్దీన్ - మహారాష్ట్ర

