
ఉద్యోగాలు తీస్తేనే ఉద్యోగాలు వస్తాయి: రేవంత్ రెడ్డి
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. దేశ ఆర్ధిక భవిష్యత్ విద్యాశాఖతో ముడిపడి ఉంది. అలాంటి శాఖలో మీరు ఉద్యోగ నియామక పత్రాలు అందుకోవడం గొప్పవిషయమన్నారు సీఎం.
తెలంగాణను నిరుద్యోగ మార్చిన ఘనత గత ప్రభుత్వానిదేనంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పదేళ్లు పాలన కొనసాగించిన బీఆర్ఎస్.. నిరుద్యోగుల సమస్యను పరిష్కరించడంపై దృష్టిపెట్టలేదని, పదేల్లపాటు నిరుద్యోగులకు గాలికొదిలేశారంటూ రేవంత్ విమర్శలు గుప్పించారు. అధికారం రావడంతో నిరుద్యోగులను దగా చేశారని అన్నారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలు అందించామని చెప్పారు. ఈరోజు జూనియర్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరరర్లకు నియామక పత్రాలను సీఎం రేవంత్ అందించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ మేరకు కార్యక్రమం నిర్వహించారు.
ఇందులో విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్. వీటిలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది నిరుద్యోగ సమస్యేనని అన్నారు. రాష్ట్ర సాధనలో నిరుద్యోగుల పాత్ర మరువలేనిదని, కానీ వారిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం నమ్మకద్రోహం చేయడమేనని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం పట్ల గత ప్రభుత్వానికి బాధ్యత లేకపోవడం వల్లే నిరుద్యోగ సమస్యకు ఎటువంటి పరిష్కారం దొరకలేదని అన్నారాయన.
‘గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలు తీసేస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి’ అని గతంలో తాను చెప్పానని సీఎం అన్నారు. కొత్త అధ్యాపకులుగా బాధ్యతలు చేపడుతున్న ప్రతి ఒక్కరూ రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ‘‘ఇది మీకు కేవలం ఉద్యోగం మాత్రమే కాదు. ఇది ఒక భావోద్వేగం. తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగుల పాత్ర క్రియాశీలకమైంది. కానీ గత ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధి చూపలేదు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో మీ కృషి, పట్టుదల ఉంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మీ జీవితంలో పన్నెండేళ్ళు వృథా అయ్యాయి. అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55,163 ఉద్యోగాలను భర్తీ చేశాం. తెలంగాణ ఉద్యమానికి పునాదిగా మారిన నిరుద్యోగుల సమస్యకు మేం శాశ్వత పరిష్కారం చూపామన్న సంతృప్తి మాకుంది’’ అని రేవంత్ తెలిపారు.
‘‘దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. దేశ ఆర్ధిక భవిష్యత్ విద్యాశాఖతో ముడిపడి ఉంది. అలాంటి శాఖలో మీరు ఉద్యోగ నియామక పత్రాలు అందుకోవడం గొప్పవిషయం. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న టీచర్ల బదిలీలు, పదోన్నతుల సమస్యను పరిష్కరించి విద్యాశాఖను ప్రక్షాళన చేశాం. విద్యా ప్రమాణాలు తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయం. ఇది తెలంగాణ రాష్ట్రానికి అవమానకరం. అందుకే విద్య ప్రమాణాలు పెంచేందుకు మీరంతా ఒక భావోద్వేగంతో ఉద్యోగ బాధ్యత నిర్వర్తించాలి. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తీర్చిదిద్దాలి’’ అని కోరారు.
‘‘ప్రతీ ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది… ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఎక్కడ లోపం ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. విద్యార్థులపై ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. అది వారి భవిష్యత్ కు పెట్టుబడి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో మూలాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు పెంచేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను నిర్మించబోతున్నాం. ఇటీవలే 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం రూ.11000 కోట్లు కేటాయించాం. విద్యార్థి, నిరుద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం’’ అని తెలిపారు.
‘‘ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది. వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోంది. క్రికెట్ లో రాణించిన సిరాజ్ కోసం నిబంధనలు సడలించి ఉద్యోగం ఇచ్చాం. బాక్సింగ్ లోరాణించిన నిఖత్ జరీన్ కు డీఎస్పీ ఉద్యోగం కల్పించాం. పారాలింపిక్స్ లో రాణించిన దీప్తి జీవాంజీకి ఇంటి స్థలంతో పాటు ఉద్యోగం ఇచ్చాం. కొంతమంది స్టేచర్ స్ట్రేచర్ అని మాట్లాడుతున్నారు. స్టేచర్ ఉందని విర్రవీగినవారు స్ట్రెక్చర్ మీదకు వెళ్లారు. స్టేచర్ అనేది స్థానానికి తప్ప వ్యక్తులకు ఉండదు’’ అని వ్యాఖ్యానించారు.
‘‘కేసీఆర్ మాకు వారసత్వంగా ఇచ్చింది అప్పులు, తప్పులు మాత్రమే. ప్రతీ నెలా రూ.6500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకే సరిపోతుంది. రాష్ట్రానికి కేసీఆర్ ఆర్థికంగా క్యాన్సర్ ఇచ్చారు. క్యాన్సర్ ముదురుతుంటే రాష్ట్రం దివాళా తీసిందంటారా అని అంటున్నారు. వాస్తవాన్ని ఎన్నాళ్ళు దాచిపెడతారు? నేను వాస్తవాలు చెబుతుంటే… దిగిపో దిగిపో అని మాట్లాడుతున్నారు. కెసీఆర్ కుటుంబం మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ లా అబద్ధాలు మాట్లాడుతున్నారు. అబద్ధాల ప్రాతిపదికన నేను రాష్ట్రాన్ని నడపను.. వాస్తవాలు మీతో పంచుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా. తెలంగాణలో భావితరాల భవిష్యత్ నిర్మాణానికి మీ సహకారం అవసరం’’ అని అన్నారు.