‘చివరి శ్వాస వరకు ప్రజా సమస్యలే ముఖ్యం’
x

‘చివరి శ్వాస వరకు ప్రజా సమస్యలే ముఖ్యం’

వాలంటీర్ వ్యవస్థ దేశ భవిష్యత్ కు ప్రమాదకరం.


హైదరాబాద్ వేదికగా ‘జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డ్’ ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు మోహన్ గురుస్వామికి ఈ అవార్డును సీఎం రేవంత్ అందించారు. అనంతరం ఆయన.. జైపాల్ రెడ్డి గురించి కీలక విషయాలు పంచుకున్నారు. ఆయన తన చివరి శ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పరితపించారని అన్నారు. విద్యార్థి నాయకుడిగా, శాసన సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా వివిధ హోదాల్లో జైపాల్ రెడ్డి పని చేశారని గుర్తు చేశారు.

‘‘1969 లో తొలిసారి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా, 5 సార్లు లోక్ సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. పెట్రోలియం శాఖ నిర్వహిస్తున్న సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. సమాచార శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రసార భారతి చట్టాన్ని దేశానికి అందించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ఉండాలని ఆయన విశ్వసించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. పార్లమెంట్ లో రాణించిన వారి నుంచి మేధావుల వరకు ఎవరితోనూ జైపాల్ రెడ్డితో వ్యక్తిగత వైరం లేదు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన వ్యక్తి జైపాల్ రెడ్డి’’ అని అన్నారు.

‘‘చివరి శ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారు. పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులపై జైపాల్ రెడ్డి ఎక్కువ ఆలోచించేవారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కల్వకుర్తి ప్రాంతంలో విద్యుత్ అవసరమని గుర్తించి అభివృద్ధికి బాటలు వేశారు. రాజకీయాలలో ధన ప్రవాహం తగ్గించాలని ఆయన ప్రయత్నించారు. తెలంగాణ ఏర్పాటులో ఆయన పాత్ర లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేది కాదు. చర్చ లేకుండానే పార్లమెంట్ లో తెలంగాణ బిల్ ఆమోదించేలా జైపాల్ రెడ్డి ప్రత్యేక పాత్ర పోషించారు. జైపాల్ రెడ్డి చొరవతోనే తెలంగాణ ఏర్పాటు చేశామని సోనియా గాంధీ కూడా ఒక సందర్భంలో నాతో చెప్పారు’’ అని అన్నారు.

‘‘కాంగ్రెస్ ను వీడినా, తిరిగి కాంగ్రెస్ లో చేరినా సైద్ధాంతిక విభేదాలే తప్ప.. పదవుల కోసం ఆయన పార్టీలు మారలేదు.. నాటి ఐడియాలజికల్ పాలిటిక్స్ పోయి ఇవాళ స్విగ్గీ పాలిటిక్స్ వచ్చాయి. దేశ రాజకీయాల్లో సైద్ధాంతిక రాజకీయాలు పోయి మేనేజ్మెంట్ పాలిటిక్స్ వచ్చాయి. కార్యకర్తలు పోయి వాలంటీర్ వ్యవస్థ వస్తోంది. కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్ కు ప్రమాదకరం. యూనివర్సిటీలలో విద్యార్థి రాజకీయలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దేశ రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు సహేతుకమైన సూచన చేస్తే తీసుకోవడానికి మాకు ఇబ్బంది లేదు. అందుకే నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఇప్పటి వరకు శాసనసభ నుంచి ఎవరినీ సస్పెండ్ చేయలేదు. దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి ఒక నిలువెత్తు శిఖరం. పీవీ, జైపాల్ రెడ్డి లాంటి వారి స్ఫూర్తి తెలంగాణ రాజకీయాల్లో ఉండాలి’’ అని కోరారు.

Read More
Next Story