పోలింగ్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
x

పోలింగ్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

పోలింగ్ జరిగిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంగళవారం జూబిలీహిల్స్ లోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, నియోజకవర్గాల ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.


పోలింగ్ జరిగిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంగళవారం జూబిలీహిల్స్ లోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, నియోజకవర్గాల ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అత్యధిక సీట్లను గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ నేతలు అంచనా వేశారు. అన్ని చోట్ల పోలింగ్ తమకు అనుకూలంగా జరిగిందని, ఓటర్లు తమ ప్రజాపాలనను ఆశీర్వదించారని ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు ఉన్న సర్వేల రిపోర్టులు, పార్టీ నేతల అభిప్రాయాలు, వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 సీట్లు పక్కాగా గెలుస్తామనే అంచనాకి వచ్చారు. అన్ని చోట్ల ఓటింగ్ కాంగ్రెస్ కు అనుకూలంగా జరిగిందని, వంద రోజుల కాంగ్రెస్ ప్రజా పాలనకు ఓటేసేందుకు ప్రజలు మొగ్గు చూపారని నేతలు అభిప్రాయాలు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్లశాతం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 39.40 శాతం ఓట్లు, అప్పటితో పోలిస్తే 4 నుంచి 5 శాతానికి మించి పార్టీ ఓటు బ్యాంకు తప్పకుండా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానానికి పోటీ పడిందని, బీఆర్ఎస్ ఎక్కడ కూడా పోటీలో కనిపించలేదని తమకు అందిన సమాచారాన్ని నేతలు విశ్లేషించుకున్నారు.

నల్గొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్​ నగర్​, నాగర్​ కర్నూల్​, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లలో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని కాంగ్రెస్ నేతలు చర్చించుకున్నారు. మిగతా నియోజకవర్గాల్లో సానుకూలత ఉన్నప్పటికీ ఓటర్ల నాడి అంచనాకు చిక్కలేదనే అభిప్రాయానికి వచ్చారు.

Read More
Next Story