‘మూసీని ప్రక్షాళన చేసితీరతా’
x

‘మూసీని ప్రక్షాళన చేసితీరతా’

నియో పోలీస్ ట్రంపెట్ ఇంటర్ ఛేంజ్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్.


గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2, 3 స్కీమ్ నియో పోలీస్ వాటర్ సప్లై, సేవరేజ్ ప్రాజెక్ట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ జల మండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 జలాశయాలను ఆయన ప్రారంభించారు. నియోపోలిస్, కోకాపేట్ ప్రాంతాన్ని ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్ట్ చేస్తూ ట్రంపెట్‌ను నిర్మించారు. నియో పోలిస్ ప్రాంతంలో భారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. దీంతో నియోపోలిస్, కోకాపేట ప్రాంతంలో భారీగా ఐటీ కంపెనీలు తరలి రానున్నాయి. ఫ్యూచర్ ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ ట్రంపెట్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ట్రంపెట్ జంక్షన్‌తో మోకిల, శంకర్‌పల్లి ప్రాంతాలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

ఈ ట్రంపెట్ ద్వారా ఎయిర్‌పోర్ట్‌కు 20 నిమిషాల్లో చేరుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. అదే విధంగా నియోపోలిస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలికి సులభమైన కనెక్టివిటీ ఉందని అంటున్నారు. ఓఆర్ఆర్‌కు కనెక్ట్ చేసేందుకు నియోపోలిస్ వద్ద ట్రంపెట్‌కి రెండు చోట్ల టోల్ గేట్స్ ఏర్పాటు చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘1908 లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి నిజాం ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలను వరదల నుంచి కాపాడింది’’ అని అన్నారు.

‘‘వందేళ్లకు పైగా ఈ నగరానికి తాగు నీరు అందుతున్నాయంటే ఆనాటి నిజాం సర్కార్ దూరదృష్టినే కారణం. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయి. 1965 లో మంజీరా నది నుంచి నగరానికి తాగు నీరు అందించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 2002 లో కృష్ణా నదీ జలాలను మూడు దశల్లో నగరానికి తరలించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారు’’ అని విమర్శించారు.

‘‘నెత్తిమీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడింది. కాలుష్యమయమైన మూసీతో నల్లగొండ జిల్లా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషతుల్యమైన మూసీని ప్రక్షాళన చేస్తానని నల్లగొండ జిల్లా ప్రజలకు ఆనాడే మాట ఇచ్చా. 20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్ కు తరలించబోతున్నాం. ఇందులో 16 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి కోసం వినియోగించబోతున్నాం. చెరువులను నింపుకుంటూ 4 టీఎంసీలను మూసీకి తరలించి మూసీని ప్రక్షాళన చేస్తాం ’’ అని ధీమా వ్యక్తం చేశారు.

‘‘శ్రీపాద ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాలను హైదరాబాద్ తరలిస్తున్నాం. ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్ అని మాట్లాడుతున్నారు. చేవెళ్లలో వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాసుల కక్కుర్తితో తలను తొలగించింది మీరు కాదా. చేవెళ్ల, తాండూరు, పరిగికి సాగునీరు అందకపోవడానికి కారణం మీరు కాదా. తుమ్మిడిహెట్టీ దగ్గర ప్రాణహిత చేవెళ్ల కట్టి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తాం. గంగా నదీ, యమునా, సబర్మతీ నదులు ప్రక్షాళన చేయొచ్చు… కానీ మేం మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దా.. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేపట్టలేదు’’ అని అన్నారు.

‘‘ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తాం. అభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరుతున్నా. తెలంగాణ రైసింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ 9 న తెలంగాణ సమాజానికి అంకితం ఇవ్వబోతున్నాం. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం తిప్పికొడుతుంది. నగర అభివృద్ధిలో అందరూ కలిసిరండి. ఇది ఇందిరమ్మ రాజ్యం.. పేదోళ్ల రాజ్యం.. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు.

Read More
Next Story