
‘స్కిల్స్ ఉంటేనే ఏమైనా సాధించగలం’
చైనా, జపాన్ లాంటి దేశాలైనా మనముందు మోకరిల్లాలంటే స్కిల్స్ పెంచుకోవాలన్న సీఎం రేవంత్.
యువత ఎప్పటికప్పుడు తమ స్కిల్స్ను పెంచుకుంటూ ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. స్కిల్స్ ఉంటేనే మనం సంవత్సరాల తరబడి చదివి సంపాదించుకునే సర్టిఫికెట్లకు విలువ ఉంటుందని అన్నారు. స్కిల్స్ లేకపోతే ఆ సర్టిఫికెట్లు దేనికీ పనికిరాని చిత్తుకాగితాలే అవుతాయని వివరించారు. సరైన స్కిల్స్ ఉంటే చైనా, జపాన్ లాంటి దేశాలు సైతం మన ముందు మోకరిల్లుతాయని, పెద్దపెద్ద సంస్థలు కూడా మన కోసం క్యూలు కడతాయని చెప్పుకొచ్చారు. మల్లెపల్లి ఐటీఐ కారిడార్లో అడ్వాన్స్డ్ టెక్నాజీ సెంటర్ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలో 65 ఏటీసీలనూ ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే యువతకు పలు కీలక సూచనలు చేశారు. చదువు అంటే ఏడాదంతా కాలేజీకి వెళ్లే తెచ్చుకునే సర్టిఫికెట్ కాదని, ఆ సమయంలో మనం సంపాదించుకునే స్కిల్స్ అని అన్నారు.
‘‘తెలంగాణ పునర్ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలి. 20247 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలి. ఉమ్మడి రాష్ట్రంలో మొట్ట మొదట 1956 లో ఐటీఐలను ప్రారంభించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదు. కోర్సులను అప్ గ్రేడ్ చేయకపోవడంతో కాలక్రమేనా ఐటీఐలు నిర్వీర్యమయ్యాయి. మేం అధికారంలోకి వచ్చాక ఐటీఐలను పునరుద్ధరించాలని ఆలోచన చేశాం. ఇవాళ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా అప్ గ్రేడ్ చేశాం. సంకల్పంఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు.. సాధించలేనిది ఏదీ లేదు. మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇవాళ ప్రారంభించుకున్న 65 ఏటీసీలే నిదర్శనం’’ అని అన్నారు.
‘‘రాష్ట్రంలో 65 ఎటీసీలను పూర్తి చేశాం… ఇవాళ మరో 51 ఏటీసీలను మంజూరు చేశాం. ఏడాదిలోగా 51 ఏటీసీల నిర్మాణం పూర్తి చేస్తాం. నైపుణ్యం లేకపోతే సర్టిఫికెట్లు ఎందుకూ ఉపయోగపడవు. యువతకు నైపుణ్యం అందించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని, యువతకు నైపుణ్యంగా అందించాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సాంకేతిక నైపుణ్యంపై ఫోకస్ పెట్టండి… జర్మనీ, జపాన్ లు కూడా మన ముందు మోకరిల్లే రోజు వస్తుంది. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. మీ తలరాతలు మారాలంటే అది మీ చేతుల్లోనే ఉంది’’ అని చెప్పారు.
‘‘ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని ఉపయోగించుకోండి.. సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోండి. డ్రగ్స్, గంజాయి ఈ సమాజానికి పట్టిన చీడ. వ్యసనాలకు బానిస కాకకండి.. తల్లిదండ్రులకు బాధను మిగల్చకండి. ఏటీసీలలలో చదువుకున్న విద్యార్థులకు ఆర్టీసీలో అప్రంటీస్ ఇవ్వాలి. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్కి సూచిస్తున్నా. ఏటీసీలలో చదివే విద్యార్థులకు ప్రతీ నెలా రూ.2 వేలు స్కాలర్ షిప్ అందిచేలా ఆర్ధిక మంత్రిని ఒప్పించి ఇప్పించాలని మంత్రి శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ సోదరుడిగా మీ భవిష్యత్ కోసం మేం ప్రణాళికలు వేస్తున్నాం. మన యువతకు జపనీస్ నేర్పి అక్కడ ఉద్యోగ అవకాశాలను ఇచ్చేందుకు జపాన్ సిద్ధంగా ఉంది’’ అని వెల్లడించారు. అంతేకాకుండా మనిషికి తెలివి, పని చేసే కమిట్మెంట్ ఉంటే చాలు ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని అన్నారు. మన యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.